Ghee Adulteration Debate: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేజేతులా కొన్ని అవకాశాలను కోల్పోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెయ్యి కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ పూర్తయింది. కోర్టులో చార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. నెయ్యిలో కల్తీ జరిగిందని సీట్ ధ్రువీకరించింది. అయితే పామాయిల్ తో కూడిన రసాయనాలు కలిపారని తేల్చింది. అయితే నెయ్యిలో జంతు కొవ్వు కలపలేదు అని వైసిపి వాదించడం ప్రారంభించింది. అటు తరువాత హెరిటేజ్, ఇండాపూర్ డైరీని ప్రస్తావిస్తూ.. ఆ రెండింటి మధ్య బంధం ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ప్రారంభించింది. అయితే సభ బయట కాదు లోపలకు వచ్చి వాదనలు వినిపించాలని టిడిపి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరింది. ప్రస్తుతం శాసనసభలో దీనిపై చర్చ నడుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఈ చర్చలో పాల్గొనక పోవడం.. సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.
కుదిపేస్తున్న వైనం..
నెయ్యి కల్తీ అంశం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. ప్రజల్లో ఒక రకమైన గందరగోళం ఉంది. మధ్యలో హెరిటేజ్( heritage) ప్రస్తావన తీసుకొచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మండలిలో ఆ పార్టీకి మెజారిటీ ఉండడంతో చర్చకు పట్టుపడుతోంది. చర్చకు అవకాశం కల్పించాలని వాయిదా తీర్మానాలను ఇస్తోంది. కానీ మండలి సంప్రదాయాలకు విరుద్ధమని చెప్పి చైర్మన్ దానికి అంగీకరించలేదు. దీనిపై వైసీపీ ఎమ్మెల్సీలు ఆగ్రహంగా ఉన్నారు. సభలో హెరిటేజ్ పై చర్చకు అనుమతిస్తే జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారని వైసీపీ నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ ఇప్పుడు సభలో ప్రభుత్వం దీనిపై చర్చ ప్రారంభించింది. పూర్తి ఆధారాలతో పాటు అసలు ఏం జరిగింది అనే దానిపై ఫుల్ క్లారిటీ ఇస్తోంది ప్రభుత్వం. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి హయాంలో టీటీడీ విధానాలు, 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ చేసిన మార్పులు, నెయ్యి కల్తీ వ్యవహారాన్ని బయటపెడుతోంది కూటమి ప్రభుత్వం.
ఆధారాలు బయట పెడుతున్న ప్రభుత్వం..
అయితే హెరిటేజ్ పై చర్చిస్తే సభకు వస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్ళిపోయారు. దీనిని వైసీపీ నేతలు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. కూటమి పూర్తి వివరాలతో అన్ని అంశాలను బయటపెడుతోంది. ఇటువంటి విలువైన సమయంలో జగన్మోహన్ రెడ్డి సభకు హాజరు కాకపోవడం పై మాత్రం ఆందోళన చెందుతోంది. మరోవైపు హెరిటేజ్ పై వచ్చిన ఆరోపణలతో పాటు వైసిపి హయాంలో జరిగిన పరిణామాలు అన్నింటిని వివరిస్తోంది కూటమి ప్రభుత్వం. వరుసగా కల్తీ నెయ్యి వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అన్ని ప్రతికూలతలే కనిపిస్తున్నాయి.