CI Nagaraju arrest: ఏపీ రాజకీయాల్లో సాయి కృష్ణ అనే యువకుడి అదృశ్యం కేసు పెద్ద దుమారమే రేపింది. దీనిని కాపుల అంశం గా మార్చాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. కానీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. సమగ్ర దర్యాప్తు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐ నాగరాజు పై క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే తాజాగా సిఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అరెస్టు చేశారు. తొలుత సిఐ నాగరాజు పై సస్పెన్షన్ వేటు వేశారు. తరువాత కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఏకంగా అరెస్టు చేశారు. అయితే సిఐ నాగరాజుకు మద్దతుగా కృష్ణలంక ప్రజలు భారీ ఆందోళనకు దిగారు. అయినా సరే ఇది రాష్ట్రస్థాయి అంశంగా మారడంతో విచారణలో భాగంగా సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత కోర్టులో హాజరు పరిచే అవకాశం కూడా ఉంది.
రాజకీయాంశంగా వైసిపి..
సాయి కృష్ణ అదృశ్యం కేసును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుగా వెలుగులోకి తెచ్చింది. కాపు యువకుడు ఈ కేసును నీరుగార్చుతున్నారని వైసీపీ ఆరోపించింది. జగన్మోహన్ రెడ్డి సైతం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అయితే సీఎం చంద్రబాబు బాధిత కుటుంబాన్ని సచివాలయానికి పిలిపించి మాట్లాడారు. సాయి కృష్ణ తల్లిని ఓదార్చారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈరోజు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకుంది. సాయి కృష్ణ లాకప్ డెత్.. దహనం చేశారంటూ అతడి తల్లి విజయలక్ష్మి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అందుకే కృష్ణలంకలోని స్వర్గపురి స్మశాన వాటికలో సిబ్బంది నుంచి పడమట సీఐ పవన్ కిషోర్ వివరాలను సేకరించారు. మరోవైపు సిఐ నాగరాజుకు మద్దతుగా స్థానికులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. చర్యలు వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ నాగరాజును అరెస్టు చేసే క్రమంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదనపు బలగాల సాయంతో నాగరాజును అదుపులోకి తీసుకోవాల్సి వచ్చింది.
సమగ్ర దర్యాప్తు..
మరోవైపు సాయి కృష్ణ అదృశ్యం మిస్టరీ పై పోలీసులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరా ఫుటేజ్ ను పరిశీలించారు. అయితే ఇప్పటికే ఆ ఫుటేజ్ తీసేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు దర్యాప్తులో సీఐ నాగరాజు ఏం చెబుతారు? ఎటువంటి సంచలన విషయాలు వెల్లడిస్తారు? అనేది చర్చనీయాంశం అయ్యింది. తదుపరి పరిణామాలు ఏంటనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..
