Grey Junglefowl protection laws: మనలో చాలామందికి ముక్క లేనిది ముద్ద దిగదు. ఉదయం టిఫిన్ లో, మధ్యాహ్నం భోజనంలో, రాత్రి డిన్నర్ లో ఇలా మూడు పూటలూ ముక్కలతోనే తినే మహానుభావులు చాలామందే ఉన్నారు. నాన్ వెజ్ బాగా తినేవాళ్లకు రకరకాల వెరైటీలు కావాలి. అందులోనూ చికెన్ తినేవాళ్లకు కొత్తకొత్త డిష్ లు కావాలి. అందువల్లే కొంతకాలం గా మనదేశంలో చికెన్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది.
చికెన్ ఉత్పత్తి ఒకప్పుడు ఈ స్థాయిలో లేదు. డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో కోళ్ల ఉత్పత్తి కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాలలో కూడా కోళ్లను పెంచుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు కోళ్ల తయారీని ప్రోత్సహిస్తున్నాయి. విరివిగా ఫామ్ లు ఏర్పాటు చేయడంతో కోళ్ల ఉత్పత్తి భారీగా ఉంటున్నది. ఉత్పత్తికి, వినియోగానికి అంతరం అంతగా లేకపోవడంతో ఫౌల్ట్రీ వ్యాపారం మూడుపూలు, ఆరుకాయలుగా సాగుతోంది.
తెలుగురాష్ట్రాల్లో ప్రతిరోజు వందల క్వింటాళ్ల చికెన్ విక్రయాలు సాగుతుంటాయి. నాటు కోళ్లు, బ్రాయిలర్ అనే సంబంధం లేకుండా జనం లాగించేస్తుంటారు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాలా జిల్లా జన్నారంలో సంచరించే ఓ కోడిని వేటాడితే, దాని మాంసం తింటే మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దీని వెనుక కారణం లేకపోలేదు. జన్నారం అటవీప్రాంతంలో గ్రే జంగిల్ ఫౌల్ అనే కోడి సంచరిస్తూ ఉంటుంది. ఇది అత్యంత అరుదైనది. అందువల్లే దీనిని వణ్యప్రాణి రక్షణ చట్టం లో చేర్చారు. ఈ కోడిపుంజును వేటాడి తింటే మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది.
ఈ కోడి పుంజులు అడవిలో ప్రత్యేకంగా ఉంటాయి. మనుషుల అలికిడి వినిపించగానే పారిపోతాయి. ప్రాణాపాయం ఉంటే చెట్ల మీదికి ఎగిరిపోతాయి. గింజలను, చిన్న చిన్న పురుగులను ఆహారంగా తీసుకుంటాయి. నేల మీద గూళ్లు నిర్మించుకుంటాయి. చెట్ల పై కూడా గూళ్లను ఏర్పాటు చేసుకుంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ ప్రాంతంలో ఈ కోడి పుంజులు సంచరిస్తుంటాయి.
