HomeతెలంగాణIndiramma Housing Scheme : కొడుక్కి లండన్ లో ఉద్యోగం.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు... మంత్రి...

Indiramma Housing Scheme : కొడుక్కి లండన్ లో ఉద్యోగం.. తల్లికి ఇందిరమ్మ ఇల్లు… మంత్రి సాక్షిగా బయటపడ్డ నిజం

Indiramma Housing Scheme : ప్రభుత్వ పథకాలు పేదలకు అందాలి. పేదలు మాత్రమే ప్రభుత్వ పథకాలు పొందాలి. అలాకాకుండా పార్టీ కార్యకర్తలు.. ఆర్థికంగా స్థిరత్వం ఉన్న నాయకులు ప్రభుత్వ పథకాలు పొందితే వాటికి అర్థమే లేదు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతు బంధు పేరుతో రియల్ ఎస్టేట్ వెంచర్లకు.. పెద్ద పెద్ద వ్యాపారస్తులకు డబ్బులు ఇచ్చింది. అది మంచి పద్ధతి కాదని కాంగ్రెస్ ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని మొత్తం మారుస్తామని ప్రకటించింది. కానీ ఇంతవరకు అలా చేసిన దాఖలాలు లేవు.

ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న పథకం ఇందిరమ్మ ఇండ్లు. ఈ పథకం ద్వారా గృహాలు నిర్మించుకునే ప్రతి పేద వాళ్లకు ప్రభుత్వం అయిదు లక్షల చొప్పున నగదు సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. ఇది మూడు విడతల్లో మంజూరు అవుతుంది. గోడస్థాయిలో.. స్లాబ్ స్థాయిలో.. ఫినిషింగ్ స్థాయిలో.. ఇలా మూడుసార్లు బిల్లు మంజూరు అవుతుంది.. ఇప్పటికే రాష్ట్రంలో రికార్డు స్థాయిలో గృహాలు నిర్మించామని ప్రభుత్వం చెబుతోంది. ప్రభుత్వం తరఫున ఐదు లక్షల సహాయం ఇచ్చామని.. ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం వెల్లడిస్తోంది.

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని నియోజకవర్గమైన పాలేరులో ఇందిరమ్మ ఇంట్లో నిర్మించుకున్న లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. వారి వివరాలను మంత్రి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఒక మహిళ మాట్లాడారు. తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను ఇల్లు నిర్మించుకున్నానని ఆమె ఆనందంతో చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆమె చెప్పిన వివరాలు అక్కడున్న అధికారులనే కాదు.. మంత్రిని కూడా ఇబ్బంది పెట్టాయి.

సదరు మహిళ తన భర్తకు రెండవ భార్య. తన భర్త మొదటి భార్యతో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాడు. రెండవ భార్యగా వచ్చిన ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.. మొదటి భార్య పిల్లలలో ఒకరు లండన్ లో జాబ్ చేస్తున్నారు. మరొకరు చాణక్య స్ట్రాటజీస్లో పనిచేస్తున్నారు. ఇంకో పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. మరో పాప కూడా ఉద్యోగం చేస్తోంది. మొత్తంగా చూస్తే వాళ్ళ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం అధికంగా ఉంది. అయినప్పటికీ వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ మహిళ తన కుటుంబ వివరాలను మంత్రి సమక్షంలోనే బయటపెట్టింది. ఆమె చెబుతుంటే మంత్రి కూడా ఆశ్చర్యపోయారు. మంత్రి బయటికి చెప్పకపోయినప్పటికీ.. ఇద్దరమ్మ పథకం ఎలా సాగుతుందో.. ఆ మహిళ చెప్పిన మాటల ద్వారా తెలుస్తోంది. సరిగా ఇదే పాయింట్ పట్టుకొని గులాబీ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. డబ్బున్న వాళ్లకు సంక్షేమ పథకాలు అందించి.. పేదల కడుపు కొడుతున్నారని కాంగ్రెస్ నేతల మీద మండిపడుతున్నారు. మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఎలాంటి కౌంటర్ ఇస్తారో చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular