Africa cricket tournament : క్రికెట్లో ఆడటంతో పాటు.. మార్కెటింగ్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి. అప్పుడే ఆదాయం వస్తుంది. అంతకుమించి ఆటగాళ్లకు అవకాశం లభిస్తుంది. తద్వారా క్రికెట్ బోర్డులు ఆర్థికంగా బలోపేతం అవుతాయి. వర్ధమాన ఆటగాళ్లకు కూడా విరివిగా అవకాశాలు కల్పించడానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
ఈ వ్యాపార సూత్రం తెలుసు కాబట్టి బీసీసీఐ క్రికెట్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. డొమెస్టిక్ టోర్నీలను విరివిగా నిర్వహిస్తూ ఉంటుంది. వాటికి కమర్షియల్ టచ్ ఇస్తూ ఉంటుంది. వీటికి తోడు ఐపీఎల్ ఉండనే ఉంది. ఇవే కాకుండా బ్రాడ్కాస్టింగ్ హక్కులు.. కార్పొరేట్ కంపెనీలతో ఎండార్స్మెంట్.. వంటి వాటి ద్వారా విపరీతంగా ఆదాయాన్ని పొందుతూ ఉంటుంది. అందువల్లే బిసిసిఐ ప్రపంచంలోనే అత్యంత శ్రీమంతమైన క్రికెట్ బోర్డుగా వెలుగొందుతోంది.
ఇక ఆసియా రీజియన్ విషయానికొస్తే.. ఒకప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్, భారత్, శ్రీలంక, పాకిస్తాన్ మాత్రమే కీలక జట్లుగా ఉండేవి. ఇప్పుడు థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఇంకా అనేక రకాలైన క్రికెట్ జట్లు ఏర్పడుతున్నాయి. ఆసియా పరిధిలో టోర్నీలలో ఆడుతున్నాయి.. ఐసీసీ ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో అవకాశం ఇవ్వడంతో కొన్ని జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి. భవిష్యత్తు కాలంలో ఈ జట్లు బలాన్ని సంతరించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ అన్ని జట్లకు పోటీ ఇస్తోంది 2024 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో సత్తా చూపించింది.
ఆసియా ఖండంలో అనేక క్రికెట్ జట్లు సత్తా చూపిస్తున్న నేపథ్యంలో.. అదే ధోరణి అందిపుచ్చుకోవాలని ఆఫ్రికా ఖండంలోని జట్లు కూడా భావిస్తున్నాయి. ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా కీలక జట్టుగా ఉంది. జింబాబ్వే, నమిబియా, కెన్యా కూడా క్రికెట్ ఆడుతున్నాయి. గతంలో జింబాబ్వే, కెన్యా ప్రభావంతమైన క్రికెట్ ఆడేవి. ఇటీవల కాలంలో కేటాయింపులు జరగకపోవడంతో అక్కడ క్రికెట్ మనుగడ అంతంత మాత్రం గానే ఉంది. కేటాయింపులు లేకపోయినప్పటికీ జింబాబ్వే లాంటి జట్టు ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో సత్తా చూపించింది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే, నమీబియా జట్లతో ఆఫ్రికా కప్ పేరుతో ఒక టోర్నీ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు కూడా పూర్తయ్యాయని.. ఆసియా కప్ మాదిరిగానే ఈ టోర్నీ కూడా జరుపుతారని తెలుస్తోంది.