Pakistan Economic Crisis 2026: ఇప్పటికే ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. దీనికి తోడు యూఏఈ ఇచ్చిన అప్పును వెంటనే చెల్లించాలని షరతు విధించింది.. గోటి చుట్టు రోకటి పోటు లాగా మధ్య ఆసియా ప్రాంతంలో యుద్ధం జరుగుతుండడంతో పాకిస్తాన్ దేశానికి ఇంధన సరఫరా కావడం లేదు. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంధనానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తున్న నేపథ్యంలో.. పొదుపు చర్యలను పాటించింది. ఇందులో భాగంగా స్మార్ట్ లాక్ డౌన్ అనే విధానాన్ని తెరపైకి తీసుకువచ్చింది. దీని ప్రకారం మంగళవారం రాత్రి 8 గంటలకే షాపింగ్ మాల్స్ మూసివేయాలి. రాత్రి 10 గంటల వరకు బేకరీలు, రెస్టారెంట్లు, దాబాలు, ఫంక్షన్ హాళ్లు మూసివేయాలి. ఈ నిర్ణయం పంజాబ్, కైబర్, బలూచిస్థాన్, ఇస్లామాబాద్, గిల్గిత్ బాల్టిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతాలకు వర్తిస్తుందని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
కొంతకాలంగా పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఐఎంఎఫ్ దయాదాక్షిణ్యల మీద అక్కడి ప్రభుత్వం నెట్టుకోస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఏరోజు ఖర్చులకు ఆరోజు ఆదాయం సరిపోతుంది. అభివృద్ధి లేదు. కొత్త ప్రాజెక్టులు లేవు. కనీసం రోడ్లు వేసే అవకాశం కూడా లేదు. గతంలో భూకంపం చేసుకున్నప్పుడు.. వరదలు సంభవించినప్పుడు పాకిస్థాన్లో తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఇప్పటివరకు కూడా నష్ట నివారణ చర్యలను అక్కడి ప్రభుత్వం తీసుకోలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినప్పటికీ అప్పులు మాత్రం విపరీతంగా చేస్తోంది. మరోవైపు అప్పులు ఇచ్చిన దేశాలు పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాయి. గతంలో పాకిస్తాన్ దేశానికి యూఏఈ 30 వేల కోట్లకు పైగా అప్పు ఇచ్చింది. ఇప్పుడు ఆ డబ్బులు చెల్లించాలని షరతు విధించింది. దీంతో పాకిస్తాన్ ఆ డబ్బులను విదేశీ మారకద్రవ్య నిల్వ నుంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఇతర దేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేయడానికి పాకిస్తాన్ వద్ద డబ్బులు లేవు. పైగా ఇటీవల కాలంలో పాకిస్తాన్ దేశం ఇంధనం మీద విపరీతంగా ధరలు పెంచింది. ప్రపంచంలో ఏ దేశం కూడా పెంచని విధంగా ధరలు పెంచింది. అంతేకాదు విపరీతంగా పన్నులు వసూలు చేస్తోంది.
అందువల్లే పాకిస్తాన్ దేశంలో పరిస్థితి దారుణంగా మారింది. ఇంధన నిల్వలు లేకపోవడం.. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడంతో లాక్ డౌన్ విధించింది. ఇప్పుడు అక్కడ పరిస్థితి కరోనా నాటి కాలాన్ని గుర్తు చేస్తోంది. ప్రజలు బయటికి రాకుండా.. వ్యాపార కార్యకలాపాలు సాగకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించుకోవాలని.. కరెంట్ వినియోగాన్ని కూడా పరిమితం చేయాలని అక్కడి ప్రభుత్వం చెప్పడం విశేషం. ఇక ఇటీవల పాకిస్తాన్ మంత్రులు భారత్ మీద దాడి చేస్తామని హెచ్చరించారు. అలా వారు వ్యాఖ్యానించి రోజులు కూడా గడవక ముందే పాకిస్తాన్ దుకాణం సర్దేసుకోవడం విశేషం.