YS Sharmila: తెలంగాణ కోడల్ని అంటూ.. రాష్ట్రంలో రాజకీయ పార్టీ పెట్టారు షర్మిల. రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ పాదయాత్ర చేపట్టారు. దాదాపు ఏడాదిన్నరపాటు 3,500 కిలోమీటర్లు యాత్ర చేశారు. ఈ యాత్ర మూడు నెలల క్రితం అర్ధంతరంగా ఆగిపోయింది. ఇక ఆగిపోయిన యాత్రను తిరిగి కొనసాగించాలని భావిస్తున్నారు షర్మిల. అయితే షర్మిల పాదయాత్ర కొనసాగేలా పోలీసులు, బీఆర్ఎస్ నేతలు సహకరిస్తారా? ప్రజా క్షేత్రంలో వైయస్ షర్మిల మళ్లీ కెసిఆర్ సర్కార్పై, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై గతంలో విరుచుకు పడినట్టే మళ్లీ విరుచుకుపడతారా? అంటే కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

YS Sharmila
జనవరి 28 నుంచి మళ్లీ యాత్ర..
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో తన పాదయాత్రను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 28వ తేదీ నుంచి ఎక్కడ నుంచి తన పాదయాత్రను ఆపానో అక్కడినుంచే ప్రారంభిస్తానని తేల్చి చెప్పారు. తన పాదయాత్రకి పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకున్నా పాదయాత్ర కొనసాగుతుందని చెప్పిన షర్మిల తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా 3,500 కిలోమీటర్లు మేర పాదయాత్రను తాను కొనసాగించానని గుర్తుచేశారు. ఇప్పుడు తిరిగి జనవరి 28వ తేదీ నుంచి మళ్లీ తన పాదయాత్రను కొనసాగిస్తానని స్పష్టం చేశారు.
పాదయాత్రపై కొనసాగిన రచ్చ
గతంలో షర్మిల పాదయాత్రలో వరంగల్ జిల్లాలో చోటు చేసుకున్న దాడి ఘటన, ఆపై షర్మిల అరెస్ట్, ఆ తరువాత జరిగిన పరిణామాలు తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. షర్మిల పాదయాత్రతో శాంతి భద్రతల సమస్య వస్తుందని ఆమె పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. దీంతో తన పాదయాత్ర కొనసాగించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
పోలీసులను ఆశ్రయించిన వైఎస్ఆర్టీపీ
ఇక బీఆర్ఎస్ పార్టీ నేతలు వైఎస్ షర్మిల పాదయాత్ర చేయడానికి వీలులేదని, ఒకవేళ వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, లేదంటే మహబూబాబాద్ లో నాడు జరిగిన రాళ్లదాడి ఘటన మళ్లీ రిపీట్ అవుతుంది అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అనేక కారణాలతో షర్మిల పాదయాత్ర ఆగిపోయింది. ప్రస్తుతం యాత్రను కొనసాగించాలని భావిస్తున్నారు. ఇక ఈనెల 28న మొదలు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర అనుమతుల కోసం ఆ పార్టీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు .

YS Sharmila
ముగింపు సభ ప్లాన్..?
నాలుగు వేల కిలోమీటర్ల మైలురాయి వరకు వైఎస్.షర్మిల పాదయాత్ర పూర్తిచేసి వరంగల్లో ముగింపుగా భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తున్నారు. మరి పోలీసులు ఈసారైనా అనుమతి ఇస్తారా? ఆగిన చోటు నుంచి పాదయాత్ర చేస్తానంటున్న షర్మిల పాదయాత్రకు బీఆర్ఎస్ నాయకులు సహకరిస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏదేమైనా పాదయాత్ర చేసి తీరుతానంటున్న షర్మిల ఏం చేయబోతున్నారు అన్నది మాత్రం అందరిలోనూ ఉత్కంఠగా మారింది.