BRS Kokapet Land: బీఆర్ఎస్కు 11 ఎకరాల కేటాయింపు కథేంటి?
పార్థసారధిరెడ్డికి భూమి కేటాయింపుపై తీర్పు వచ్చిన కాసేపటికే కోకాపేటలో 11 ఎకరాల్లో బీఆర్ఎస్ ఎక్సలెన్సీ సెంటర్కు కేసీఆర్ భూమి పూజ చేశారు. దీంతో అందరూ ఆ భూమికి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది కదా అని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ భవన్కు 2008లో కాంగ్రెస్కు భూమి ఇచ్చినట్టే బీఆర్ఎస్కు ఇస్తున్నామని సర్క్యులర్ లో పేర్కొన్నారు.

BRS Kokapet Land: బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు, హెటిరో చైర్మన్ పార్థసారధిరెడ్డి.. క్యాన్సర్ ఆస్పత్రి పెడతా.. అందులో పాతిక శాతం పేషంట్లకు ఉచితంగా వైద్యం చేస్తానని చెప్పగానే అత్యంత విలువైన పదిహేను ఎకరాలను ప్రభుత్వం అప్పనంగా రాసిచ్చేసింది. హైకోర్టు ఈ కేటాయింపు సరిగా లేదని.. కీలక వ్యాఖ్యలు చేసింది. తీర్పులో ఉన్న వివరాల ప్రకారం చూస్తే.. బీఆర్ఎస్ పార్టీకి కోకాపేటలో కేటాయింపు చేసుకున్న 11 ఎకరాల స్థలం కూడా కోర్టు కేసులపాలు కాక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాయిసింధు ఫౌండేషన్కు 10 ఎకరాలు ఇవ్వాలని కలెక్టర్ సిఫారసు చేస్తే రాష్ట్రప్రభుత్వం దానికి ఐదెకరాలు కలిపి 15 ఎకరాలు కేటాయించింది. అడిగినట్లు అలైన్మెంట్ను సైతం మార్చింది. చదరపు గజానికి రూ.75 వేలు మార్కెట్ విలువ అని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించింది. ప్రభుత్వం ఈ ధరను పట్టించుకోకుండా.. బసవతారకం ఆసుపత్రికి 1989తో ఇచ్చిన లీజు ధరకే ప్రస్తుత లీజును కేటాయించింది ఇవన్నీ నిబంధనల ఉల్లంఘనేనని కోర్టు స్పష్ట చేసింది.
నిబంధలివీ..
భూకేటాయింపు పాలసీ ప్రకారం ప్రభుత్వ భూమిని లీజుకు ఇవ్వాలంటే సదరు భూమి మార్కెట్ విలువలో 10 శాతం విలువను ఏటా లీజుగా వసూలు చేయాల్సి ఉంటుంది. ఈ లీజు మొత్తాన్ని ప్రతీ ఐదేళ్లకోసారి పునఃసమీక్షించి.. పెరిగిన మార్కెట్ విలువ ప్రకారం 10 శాతం లీజు ఎంతో నిర్ణయుంచి వసూలు చేయాల్సి ఉంటుంది.
పార్టీకి 11 ఎకరాలు..
పార్థసారధిరెడ్డికి భూమి కేటాయింపుపై తీర్పు వచ్చిన కాసేపటికే కోకాపేటలో 11 ఎకరాల్లో బీఆర్ఎస్ ఎక్సలెన్సీ సెంటర్కు కేసీఆర్ భూమి పూజ చేశారు. దీంతో అందరూ ఆ భూమికి కూడా ఈ తీర్పు వర్తిస్తుంది కదా అని పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ భవన్కు 2008లో కాంగ్రెస్కు భూమి ఇచ్చినట్టే బీఆర్ఎస్కు ఇస్తున్నామని సర్క్యులర్ లో పేర్కొన్నారు. తిరుమలగిరి మండలం బోయిన్పల్లిలోని 502, 503, 502/పీ2 సర్వే నంబర్లలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్కు 10 ఎకరాల 15 గుంటలు కేటాయించారు. ఇప్పుడు బీఆర్ఎస్కు అదే పద్ధతిలో 11 ఎకరాలు కేటాయిస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఎకరం మూడున్నర కోట్లు..
కోకాపేటలో ప్రస్తుతం ఎకరా ధర మార్కెట్ రేటు ప్రకారం రూ.3 కోట్ల 41 లక్షల 25 వేలు ఉందని.. 11 ఎకరాలకు రూ.37 కోట్ల 53 లక్షల 75 వేలు అవుతుందని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. ఆమేరకు ఇచ్చేశారు. కోకాపేటలో ఇటీవల నిర్వహించిన వేలంలో ఒక్కో ఎకరం రూ.50 కోట్లకు అమ్ముడు పోయింది. ఇది అధికారికమే. అంటే 11 ఎకరాలకు రూ.550 కోట్లు అవుతుంది. కానీ ఇంత విలువైన భూమిని రూ.37.53 కోట్లకే తమ పార్టీకి ప్రభుత్వం కట్టబెట్టిందని విమర్శలు వస్తున్నాయి . హెటెరో కేసు తీర్పు ధైర్యంతో ఇతర రాజకీయ పార్టీలు కోర్టుల్లో పిటిషన్లు వేసే అవకాశం ఉంది.
