TRS- YS Sharmila: అండర్ డాగ్స్తో పెను ప్రమాదమే పొంచి ఉంటుంది. ఎందుకంటే.. వారి మీద పెద్ద అంచనాల ఉండవు. ఒత్తిళ్లు ఉండవు. ఏమైనా చేయొచ్చు. అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. అందుకే అంచనాలు లేని వారంతా అప్పుడప్పుడు చెలరేగిపోతుంటారు. రాజకీయాలూ ఇందుకు అతీతం కాదు. తెలంగాణ రాజకీయాల్లో ప్రపస్తుతం ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణతోనూ.. తెలంగాణ భావోద్వేగంతోనూ పెద్దగా లింకు లేని.. సింక్ కాని వైఎస్.షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ఆమె శక్తిసామర్థ్యాల మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. ఇదే ఇప్పుడు షర్మిలకు లాభించిందని చెప్పాలి. అలా అని.. ఇప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో షర్మిల ఏదో సాధిస్తుందని కాదు. కాకపోతే.. తెలంగాణ జన సమితి, ప్రజాశాంతి, తోక పార్టీలు, గుండు సూది పార్టీల్లా షర్మిల తేలిగ్గా.. సింఫుల్గా తేల్చేసే వ్యక్తి మాత్రం కాదని తాజాగా తన చేతలతో చూపించారు.

YS Sharmila
పాదయాత్రతో చుట్టేస్తోంది..
పార్టీ పెట్టిన కొద్ది రోజులకే పాదయాత్ర మొదలు పెట్టిన షర్మిల క్రమంగా తెలంగాణ మొత్తం చుట్టేస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటోంది. రాజకీయాలు, స్థానిక పరిస్థితులు, అంశాలపై అవగాహన పెంచుకుంటోంది. అంతేకాదు.. క్షేత్ర స్థాయిలో రోజుల తరబడి తిరగటం వల్ల.. ఎక్కడ? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యల వెనుకున్న కారణం ఏమిటి? కేసీఆర్ పాలన ఎలా సాగుతోంది? అవినీతి మరీ ఇంత భారీగానా? అన్న ప్రశ్నలకు తన పాదయాత్ర సందర్భంగా సమాధానాలు చెబుతున్నారు షర్మిల.
ఇప్పటికే 3,500 కిలోమీటర్ల యాత్ర..
గత సోమవారం నాటికి షర్మిల పాదయాత్ర 3,500 కి.మీ. చేరుకుంది. అయితే, అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆమె ప్రయాణం తాత్కాలికంగా ఆగింది. అంతే తప్పించి ఆమె ఆగేది లేదన్న విషయం మంగళవారం చోటు చేసుకున్న పరిణామాలు స్పష్టం చేశాయి. అన్నింటికీ మించి టీఆర్ఎస్కు చెందిన వారు తన వాహనం మీద దాడి చేసి.. ధ్వంసం చేస్తే.. ఆ డ్యామేజ్ అయిన కారును స్వయంగా నడుపుకుంటూ వచ్చి ప్రగతిభవన్ వద్ద ధర్నా చేయడానికి బయల్దేరడం.. ఒక ఎత్తు అయితే.. ధ్వంసమైన కారును తానే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరిన తీరు చూస్తే.. షర్మిల ఎంత మొండిది? మరెంత పంతంతో ఉన్న మహిళ అన్నది అర్థమవుతుంది.
గులాబీకి మరో టెన్షన్..
ఇంతకాలం షర్మిలను పెద్దగా పట్టించుకోని టీఆర్ఎస్ నేతలు తాజా పరిణామాలతో ఆమెను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ మొత్తంలో మరే రాజకీయ పార్టీ నాయకులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను ఇంతలా విమర్శించలేదు. అవినీతిని ప్రజాక్షేత్రంలో బయటపెట్టలేదు. షర్మిల మాత్రం టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను ఎవరినీ వదలడం లేదు. బండారం మొత్తం బయట పెడుతోంది. అవినీతిపై షాకింగ్ ఆరోపణలు చేస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ను కూడా వదలడం లేదు. ఇదంతా గమనిస్తున్న గులాబీ పార్టీకి చెందిన పలువురు షర్మిలను ఏకుగా భావిస్తే తప్పు అవుతుందని.. ఆమె మేకుగా మారుతోందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

YS Sharmila
బ్యాలెన్స్ తప్పుతున్న టీఆర్ఎస్ నేతలు..
ఇంతకాలం షర్మిలను పెద్దగా లెక్కలోకి వేసుకోకుండా ఉండటం టీఆర్ఎస్ చేసిన ఒక తప్పు అయితే.. ఇప్పుడు ఆమె మీద ప్రతాపం చూపించే క్రమంలో బ్యాలెన్సు మిస్ కావటం మరో తప్పు. మిగిలిన రాజకీయ పార్టీలు.. రాజకీయ అధినేతలను డీల్ చేసినట్లుగా షర్మిలతో వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్న తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్పైనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది షర్మిలకే మైలేజ్ తెసస్తుంది. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి గుణాలు ఎక్కువగా షర్మిలలోనే కనిపిస్తాయి. ఈ లెక్కన షర్మిలను పెద్దగా పట్టించుకోకపోవటం ప్రమాదకర పరిణామంగా రూపుదిద్దుకునే వీలుందన్న వాదన వినిపిస్తోంది. ఈ వాదనను టీఆర్ఎస్కు చెందిన పలువురు కొట్టిపారేస్తుంటే.. కొంతమంది మాత్రం ఆమెను డీల్చేసే తీరులో మార్పు రావాలంటున్నారు. మరి.. ఈ విషయాన్ని గులాబీ బాస్ గుర్తించారో లేదో మరి?