Site icon OkTelugu

Poonch Attack: అది పాక్.. ఓ విషపు నాగు : పూంచ్ దాడిలో వాడింది చైనా తూటాలా?

Poonch Attack
Poonch Attack

Poonch Attack: తింటానికి తిండి లేదు.. చేసేందుకు పనిలేదు.. అప్పు పుట్టే దిక్కు లేదు. ఆ చైనా ఆదుకోదు.. అమెరికా అక్కున చేర్చుకోదు. జనం రోడ్లమీదకి వచ్చి నిరసనలు చేస్తున్నారు. అయినా ఆ దేశం మారదు. పైగా కోరల్లో విషం నిండిన నాగు పాము లాగా బుసలు కొడుతూనే ఉంటుంది. తాజాగా ఫుంచ్ లో ఐదుగురు భారత జవాన్లను బలిగొన్నది.

ఈ దాడి వెనుక జైషే అనుబంధ పీఏఎఫ్ఎఫ్ సంస్థ ఉన్నది. కానీ ఆశ్రయం ఇస్తోంది పాకిస్తాన్.పాక్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో భారత పర్యటన ఖరారైన కొద్ది గంటల్లోనే జమ్మూకాశ్మీర్ ప్రేరేపిత ఉగ్రమూకలు ఈ దారుణానికి పాల్పడ్డాయి..వచ్చే నెల శ్రీనగర్ లో జరిగే జీ_20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ లష్కరే తాయిబా అనుబంధ సంస్థ పీపుల్స్ యాంటీ_ ఫాసిస్ట్ ఫ్రంట్(పీఏఎస్ఎఫ్) ఐదుగురు భారత జవాన్ల ను పొట్టన పెట్టుకుంది. జీ_20 సమ్మిట్ ద్వారా జమ్ము కాశ్మీర్లో టూరిజం అభివృద్ధి చెందుతుంది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది.. ఫలితంగా వారు ఉగ్రవాదం వైపు అడుగులు వేయలేరు. అలాంటప్పుడు లష్కరే తాయిబాలోకి ఎవరూ వెళ్లరు. అలాంటప్పుడు ఈ వేర్పాటు వాదుల ఆటలు సాగవు. అందుకే ఈ జీ_20 సమావేశాన్ని ఉగ్రవాద సంస్థలు కాశ్మీర్లో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.. వాస్తవానికి జీ_20 అధ్యక్ష హోదా భారతదేశానికి రాగానే చైనా, పాకిస్తాన్ కళ్ళల్లో నిప్పులు పోసుకున్నాయి. అయితే జమ్ము కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్, చైనా ఆడుతున్న కపటనాటకాన్ని ప్రపంచం ముందు ఉంచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా కాశ్మీర్లో జీ_20 సమ్మిట్ నిర్వహించేందుకు నిర్ణయించారు. అంతేకాదు భద్రతా విభాగం ప్రధాన కార్యదర్శి అజిత్ దోవల్ ను కూడా కాశ్మీర్ పంపించి అక్కడ ఏర్పాట్లను పరిశీలించే బాధ్యత అప్పగించారు. అప్పటినుంచి పాకిస్తాన్ నోరు మెదపకపోయినప్పటికీ… ఉగ్రవాద సంస్థలు మాత్రం కసితో రగిలిపోతున్నాయి. అదును చూసి దెబ్బ కొట్టేందుకు రెడీ అవుతున్నాయి. అందులో భాగంగానే ఫూంచ్ లో ఐదుగురు భారత జవాన్లను బలి గొన్నాయి. రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్( ఆర్ ఆర్ యూ) జవాన్లు ప్రయాణిస్తున్న ట్రక్కు పై లష్కరే తాయిబా(పీఏఎఫ్ఎఫ్) ఉగ్రవాద మూకలు దాడి చేశాయి. ఈ దాడిలో ఐదుగురు జవాన్లు హతమయ్యారు. మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డాడు.

Poonch Attack

రాజోలి, శ్రీనగర్, దక్షిణ కాశ్మీర్ , పూంచ్ సెక్తార్లలో అప్రమత్తంగా ఉండాలని నిఘా వర్గాలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాయి..ఈ ప్రాంతాల్లో ఉగ్ర మూకలు గ్రనైడ్ దాడులకు జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేస్తున్నాయి.. అయితే బుధ, గురువారాల్లో ఉగ్రవాదుల దాడులపై భారత సైన్యానికి సమాచారం అందినట్టు తెలుస్తోంది.. అయితే ఉగ్రవాదులు దాగి ఉన్న అటవీ ప్రాంతాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టి దాడి చేయాలని భారత ఆర్మీ నిర్మించినట్లు సమాచారం.. ఈ క్రమంలోనే యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ కోసం రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్స్ ను ఆయా ప్రాంతాలకు తరలించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో భీంబేర్ గలీ నుంచి ఫుంచ్ వెళ్తున్న ఆర్ ఆర్ యూ జవాన్ల ట్రక్కు పై ఉగ్రవాదులు మెరుపు దాడులు చేశారు.. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రహదారి సరిగ్గా కనిపించకపోవడంతో జవాన్లు అక్కడే నక్కి ఉన్న ఉగ్రమూకలను గుర్తించలేదని తెలుస్తోంది. తొలుత కాల్పులు జరిపిన ఉగ్రవాదులు.. ఆ తర్వాత గ్రనెడ్ లాంచర్ తో దాడి చేసి ఉంటారని ఆర్మీ అధికారులు భావిస్తున్నారు..

జవాన్ల ఒంట్లో దూసుకెళ్లిన స్టీల్ తూటాలు చైనాలో తయారైనట్టు ఆర్మీ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెళ్లడైంది.. “ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఆర్మీ ట్రక్కు పూర్తిగా దహనమైంది.. అందులో ఐదుగురు జవాన్లు సజీవ దహనమయ్యారు. మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయి” అని ఆర్మీ అధికారులు వివరించారు. ట్రక్కులో కిరోసిన్ ఉండటంవల్ల మంటల తీవ్రత పెరిగినట్టు ఆర్మీ అధికారులు చెబుతున్నారు. దాడి జరిగిన తర్వాత అడవులను ఆర్మీ అధికారులు డ్రోన్ ల ద్వారా జల్లెడ పడుతున్నారు. ఈ దాడికి మాదే బాధ్యత అంటూ పీఏఎఫ్ఎఫ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.. సరిగ్గా 2021 లో ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలోనే పీఏఎఫ్ఎఫ్ ఈ దారుణం ఒడి కట్టడం విశేషం. దేశంలో పలు విధ్వంసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ సంస్థపై భారత ప్రభుత్వం జనవరిలో నిషేధం విధించింది.

Exit mobile version