Telangana budget 2026-27 details: తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శుక్రవారం(మార్చి 20న) అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సుమారు రెండు గంటలపాటు బడ్జెట్ ప్రసంగం చదివి వినిపించారు. ఈసారి బడ్జెట్లో రేవంత్రెడ్డి సర్కార్ సామాజిక న్యాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. మొత్తం రూ.3,24,234 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి శాసనమండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక న్యాయం అందించడమే లక్ష్యంగా అంబేడ్కర్ సిద్ధాంతాల మేరకు బడ్జెట్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
బడ్జెట్ రూపురేఖ..
మొత్తం బడ్జెట్ వ్యయం రూ.3,24,234 కోట్లు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు. మూలధన వ్యయం రూ.47,267 కోట్లుగా చూపించారు. ఈ కేటాయింపులు రాష్ట్ర జీఎస్డీపీని 10.2% వృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భట్టి తెలిపారు. రుణభారం పెంచకుండా సమతుల్యతను కాపాడేలా బడ్జెట్ రూపొందించామని పేర్కొన్నారు.
సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం..
రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా (ఇందిరమ్మ పథకం)అమలు చేయనున్నట్లు భట్టి తెలిపారు. ఇందుకు ఈ బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించారు. జూన్ 2 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రీ–ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు అల్పాహారం ప్రకటించారు. ఐఐటీ, ఏటీసీ విద్యార్థులకు నెలకు రూ.2 వేల సహాయం అందిస్తామని తెలిపారు. ఇందుకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. ప్రభుత్వ ఉద్యోగులకు డిజిటల్ ఆరోగ్య కార్డులు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
Also Read: పవర్ హౌస్గా కరీంనగర్.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక ముద్ర..
ప్రధాన శాఖలకు కేటాయింపులు..
వ్యవసాయం: రూ.23,179 కోట్లు, రైతు భరోసా రూ.18 వేల కోట్లు)
విద్య: రూ.26,674 కోట్లు (యంగ్ ఇండియా స్కూళ్లు రూ.5 వేల కోట్లు)
వైద్యం, ఆరోగ్యం: రూ.13,679 కోట్లు (రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.1,143 కోట్లు)
విద్యుత్: రూ.21,285 కోట్లు (గృßæజ్యోతి రూ.2,080 కోట్లు)
సంక్షేమ శాఖలకు(ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు): రూ.35,998 కోట్లు, మహిళా పథకాలు (మహాలక్ష్మీ, కల్యాణ లక్ష్మీ)కు : రూ.7,988 కోట్లు.
పర్యాటకం, మౌలిక వసతులకు..
మూసీ రివర్ఫ్రంట్కు రూ.1,500 కోట్లు, ఉస్మానియా యూనివర్సిటీకి రూ.వెయ్యి కోట్లు, మెట్రో ఫేజ్–2కు రూ.600 కోట్లు, పర్యాటకానికి రూ.1,224 కోట్లు కేటాయించారు. ఆరు గ్యారంటీలకు రూ.50,713 కోట్లు, చేయూతకు రూ.14,861 కోట్లు నిధులు కేటాయించారు.
