BJP: అయోధ్య ‘రాముడే’ మోడీని బతికించాలి.. బీజేపీని గద్దెనెక్కించాలి!
పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీపై ఇంకా అంచనాలు ఏవీ మిగిలి లేవు. ఆయన ఏదో అద్భుతం చేసేస్తాడని నమ్మే వాళ్ల సంఖ్య తగ్గింది. కేవలం వీరాభిమానులు, భక్తులు మాత్రమే మిగిలారు.

BJP: రాబోయే ఎన్నికలకు భారతీయ జనతాపార్టీ సన్నద్ధమవుతోంది. తవరలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలతోపాటు 2024 లోక్సభ ఎన్నిలపై ఆ పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్దం చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తర ప్రదేశ్పై ప్రత్యేక దృష్టిపెట్టింది. మొత్తం 80 లోక్ సభ సీట్లున్న యూపీలో తమ పరపతి నిలిస్తే కేంద్రంలో మరోసారి అధికారం ఈజీ అవుతుందని భావిస్తోంది. యూపీలోని 80 లోక్సభ సీట్లలో ప్రతీ మూడు నెలలకు సర్వే చేయిస్తుంది. లోటుపాట్లు సవరించుకుంటూ పట్టు నిలుపుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.
2014లో 90 శాతం బీజేపీ ఖాతాలో..
2014లో యూపీలో ఏకంగా 90 శాతం సీట్లను బీజేపీ గెలుచుకుంది. అయితే 2019లో ఆ సీట్లల సంఖ్య కాస్త తగ్గింది. గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 64 సీట్లు దక్కాయి. 2014తో పోల్చితే ఎనిమిది లోక్ సభ సీట్లను బీజేపీ కోల్పోయింది. అయినప్పటికీ 80 శాతం సీట్లు దక్కినట్టే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా, మునుపటి జోరు లేదు. ఇటీవలి పరిణామాలు బీజేపీ ప్రతిష్టను అక్కడ దెబ్బతీస్తున్నాయి. రెజ్లర్ల ఆందోళన అంశాన్ని బీజేపీ చాలా లైట్ తీసుకుంటోంది కానీ, తటస్తులపై అది చాలా ప్రభావాన్నే చూపుతూ ఉంది. అదే యూపీలో రౌడీలను చాల్చిపడేస్తున్నామన్న యోగి ప్రభుత్వం, లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న తమ పార్టీ ఎంపీ విషయంలో మాత్రం కిక్కురమనడం లేదు. ఆయన ఎంపీ అయినా మోడీ సర్కారు స్పందిస్తున్న తీరు ఏ మాత్రం సమర్థనీయంగా లేదు. ఆ ఎంపీ కులానికో, బలానికో భయపడి మోడీ సర్కారు ఈ అంశంలో ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న అభిప్రాయం యూపీలో ఉంది. ఇలాంటి ప్రభావాలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్త ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
దూరమవుతున్న సామాన్యులు..
అన్నింటికీ మించి సామాన్యుల అతీగతిని పట్టించుకోవడం బీజేపీ తన పని కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. భారతీయుల సగటు జీవితాలను బీజేపీ అసలు ఖాతరు చేయడం లేదు. ఇటీవలే కర్ణాటకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై విముఖత కనిపించింది. ఇక మహారాష్ట్రలో కూడా బీజేపీకి ఎదురుగాలే అనే ప్రచారం జరుగుతూ ఉంది. ఇక మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీనే ఇచ్చేలా ఉంది. కేరళ, ఏపీ, తమిళనాడుల్లో బీజేపీకేం లేదు. ఆపై తెలంగాణలో కూడా గత ఎన్నికల్లో దక్కినన్ని ఎంపీ సీట్లు ఈ సారి దక్కుతాయనేది సందేహంగానే మారుతోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బ తర్వాత తెలంగాణలో బీజేపీ జోరు చాలా వరకూ తగ్గింది. బీజేపీని తట్టుకుని తాము గెలవగలమని కాంగ్రెస్ వాళ్లకు కర్ణాటక కాంగ్రెస్ నేతలు సందేశాన్ని ఇవ్వగలిగారు. మొన్నటి వరకూ కాంగ్రెస్లో ఇలాంటి ఉత్సాహం ఏదీ ఉండేది కాదు. ఇప్పుడు ఆ మార్పు కనిపిస్తూ ఉంది.
రామ మందిరంపైనే ఆశలు..
బీజేపీ ఆశలు ఇప్పుడు ఒక అంశం మీదే ఉన్నాయి. అదే అయోధ్య రామమందిరం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోపు ఆయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని పూర్తి చేసేసి, మోదీనే స్వయంగా దాన్ని ప్రారంభించేస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో విజయం గ్యారెంటీ అని బీజేపీ లెక్కలు వేస్తోంది. పార్లమెంట్ నూతన భవనాన్ని తనే స్వయంగా ప్రారంభించిన రీతిలో మోదీ ఆయోధ్యలో కూడా తనే ఆలయ ప్రారంభం చేయవచ్చు. తనే పెద్ద పూజారిగా వ్యవహరించే అవకాశాలు లేకపోలేదు. ఆయోధ్యలో ఆలయ నిర్మాణం పూర్తి చేయడం, యూపీలో గుళ్లను ఆధునీకరించడం పూర్తి చేస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో యూపీలో లోక్సభ సీట్ల విజయంలో కీలక అంశాలు అవుతాయని కమలం నేతలు భావిస్తున్నారు.
కర్ణాటకలో పనిచేయని మోదీ చరిష్మా..
కర్ణాటక అంటే నిస్సందేహంగా మినీ ఇండియానే. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగా మోదీ ప్రచారం చేశారు. దాదాపు నెల రోజుల సమయానికి కర్ణాటక ఎన్నికల ప్రచారానికే కేటాయించారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలతో కర్ణాటకలో నెగ్గిందనేది కూడా శుద్ధ అబద్ధం. బీజేపీ అలాంటి హామీలను బోలెడన్ని ఇచ్చింది. కర్ణాటకలో తమకు అధికారం ఇస్తే ప్రతిరోజూ అరలీటరు పాలు ఫ్రీ అనే వాగ్దానం బీజేపీ మెనిఫెస్టో లోనిదే. అంతేకాదు.. యేటా మూడు సిలెండర్ల ఫ్రీ, అటల్ క్యాంటీన్లు.. ఇలా కమలం పార్టీ బోలెడన్ని ఉచిత హామీలను ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే కాంగ్రెస్ ఉచిత హామీల కన్నా బీజేపీ ఉచిత హామీల జాబితానే పెద్దది. అయినా ప్రజల మన్నన పొందలేదు. ఇలా మోడీ అండ్ కోపై స్పష్టమైన విముఖత కనిపిస్తూ ఉంది.
సన్నగిల్లుతున్న అంచనాలు..
పదేళ్ల పాలన పూర్తి చేసుకున్న మోదీపై ఇంకా అంచనాలు ఏవీ మిగిలి లేవు. ఆయన ఏదో అద్భుతం చేసేస్తాడని నమ్మే వాళ్ల సంఖ్య తగ్గింది. కేవలం వీరాభిమానులు, భక్తులు మాత్రమే మిగిలారు. ఇలాంటి పరిణామాల మధ్యన హిందుత్వాదాన్ని రగల్చే పరిణామాలు ఎన్నికల ముందు సంభవిస్తే బీజేపీకి అది సానుకూల పరిణామం కావొచ్చు. అందులో రామమందిర ప్రారంభోత్సవం కీలక ఘట్టం కావొచ్చు. ఆర్థిక సామాజిక అంశాల సంగతెలా ఉన్నా, దేశంలో సగటు పౌరుడి పరిస్థితి ఏమైనా.. రామమందిరమే బీజేపీ శ్రీరామరక్ష కావొచ్చు.
