Sri Chaitanya Central Kitchen: ప్రభుత్వం వేల కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలలు, కళాశాలలు నిర్వహిస్తున్నప్పటికీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కార్పొరేట్ విద్యాలయాలలోకి తరలిస్తారు. లక్షలకు లక్షలు ఖర్చుపెట్టి అక్కడికి పంపిస్తుంటారు. పైగా ఆ విద్యాలయాలలో చదివించడాన్ని స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు
. మా వాడు ఫలానా కాలేజీలో చదువుతున్నాడు.. మేము అన్ని డబ్బులు ఖర్చు పెట్టి చదివిస్తున్నామని గొప్పగా చెబుతుంటారు.
తల్లిదండ్రుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ విద్యాలయాలు అడ్డగోలుగా ధనార్జనకు పాల్పడుతున్నాయి. అగ్గిపెట్టెల లాంటి భవనాలలో విద్యార్థులకు చదువులు చెబుతున్నాయి. గాలివీయదు. ఆడుకోవడానికి చోటు ఉండదు. కనీసం స్వేచ్ఛగా తిరగడానికి స్థలం కూడా ఉండదు. ఇక ఇటువంటి చోట పిల్లలకు వసతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కార్పొరేట్ విద్యాలయాలలో వంటలు ఉండే ప్రదేశాలు ఎలా ఉంటాయో గతంలో అనేక సందర్భాల్లో వీడియోల ద్వారా బయటికి వచ్చింది. అధికారుల తనిఖీల్లో కార్పొరేట్ కాలేజీల పన్నాగం బయటపడింది. మళ్లీ ఇప్పుడు అధికారులు దాడులు చేయడంతో కార్పొరేట్ కాలేజీల కిచెన్ వ్యవహారాలు బయటపడ్డాయి..
ఇటీవల హైదరాబాదులోని మాదాపూర్ ప్రాంతంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల సెంట్రల్ కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఫ్లోర్ తడిగా ఉండడాన్ని గమనించారు. వంట చేసే చోటు శుభ్రంగా లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. వంట వండడానికి ఉపయోగించే టమాటాలు కుళ్లిపోయాయి. కిచెన్ పరిసర ప్రాంతాల్లో విపరీతంగా ఈగలు ఉన్నాయి. చెత్త డబ్బాల మీద మూతలు కూడా లేవు. ఇటువంటి పరిస్థితుల మధ్య పిల్లలకు ఎలా ఆహారం వండి పెడుతున్నారని అధికారులు ప్రశ్నించారు.
శ్రీ చైతన్య సెంట్రల్ కిచెన్ లోనే ఇలా ఉంటే.. ఇక మిగతా ప్రాంతాలలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. ఈగలు కూడా విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. సీజనల్ వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కిచెన్ పరిసర ప్రాంతాల్ని కనీసం శ్రీ చైతన్య యాజమాన్యం శుభ్రంగా ఉంచకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి. తల్లిదండ్రుల నుంచి లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తున్న శ్రీ చైతన్య యాజమాన్యం ఇలా చేయడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి.
