Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత విలేకరుల ముందుకు వచ్చిందంటే చాలు ఏదో ఒక విషయాన్ని బయటపడుతూనే ఉన్నారు. మీడియాకు కావలసినంత మసాలా అందిస్తూనే ఉన్నారు. తద్వారా మీడియాలో ఆమె విస్తృతంగా చర్చలో ఉంటున్నారు. భారత రాష్ట్ర సమితి నుంచి బయటికి వచ్చిన తర్వాత కవిత మొదట్లో కాస్త హుందా గానే మాట్లాడారు. కొన్ని విషయాలను మాత్రమే మీడియాకు చెప్పేవారు. కానీ ఇప్పుడు ఆమె పూర్తిగా మారిపోయారు. ప్రతి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెబుతూనే ఉన్నారు.
తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత భారత రాష్ట్ర సమితి మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ నుంచి మొదలుపెడితే కేటీఆర్ వరకు ఎవరిని వదిలిపెట్టకుండా తిడుతూనే ఉన్నారు. ప్రజా సమస్యల మీద స్పందిస్తున్నారు.. నిరసనలు.. ఆందోళనలు చేపడుతున్నారు. అంతేకాదు.. అనేకా అంశాల మీద రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. తద్వారా కవిత తెలంగాణ రాజకీయాలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతున్నారు.
ఇటీవల ఇడుపు కాయితం అన్న సినిమాకు సంబంధించి వివాదం ఏర్పడిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ పదానికి అర్థం తెలియాలంటే పవన్ కళ్యాణ్ ను అడగాలని కవిత పరోక్షంగా విమర్శించారు. తద్వారా ఈ వివాదంలోకి పవన్ కళ్యాణ్ ను లాగారు కవిత. అంతేకాదు ఇటువంటి విషయాల మీద భారత రాష్ట్ర సమితి నాయకులు ఇప్పుడు మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని కవిత పేర్కొన్నారు. అక్కడితోనే కవిత ఆగిపోలేదు.. మరో నాయకుడి మీద కూడా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలతో గుంట నక్కలాంటి నాయకుడు పాల వ్యాపారం చేస్తున్నాడని కవిత ఆరోపించారు. అటువంటి వ్యక్తి భారత రాష్ట్ర సమితిలో కొనసాగడం ఆ పార్టీ చేసుకున్న దరిద్రమంటూ ఆమె ఆరోపించారు. గుంటనక్క అని కవిత సంబందించిన ఆ వ్యక్తి ఎవరని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యాసంస్థల విషయంలో ఉద్యమకారులు తీవ్రంగా స్పందించారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థల మీద దాడులు కూడా చేశారు.
ఇటీవల కాలంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి సంబంధించిన ఓ కీలక నాయకుడు ఆ రెండు విద్యాసంస్థలకు పాలు పోస్తున్నారని.. వ్యాపారం సాగిస్తున్నారని కవిత ఆరోపించారు. ఇటీవల కాలంలో హరీష్ రావు పేరు ప్రస్తావించకుండా గుంట నక్క అని కవిత అంటున్నారు. బహుశా విద్యా సంస్థలతో వ్యాపారం చేస్తున్నది ఆయనేనని తెలంగాణ రక్షణ సేన నాయకులు అంటున్నారు. హరీష్ రావు భార్య పాల వ్యాపారం చేస్తున్నారు. ఒక డెయిరీ కూడా ఆమె ఏర్పాటు చేశారు. అందువల్లే కవిత ఈ ఆరోపణలు చేశారని తెలుస్తోంది. మరి దీనిపై హరీష్ రావు వర్గం నాయకులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
