Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ఇంకా రెండు రోజులే సమయం ఉంది. దీంతో ప్రచారం పీక్స్కు చేరింది. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజాబాబాద్ మున్సిపాలిటీల్లో బీజేపీ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తుది ప్రచారంలో కరీంనగర్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనదైన పాలిటిక్స్కు తెరతీశారు. ఆదివారం నిర్వహించిన విజయ సంకల్ప ర్యాలీలో కాంగ్రెస్ – ఎంఐఎం కుట్రను బహిర్గతం చేశారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్–ఎంఐఎం రూ.100 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు సంచలన ఆరోపణ చేశారు.
భారీ ర్యాలీతో సందేశం..
విజయ సంకల్ప ర్యాలీ నిర్వహించిన సంజయ్ విపక్షాలకు ఒక సందేశం ఇచ్చారు. రెవెన్యూ గార్డెన్ నుంచి టవర్ సర్కిల్ వరకు సాగిన భారీ ర్యాలీలో వేల మంది కార్యకర్తలు కాషాయ దుస్తులు ధరించి పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ తెలంగాణ ఇన్చార్జి ఆశీష్ షెలార్, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ర్యాలీ మార్గంలో జైశ్రీరాం నినాదాలు మార్మోగాయి.
విపక్షాల కుట్ర బహర్గంత..
కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ 50 సీట్లు గెలువబోతుందని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయం తెలిసి అధికార కాంగ్రెస్, ఎంఐఎం నేతలు రహస్యంగా సమావేశమై ఓటర్లను ప్రభావితం చేసేందుకు డీల్ కుదుర్చుకున్నారని బండి సంజయ్ వెల్లడించారు. ఇది కబడ్డీ మ్యాచ్లో మ్యాచ్ఫిక్సింగ్లా ఉందన్నారు. బీజేపీని ఓడించడానికే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆరోపించారు. హిందువులంతా రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
కబడ్డీ మొదలు పెట్టాం..
బీజేపీ నేతలకు కుటుంబం కన్నా దేశం, ధర్మానికే ప్రాధాన్యం ఇస్తారని అన్నారు. ఇప్పటికే కరీంనగర్లో కబడ్డీ మొదలు పెట్టామన్నారు. బీజేపీ కూత విని హైదరాబాద్ నుంచి ఒవైసీ ఉరికొచ్చాడన్నారు. బీజేపీ భారత్ తరఫున ఆడుతుంటే.. కాంగ్రెస్ ఎంఐఎం పాకిస్తాన్ తరఫున ఆడుతున్నాయన్నారు. ఎన్ని కుట్రలు చేసినా 11న జరిగే ఫైనల్ మ్యాచ్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. రామాయణంలో రాముడికి రావణుడే గుర్తొస్తాడని, మహాభారతంలో పాండవులకు కౌరవులే గుర్తొస్తారని, అలాగే బండి సంజయ్కు ఒవైసీనే గుర్తొస్తాడని.. రామాయణం, మహాభారతలో రావణుడు, కౌరవులకు పట్టిన గతే.. ఎంఐఎంకు పడుతుందన్నారు.
రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి..
రెండు రోజుల్లో ఎన్నికలు జరుగుతాయని ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాలని బండి సంజయ్ సూచించారు. కరంనగర్లో కాషాయ జెండా ఎగురవేస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. హిందువులంతా ఏకమై కాంగ్రెస్–ఎంఐఎం కుట్రను బద్ధలు కొట్టాలని కమలం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.