Site icon OkTelugu

TG MLC Elections: తెలంగాణలో ఎన్నికల కోడ్‌.. ఆ నాలుగు పథకాలకు బ్రేక్‌?

TG MLC Elections

TG MLC Elections

TG MLC Elections: తెలంగాణలో అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా.. చాలా హామీలను కాంగ్రెస్‌ ప్రభుత్వం నెరవేర్చలేదు. దీంతో విపక్షాలనుంచి ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు ప్రజల్లో కూడా ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోంది. దీనిని పసిగట్టిన రేవంత్‌ సర్కార్‌ కొత్తగా నాలుగు పథకాలను ప్రారంభించింది. జనవరి 26న వీటిని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఇందులో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డుల జారీ పథకాలు ఉన్నాయి. అయితే ప్రారంభించిన నాలుగు రోజులకే వీటికి బ్రేక్‌ పడింది. రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ(MLC)స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో నిబంధనల ప్రకారం పథకాలను నిలిపివేయాల్సి ఉంటందని ఎన్నికలక కమిషన్‌(Election Commission) వర్గాలు తెలిపాయి. ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని తేలిసే తూతూ మంత్రంగా పథకాలను ప్రారంభించినట్లు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కోడ్‌ వంకటో ఇప్పుడు వాటిని పక్కన పెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఏడాదంతా వరుసగా ఎన్నికలు ఉండడంతో పథకాలు అమలు ఇప్పట్లో అమలయ్యే అవకాశం లేదన్న చర్చ కూడా జరుగుతోంది.

రైతు భరోసా మరింత ఆలస్యం..
ఎన్నికల కోడ్‌ అమలు నేపథ్యంలో రైతులకు యాసంగి పంటలకు అందిస్తామన్న పెట్టుబడి సాయం రైతుభరోసా డబ్బులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఇప్పటికే వరినాట్లు పూర్తయ్యాయి. అయినా పెట్టుబడి అందలేదు. గత యాసంగి, వానాకాలం పాత పద్ధతిలోనే రైతుబంధు అందించింది. ఈ యాసంగి నుంచి రూ.6 వేల చొప్పును పెట్టుబడి ఇవ్వాలని నిర్ణయించింది. కానీ, ఇప్పుడు ఎన్నికల కోడ్‌రావడంతో రైతు భరోసాను కొనసాగిస్తారా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పథకం ప్రారంభించిన మూడు రోజులు గడిచినా.. కొంత మంది ఖాతాల్లోనే డబ్బులు జమయ్యాయి.

ఇందిరమ్మ ఇళ్లకూ బ్రేక్‌..
పేదల సొంత ఇంటి కల నెరవేర్చడానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలిపింది. ఎన్నికల సమయంలోనే హామీ ఇచ్చింది. అయితే 14 నెలలుగా పథకం అమలు కాలేదు. దీంతో పేదలు ఆశగా ఎదురు చూస్తున్నారు. సర్వేలు, గ్రామసభలు నిర్వహించి ఎట్టకేలకు జనవరి 26న పథకం ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో నిధులు విడుదల ఏయలేని పరిస్థితి. దీంతో ఇదిరమ్మ ఇళ్లకు మరోసారి బ్రేక్‌ పడింది. ఈ ఏడాది కూడా మోక్షం కలుగకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ పరిస్థితి కూడా ఇంతే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏడాదంతా ఎన్నికలే..
ఆగిపోయిన పథకాలు ఈఏడాదిలో తిరిగి ప్రారంభించే పరిస్థితి లేదు. ప్రస్తుతం అమలులోకి వచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ మార్చి మొదటి వారంలో ముగుస్తుంది. ఆ తర్వాత మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలతోపాటు మున్సిపల్, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో ఏడాదంతా కోడ్‌తోనే గడిచిపోయే అవకాశం ఉంది. దీంతో ఈ ఏడాది కొత్త పథకాలు అమలయ్యే అవకాశం కనిపించడం లేదు.

తెలిసే చేశారా..
రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి కొత్త పథకాలు ప్రారంభిస్తుందని మొదట ప్రకటించింది. తర్వాత దానిని జనవరి 26కు వాయిదా వేసింది. దీంతో ఎన్నికల కోడ్‌ వస్తుందని తెలిసే ఇలా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతికి ప్రారంభించి ఉంటే ఇప్పటికే రైతుభరోసా నిధులు అయినా రైతులకు సమయానికి అందేవని రైతులు అంటున్నారు. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగియడానికి నెల రోజులు పడుతుంది. అప్పటికి పంట కాలం పూర్తి కావస్తుంది. అదునుకు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఉన్న పథకాల అమలే భారంగా మారిన నేపథ్యంలో కొత్త పథకాల అమలు సాధ్యం కాదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే రేవంత్‌ సర్కార్‌ మొక్కుబడిగా ప్రారంభించి ఎన్నికల కోడ్‌ సాకుతో నిలిపివేసిందన్న ప్రచారం జరుగుతోంది.

Exit mobile version