Deputy Collector Illegal Assets Case: అవినీతిలో ఇదో వండర్. టాప్ రికార్డ్ కూడా. అవినీతికి పాల్పడే ఏ ప్రభుత్వ అధికారైనా సరే లంచాలు తీసుకుంటాడు. పనులు చేసిపెట్టి డబ్బులు లేదా బంగారం లేదా ఇతర ఖరీదైన వస్తువులు తీసుకుంటాడు. ఇతడు మాత్రం అంతకుమించి అనేలా వ్యవహరించాడు. ఏకంగా వందల కోట్లు కొట్టేశాడు. వాటిని రకరకాలుగా మార్చి దర్జాగా దండుకున్నాడు. చివరికి పాపం పండి దొరికిపోయాడు.
తెలంగాణ ఏసీబీ అధికారులు మరో మెరుపు దాడి చేశారు. అవినీతికి పాల్పడుతున్న ఓ భారీ అనకొండను శుక్రవారం పట్టుకున్నారు. అతడు సంపాదించిన ఆస్తులను చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. అతడు సంపాదించిన ఆస్తులు, వాటిని అతడు సొమ్ము చేసుకున్న విధానం చూసి నివ్వెరపోయారు. కొద్ది రోజులుగా ఇతడి మీద ఏసీబీ అధికారులు నజర్ పెట్టారు. చివరికి అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత శుక్రవారందాడులు మొదలు పెట్టారు.
మేడ్చల్ మాల్కాజ్ గిరి డిప్యూటీ కలెక్టర్ గా పని చేస్తున్నారు వంశీమోహన్. ఈయన ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. వందల కోట్ల ఆస్తులను అక్రమంగా సంపాదించినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న శేరిలింగంపల్లిలో ఇతడు భారీగా ప్రభుత్వ భూములను కాజేసినట్టు ఏసీబీ అధికారుల సోదాలలో తేలింది. గతంలో శేరిలింగంపల్లి ప్రాంతంలో మోహన్ ఆర్డీవోగా పని చేశాడు. అప్పట్లో ప్రభుత్వ భూములను భారీగా దండుకున్నాడు.
అబ్దుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో 8 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేశాడు. ఆ భూములను తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఓ స్థిరాస్తి వ్యాపారికి అమ్మాడు. అందులో దాదాపు 8 ప్లాట్లను గిఫ్ట్ డీడ్ చేయించుకున్నాడు. వంశీ మోహన్ విలాసవంతమైన ఇంట్లో నివాసం ఉంటున్నాడు. ఖరీదైన ఆస్తులు సంపాదించాడు. దీంతో అనుమానం వచ్చిన ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కాగా, ఇతడు కొన్ని కంపెనీలలో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. వాటిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచే ఏసీబీ అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు. ప్రొటెక్షన్ కోసంస్థానిక పోలీసుల సహకారాన్ని ఏసీబీ అదికారులు తీసుకున్నట్టు సమాచారం.
