Site icon OkTelugu

Congress Janagarjan Sabha: కాంగ్రెస్‌ మేనియా.. కదంతొక్కుతున్న ఖమ్మం.. హోరెత్తుతున్న పీపుల్స్‌ మార్చ్‌!

Congress Janagarjan Sabha

Congress Janagarjan Sabha

Congress Janagarjan Sabha: తెలంగాణను కాంగ్రెస్‌ మేనియా కమ్మేసింది. రాష్ట్రం నలుమూలల పార్టీ శ్రేణుల రాకతో ఖమ్మం కదం తొక్కుతోంది. దారులన్నీ జనగర్జన సభ వైపే కదులుతున్నాయి. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ రానుండడంతో రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి పార్టీ శ్రేణులతోపాటు జనం స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. సుమారు ఐదు లక్షల మందితో జనగర్జన సభను సక్సెస్‌ చేయాలని టీపీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్‌ గాంధీ సన్మానంతోపాటుగా ప్రజలకు కాంగ్రెస్‌ తరఫున స్పష్టమైన హామీలు ఇవ్వనున్నారు.

కాంగ్రెస్‌లో జోష్‌..
భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్‌ పార్టీలో కొత్త జోష్‌ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కాంగ్రెస్‌ పనైపోయింది అన్న వారే ఇప్పుడు హస్తం పార్టీ బలం పుంజుకుంటోంది అనిపించేలా చేశాడు. దీంతో కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్‌ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్‌ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర తరువాత కేసీఆర్‌కు ఇక కష్టమే అంటున్నారు.

ఒకే ఒక్కడు…
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఒకే ఒక్కడు అన్నట్లుగా మారిపోయింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్‌ మార్చ్‌కు ముందు – తర్వాత అనేలా పార్టీలో మార్పు వచ్చింది. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్‌ అయ్యారని చెప్పవచ్చు. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేటెస్ట్‌ ట్రెండింగ్‌ గా నిలిచారు.

సంచలనంగా యాత్ర..
పీపుల్స్‌ మార్చ్‌ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు.. మరెన్నో ప్రజాసమస్యను గుర్తించడానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ ఎవరూ కన్నెత్తి చూడడానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వతంత్ర తెలంగాణ రాజకీయాలకు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్‌ జిల్లా మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా భట్టి పాదయాత్రతో కాంగ్రెస్‌ మేనియా మొదలైంది. తాజాగా ఖమ్మం నగరంలో తలపెట్టిన జనగర్జన సభతో అది పీక్స్‌కు చేరింది.

అడుగడుగునా త్రివర్ణ శోభితం..
ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్‌ ఫ్లెక్సీలతో సుందరంగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ జెండాలు, హోర్డింగ్‌ ఆకర్షిస్తున్నాయి. పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20 అడుగుల ఎత్తు, వెడల్పు ఉన్న హోర్డింగ్స్, పెద్దపెద్ద బెలూన్స్‌ ఏర్పాటు చేశారు.

Exit mobile version