Site icon OkTelugu

Delhi Liquor Scam: కవితతో కేజ్రీవాల్ ను కొట్టే బీజేపీ ప్లాన్

Delhi Liquor Scam

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో మళ్లీ సీబీఐ దూకుడు పెంచబోతోందా.. ఇప్పటికే ఈడీ నోటీసులకు స్పందించని నేతలపై ఇప్పుడు సీబీఐ ఫోక్‌ పెట్టాందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు తనయ ఎమ్మెల్సీ కవిత లిక్కర్‌ స్కాంలో సౌత్‌ లాబీల్లో కీలకంగా వ్యవహించారని ఈడీ, సీబీఐ చార్జిషీట్లలో పేర్కొన్నాయి. ఈ క్రమంలో ఈడీ ఇప్పటికే కవితను మూడుసార్లు విచారణ చేసింది. ఇక సీబీఐ రెండుసార్లు కవిత ఇంటికి వచ్చి విచారణ చేసింది. మరోసారి పిలుస్తామని చెప్పినా ఇప్పటి వరకు పిలవలేదు.

మళ్లీ ఇన్ని రోజులకు..
ఇక ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితకు తాజాగా మళ్లీ నోటీసులు జారీ చేసింది. కవిత లిక్కర్‌ స్కాంలో భారీగా ఆస్తులు వెనకేశారని గతంలో సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. తర్వాత పట్టించుకోలేదు. తాజాగా నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. ఈడీ, సీబీఐ రెండూ వేర్వేరుగా కేసులు నమోదు చేసి ఈ స్కాంపై విచారణ జరుపుతున్నాయి. తనను విచారణకు పిలవొద్దని కవిత ఈడీపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. నెలల తరబడి వాయిదా పడుతోంది. దీంతో కవిత రిలాక్స్‌ అవుతున్నారు.

సీబీఐ రంగంలోకి..
తాజాగా సీబీఐ రంగంలోకి దిగింది. సౌత్‌ లాబీ నుంచి దాదాపు అందరూ అరెస్ట్‌ అయ్యారు.. అప్రూవర్‌గా మారారు. కవిత మాత్రం ఇంతవరకు అరెస్ట్‌ కాలేదు.. అప్రూవర్‌ కాలేదు. ఇప్పటికే అప్రూవర్‌గా మారిన మాగుంట రాఘవరెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా తాజాగా సీబీఐ కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఒక్క దెబ్బకు ఇద్దరు నేతలు..
సీబీఐ, ఈడీ నోటీసులు ఇస్తున్నా ఇటు కవిత, అటు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించడం లేదు. దీంతో ఈసారి ఇద్దరినీ ఒకేసారి టార్గెట్‌ చేయాలని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. ఢిల్లీ సీఎంపై సీబీఐ స్కాం పాలసీ మార్పు, క్విడ్‌ ప్రోకో వంటి అంశాలపై కేసు నమోదు చేసింది. ఇందులో మాగుంట రాఘవరెడ్డి కీలక అంశాలు వెల్లడించారు. కేజ్రీవాల్‌కు, ఆమ్‌ఆద్మీ పార్టీకి డబ్బులు ఎలా ఇచ్చారు అని తెలిపారు. ఈ వ్యవహారంలో కవితే కీలకంగా వ్యవహరించారని పేర్కొన్నారు. దీంతో ఈ స్టేట్‌మెంట్‌ ఆధారంగా ఇటు కేజ్రీవాల్, అటు కవితను విచారణ చేస్తారని తెలుస్తోంది. కవిత భుజంపై తుపాకీ పెట్టి కేజ్రీవాల్‌ను షూట్‌ చేయడమే లక్ష్యంగా తాజా నోటీసులు అని ప్రచారం జరుగుతోంది. కవిత విచారణ తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంటుందని తెలుస్తోంది.

Exit mobile version