T20 World Cup: మన స్థాయికి తగ్గట్టుగా మనం ఉండాలి. మన స్థాయిని మించి ఊహించుకుంటే అసలుకే మోసం వస్తుంది. ఇప్పుడు ఇది పాకిస్తాన్ జట్టుకు నూటికి నూరు శాతం సరిపోతుంది. క్రికెట్ ఆడే జట్లలో పాకిస్తాన్ గొప్పగా చెప్పుకునే కీలకమైన టీం కాదు. అయినప్పటికీ ఐసీసీ ఆ క్రికెట్ బోర్డు కు సపోర్ట్ ఇస్తూనే ఉంటుంది. కాకపోతే ఇస్తున్న సపోర్ట్ ను సద్వినియోగం చేసుకోవాల్సిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దుర్వినియోగం చేస్తోంది. ముఖ్యంగా భారత జట్టుతో జరిగే మ్యాచ్ విషయంలో అనవసరమైన బెట్టుకు పోతోంది.
టి20 వరల్డ్ కప్ లో ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా టీమిండియాతో ఆడాల్సిన పాకిస్తాన్.. రకరకాల ప్రచారాలకు దిగింది. బంగ్లాదేశ్ పేరును తెరపైకి పెడుతూ.. ఆ క్రికెట్ జట్టుకు సంఘీభావంగా తాము భారత జట్టుతో జరిగే మ్యాచ్ ఆడబోమని చెప్పింది. దీంతో టి20 వరల్డ్ కప్ నిర్వాహకుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగింది. ఎందుకంటే పాకిస్తాన్, భారత్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. టికెట్ విక్రయాలనుంచి మొదలుపెడితే ప్రసార హక్కుల వరకు వందల కోట్లలో వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ ఆడక పోవడం వల్ల అదంతా నష్టమే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
జాతీయ మీడియాలో మాత్రం భిన్నమైన కథనాలు ప్రసారమవుతున్నాయి. టీమిండియాతో ఆడేందుకు పాకిస్తాన్ ఒప్పుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే అంతర్జాతీయ క్రికెట్ మండలి పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ప్రస్తుతం చర్చలు జరుపుకున్నట్టు తెలుస్తోంది. లాహోర్ వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో ఐసిసి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రతినిధులు హాజరైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీం ఇండియాతో తాము ఆడాలి అంటే మ్యాచ్ ద్వారా లభించే ఆదాయంలో హైయెస్ట్ పర్సంటేజ్ ఇయ్యాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు నష్టపరిహారం కూడా ఇవ్వాలని.. మ్యాచ్ ఫీజులను కూడా ఆటగాళ్లకు చెల్లించాలని కోరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు కోరిన కోరికల విషయంలో ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ సానుకూలంగా స్పందించలేదని సమాచారం. అంతేకాదు భారత జట్టుతో ఆడాల్సిన మ్యాచ్ నుంచి తప్పుకోవడం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివరణ కోరినట్టు సమాచారం. అన్ని సభ్య దేశాలకు వచ్చినట్టుగానే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా ఆదాయం వస్తుందని ఐసిసి డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ వెల్లడించినట్టు ప్రచారం జరుగుతుంది.
బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డును తెర ముందు పెడుతూ.. భారీగా లబ్ధి పొందాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రణాళిక రూపొందించినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఐసీసీతో జరిగే చర్చలు సఫలమైతే పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ నిర్ణయం ఆధారంగానే తాము ఆడుతామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దలు చెప్పడం వారి దుర్బలమైన నీతికి అద్దం పడుతోంది. ఒకవేళ ఈ వ్యవహారాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇంకా పెద్దది చేస్తే చివరికి నష్టపోయేది ఆ క్రికెట్ బోర్డేనని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ వ్యవహారంపై భారత క్రికెట్ మండలి పెద్దలు స్పందించారు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల విలేకరులతో మాట్లాడారు. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఆధారంగానే తాము ముందడుగు వేస్తామని.. ఇందులో తమ సొంత ప్రయోజనాలు ఉండవని స్పష్టం చేశారు.