ODI World Cup 2027 Schedule: ఐపీఎల్ సంబరం ముగిసిపోయింది. అంతకంటే ముందు టి20 వరల్డ్ కప్ విజయవంతంగా సాగింది. ఇప్పుడు అందరి దృష్టి వన్డే ప్రపంచ కప్ 2027 గురించి. అయితే దీనికి సంబంధించి అభిమానులకు ఐసీసీ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఐసీసీ 2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేసింది.. అహ్మదాబాదులో ఐసీసీ బోర్డు సమావేశంలో మ్యాచ్ నిర్వహణ తేదీలను ప్రకటించారు.
అక్టోబర్ 4 నుంచి మొదలు
వచ్చే ఏడాది అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 అంటే దాదాపు 48 రోజులపాటు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ కొనసాగుతూ ఉంటుంది. చాలా వరకు మ్యాచులు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. టోర్నమెంట్లో మొత్తం 54 మ్యాచులు జరిగే అవకాశం ఉంది. ఇందులో 41 మ్యాచ్లు దక్షిణాఫ్రికాలో జరుగుతాయి. 8 స్టేడియాలలో ఈ మ్యాచ్ లు నిర్వహిస్తారు. జింబాబ్వే లో ఎనిమిది నుంచి పది మ్యాచ్లు జరుగుతాయి. మిగతా మూడు మ్యాచ్లను నమీబియాలో నిర్వహిస్తారు. జింబాబ్వేలో క్వీన్స్, హరారే స్పోర్ట్స్ క్లబ్, విక్టోరియా ఫాల్స్ మైదానాలలో మ్యాచులు నిర్వహిస్తారు.
పాత విధానంలోనే నిర్వహణ
సౌత్ ఆఫ్రికా ఇప్పటివరకు టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇచ్చింది. 2003లో సౌత్ ఆఫ్రికా మెన్స్ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. నాడు కంగారు జట్టు విజేతగా నిలిచింది. ఈసారి మెన్స్ వన్డే వరల్డ్ కప్ పాత విధానంలోనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. దీనివల్ల మిగతా జట్లు కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తాయి. అవసరమైతే సంచలన ప్రదర్శన చేస్తాయి. దీనివల్ల ట్రోఫీ మీద అంచనాలు పెరిగిపోతాయి. రేటింగ్స్ కూడా అధికంగా నమోదవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఐసిసికి దండిగా ఆదాయం వస్తూ ఉంటుంది. అందువల్లే ఐసీసీ ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
గతంలో ఏం జరిగిందంటే..
గతంలో రెండు ఎడిషన్లలో 10 జట్లు మాత్రమే వన్డే వరల్డ్ కప్ లో పాల్గొన్నాయి. 2027లో మళ్లీ 14 జట్ల విధానాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. రెండు గ్రూపులలో 14 జట్లను విభజిస్తారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన జట్లకు సూపర్ సిక్స్ అవకాశం ఉంటుంది.. ఐసీసీ సభ్య దేశాలుగా ఉన్న దక్షిణాఫ్రికా.. జింబాబ్వే ట్రోఫీలో ఆడేందుకు నేరుగా అర్హత సాధించాయి. నమీబియా క్వాలిఫై మ్యాచ్ ఆడాలి. అందులో గెలిస్తేనే వరల్డ్ కప్ లో ఆడే అవకాశం ఉంటుంది.

