KL Rahul: 226 పరుగుల టార్గెట్.. ఐపీఎల్ లో ఇదేమి తక్కువ లక్ష్యం కాదు. పైగా ఢిల్లీ ఆట తీరు అంత గొప్పగా లేదు. రాజస్థాన్ జోరు మామూలుగా లేదు. వైభవ్ సూర్య వంశీ, జైస్వాల్ వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. కెప్టెన్ రియాన్ పరాగ్ అదరగొట్టాడు.. మిగతా బ్యాటరీ కూడా తమ స్థాయిలో బ్యాటింగ్ చేశారు.. దీంతో రాజస్థాన్ 225 పరుగులు చేసింది. ఒక రకంగా ఢిల్లీ జట్టుకు ఈస్కోరు ఇబ్బందికరమైనదే. ఇంతటి స్కోరు చేదించే సత్తా ఆ జట్టుకుంది. కానీ రీసెంట్ ఫాం ప్రకారం చూసుకుంటే.. ఆ జట్టు గెలిచే అవకాశం దాదాపు తక్కువ.
జైపూర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు కు లోకల్ ఫ్యాన్స్ సపోర్ట్ విపరీతంగా ఉంది. దీంతో రాజస్థాన్ జట్టు కచ్చితంగా గెలుస్తుందని అందరూ ఒక అంచనాకొచ్చారు. కానీ ఇక్కడే కె.ఎల్ రాహుల్ స్క్రిప్ట్ మరో విధంగా రాశాడు.. తను ఏకంగా 75 పరుగులు చేశాడు. నిస్సాంక 62 పరుగులతో అదరగొట్టాడు.. నితిష్ రాణా 33, ఆశు తోష్ 25*, స్టబ్స్ 18* ఆకట్టుకున్నారు. ఫలితంగా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ జట్టు విజయం సాధించింది. తద్వారా ఇటీవల వరుసగా ఎదురైన ఓటముల నుంచి ఢిల్లీ జట్టు కోలుకుంది.. రాజస్థాన్ ఊహించని ఓటమితో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది.
ఈ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఢిల్లీ జట్టు ఓపెనర్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఇండియన్ ప్లేయర్లలో జడేజా (17) రికార్డును సమం చేశాడు.. రోహిత్ శర్మ (21), కోహ్లీ (20), ధోని (18) తొలి మూడు స్థానాలలో ఉన్నారు. రాజస్థాన్ రాయల్స్ మీద 75 పరుగులు (187 స్ట్రైక్ రేట్) చేసిన రాహుల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. ప్రస్తుతం 433 పరుగులతో ఆరంజ్ క్యాప్ హోల్డర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్లో అద్భుతమైన స్ట్రైక్ రేట్ తో కొనసాగుతున్న కేఎల్ రాహుల్.. ఢిల్లీ జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు.
ఇటీవల పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో రాహుల్ మెరుపు వేగంతో బ్యాటింగ్ చేశాడు. ఏకంగా సెంచరీ సాధించాడు. కానీ ఆ మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. బౌలర్ల వైఫల్యంతో పంజాబ్ జట్టు ప్లేయర్లు బీభత్సంగా ఆడారు. పంజాబ్ జట్టు ఓపెనర్లు.. కెప్టెన్ అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో పంజాబ్ జట్టు అద్భుతమైన విజయాన్ని అందుకుంది. కేఎల్ రాహుల్ సెంచరీ చేసినప్పటికీ.. ఢిల్లీ జట్టు గెలవకపోవడం అభిమానులకు ఆవేదన కలిగించింది. బెంగళూరు తో జరిగిన మ్యాచ్ లో కూడా ఢిల్లీ జట్టు అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది. జట్టు కనీసం వంద పరుగులు కూడా చేయలేకపోయింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఇది ఏ జట్టుకైనా సరే అత్యల్ప స్కోర్.