Pushpagiri Temple: కాశీలో గంగానది ప్రవహిస్తూ ఉంటుంది. విశ్వేశ్వరుడు కొలువై ఉంటాడు. ప్రతిరోజు సాయంత్రం జరిగే గంగా హారతి అద్భుతంగా ఉంటుంది. విశ్వేశ్వరుడికి జరిగే పూజలు కూడా గొప్పగా ఉంటాయి. కాశీలో జరిగే ఈ క్రతువును చూసేందుకు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భక్తులు వస్తుంటారు.
కాశీ వెళ్లలేని వారికి ఏపీలో ఒక అద్భుతమైన క్షేత్రం ఉంది. ఇది మహిమాన్వితమైన ఆలయం. ఇక్కడ శివుడు, విష్ణుమూర్తి కొలువై ఉన్నారు. నిత్యం పూజలు అందుకుంటారు. పైగా ఇక్కడ ఐదు నదులు ప్రవహిస్తూ ఉంటాయి. అవి ఒకచోట కలుస్తుంటాయి. ఈ ప్రాంతం పేరు పుష్పగిరి. దీనిని దక్షిణ కాశీ అని పిలుస్తుంటారు.
కడప జిల్లా నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఆదిశంకరులు చంద్రమౌళీశ్వర లింగానికి పూజలు చేశారు. కడప జిల్లా కేంద్రం నుంచి కర్నూలు నగరానికి వెళ్లే దారిలో చెన్నూరు దగ్గరలో ఎడమవైపు మార్గంలో వెళితే పుష్పగిరి ప్రాంతం వస్తుంది. ఈ మహిమాన్విత క్షేత్రం కొండ మీద ఉంది. కొండ కింద పుష్పగిరి గ్రామం ఉంటుంది. ఈ గ్రామానికి.. ఆలయానికి మధ్యలో పెన్నా నది ప్రవహిస్తూ ఉంటుంది. శైవులు, వైష్ణవులు పుష్పగిరి క్షేత్రానికి వస్తుంటారు. వైష్ణవ మతాన్ని ఆచరించేవారు దీనిని మధ్య అహోబిలం అని పిలుస్తుంటారు. శివదేవుడిని కొలిచేవారు దీనిని మధ్య కైలాసం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకరాచార్యులకు ఇది ఒకటే మఠం కావడం విశేషం.
ఈ క్షేత్రానికి దగ్గరలో పాపాగ్ని.. కుముద్వతి, పల్కల, మాండవి నదులు పెన్నా లో కలుస్తాయి. అందువల్లే దీనిని పంచనది క్షేత్రం అని పిలుస్తుంటారు. ఇక్కడ వైద్యనాథ స్వామి శివుడి రూపంలో.. చెన్నకేశవ స్వామి విష్ణురూపంలో కొలువై ఉంటారు. అందువల్లే పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రాచుర్యం పొందింది.
ఈ క్షేత్రానికి వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ జరిగే పూజలు విశేషంగా ఉంటాయి. దేవతామూర్తులకు ప్రతిరోజు దీప దీప నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అయ్యప్ప మాల ధరించిన వారు ఇక్కడ దీక్షలు చేస్తుంటారు.. ఈ దీక్షల సమయంలో విష్ణుమూర్తిని.. శివుడిని ఆరాధిస్తుంటారు.. ఐదు నదులు కలిసే చోట స్నానాలు చేసి.. ఆధ్యాత్మిక భావాన్ని పరివ్యాప్తం చేస్తుంటారు. ఈ కొండమీద ఉన్న క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తే మరింత మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.