TDP- BJP: టీడీపీకి షాక్.. ఎన్డీఏ సమావేశానికి అందని ఆహ్వానం..!
సోషల్ మీడియా యూనివర్సిటీల్లో చాలా వార్తలు వస్తుంటాయని, వాటన్నిటికీ సమాధానం చెప్పలేమని అన్నారు మాధవ్. ఎన్డీఏ కూటమిలో టీడీపీ లేదని, ఆ పార్టీని ఎందుకు ఆహ్వానిస్తామని ప్రశ్నించారు. తమతో కలసి పనిచేస్తున్న జనసేనకు ఆహ్వానం వెళ్లిందని తెలిపారు.

TDP- BJP: తెలుగుదేశం పార్టీ ఏన్డీఏలో చేరుతుందని, ఈనెల 18న నిర్వహించే సమావేశానికి రావాలని ఆహ్వానం అందిందని ఏపీ మీడియా రెండు రోజులుగా ప్రచారం చేస్తోంది. టీడీపీ అనుకూల మీడియా అయితే.. మోదీతో బాబు దోస్తీ అన్నట్లుగా కథనాలు ప్రచురించింది. ప్రసారం చేసింది. కానీ, ఈ ప్రచారం అంతా ఉత్తదే అని బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్ స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమిలో టీడీపీ లేదని, ఆ పార్టీని ఎందుకు ఆహ్వానిస్తామని ప్రశ్నించారు. తమతో కలసి పనిచేస్తున్న జనసేనకు ఆహ్వానం అందిందని స్పష్టం చేశారు. దీంతో టీడీపీతోపాటు ఆ పార్టీ అనుకూల మీడియా షాక్ అయింది.
విపక్ష కూటమికి పోటీగా..
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్షాలన్నీ ఏకమవుతుండో బీజేపీ కూడా ఎన్డీఏ కూటమి బలం చూపాలని భావించింది. ఇందుకోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎన్డీఏ కూటమిని పటిష్టపరిచే క్రమంలో ఈనెల 18న భాగస్వామ్య పార్టీల మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్ కి ఎన్డీఏ పాతమిత్రులంతా హాజరవుతారని అంటున్నారు. టీడీపీకి కూడా ఆహ్వానం వెళ్లిందనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్. అయితే ఉన్నట్టుండి టీడీపీ గాలి తీసేశారు బీజేపీ ఏపీ ప్రధాన కార్యదర్శి మాధవ్. అసలు టీడీపీకి ఆహ్వానమే లేదని తేల్చేశారాయన.
జనసేనకే ఆహ్వానం..
సోషల్ మీడియా యూనివర్సిటీల్లో చాలా వార్తలు వస్తుంటాయని, వాటన్నిటికీ సమాధానం చెప్పలేమని అన్నారు మాధవ్. ఎన్డీఏ కూటమిలో టీడీపీ లేదని, ఆ పార్టీని ఎందుకు ఆహ్వానిస్తామని ప్రశ్నించారు. తమతో కలసి పనిచేస్తున్న జనసేనకు ఆహ్వానం వెళ్లిందని తెలిపారు. జనసేన తమకు మిత్రపక్షం అని స్పష్టం చేశారు. అయితే జనసేన నుంచి కూడా దీనిపై క్లారిటీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం ఒక జనసేనకు మాత్రమే ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. గతంలో వీర్రాజు కూడా ఇదే విషయంలో క్లారిటీ ఇచ్చారు, ఇప్పుడు మరోసారి మాధవ్ టీడీపీని తీసిపారేసినట్టు మాట్లాడారు.
ఎన్డీఏలో చేరికపై హైకమాండ్ నిర్ణయమే..
ఇక టీడీపీ ఎన్డీఏలో చేరికపై కూడా మాధవ్ స్పష్టత ఇర్చారు. తమను కాదనుకుని బయటకు వచ్చిన టీడీపీ గురించి ఇప్పుడు తాము ఆలోచన చేయడం లేదన్నారు. ఒకవేళ తిరిగి రావాలనుకుంటే దానిపై హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. దాని తర్వాతే బీజేపీ టీడీపీ అభిప్రాయం తీసుకుంటుందని క్లారిటీ ఇచ్చారు.
