Homeజాతీయ వార్తలుModi Heeraben : ఒంటరైన మోదీ.. పేగుబంధమూ తెగిపోయింది!

Modi Heeraben : ఒంటరైన మోదీ.. పేగుబంధమూ తెగిపోయింది!

Modi Heeraben : ప్రధాని నరేంద్రమోదీ పూర్తిగా ఒంటరయ్యాడు.. ఆయన తల్లి హీరాబెన్‌(100) శుక్రవారం తెల్లవవారుజామున అనారోగ్యంతతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఉన్న ఒక్క పేగు బంధం తెగిపోవడంతో మోదీ ఇక పూర్తి సన్యాసిగా మారారు. తల్లి మరణవార్త విని హుటాహుటిన గుజరాత్‌కు వచ్చిన ఆయన తల్లి మృతదేహాన్ని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. అంత్యక్రియల్లో స్వయంగా పాడె మోశారు. తల్లి అంత్యక్రియలు ముగిసిన వెంటనే తన అధికార విధుల్లో మళ్లీ మునిగిపోయారు. ఆయన ఎప్పుడో వదిలేసిన భార్య జశోదాబెన్‌ అత్తగారి అంత్యక్రియల సందర్భంగా కనిపించిందా లేదా అనే అంశమూ పెద్దగా ఆసక్తిని కలిగించలేదు.. అన్న, తమ్ముడు ఉండగా తనెందుకు చితికి నిప్పు పెట్టాడు అనేది కూడా ఆలోచనల్లోకి రాలేదు.. కానీ ఆమె మరణించిన వెంటనే ప్రధాని మోడీ గుజరాత్‌ వెళ్లిపోవడం.. అత్యంత నిరాడంబరంగా, నిశ్చల చిత్తంతో, నిజంగా ఓ సన్యాసి తరహాలోనే, నిర్వేదంగానే ఆమె అంత్యక్రియల్ని జరిపించిన తీరు కదిలించింది.. అందరికీ కనెక్టయింది.

-సామాన్యురాలిగా..
హీరాబెన్‌ మృతదేహాన్ని అలాగే ఉంచితే బీజేపీ శ్రేణులు, నాయకులు గుజరాత్‌కు పయనమవుతారు. సందడిం అనవసరం.. కోలాహలం.. ప్లాస్టిక్‌ పరామర్శలు ఎందుకని ఎవరూ గుజరాత్‌ రావొద్దని, రాకపోవడమే ఆమెకు నిజమైన నివాళి అని ప్రకటించింది హీరాబెన్‌ కుటుంబం. ఓ మధ్యతరగతి కుటుంబీకురాలు మరణిస్తే ఎలా అంత్యక్రియలు జరుగుతాయో అలాగేం జస్ట్, ఓ సామాన్యురాలిగానే నిష్క్రమించింది హీరాబెన్‌. ప్రధాని మోదీ కూడా తన తల్లి మరణ సమాచారాన్ని కూడా భిన్నంగా దేశప్రజలతో షేర్‌ చేసుకున్నారు. ‘‘వందేళ్ల అమ్మ జీవితం ఇక దేవుడి పాదాల దగ్గర విశ్రాంతి తీసుకుంటోంది.. నిస్వార్థం, విలువలు, కర్మయోగం అనే త్రిమూర్తులను చూసేవాడిని అమ్మలో’’ అన్నట్టుగా నివాళి అర్పించారు.

-వాజ్‌పేయి మరణం సందర్భంగానూ…
మోదీలో ఓ విశిష్ట గుణాన్ని ఇక్కడ గమనించవచ్చు. మాజీ ప్రధాని వాజపేయి మరణించినప్పుడు, ఆ భౌతికదేహం వెంట, వీధుల్లో కిలోమీటర్ల కొద్దీ మౌనంగా నడుచుకుంటూ అంత్యక్రియల స్థలం దాకా వెళ్లారు మోదీ. ఇప్పుడు అమ్మ మరణం.. మొహంలో అదే నిర్వేదం.. నిజానికి ఈ లోకంలో తనకు ఇప్పటిదాకా మిగిలి ఉన్న బంధం అమ్మ మాత్రమే. ఇప్పుడామె కూడా వెళ్లిపోయింది. అక్షరాలా ప్రధాని మోదీ ఇప్పుడు వ్యక్తిగా ఒంటరి. చిన్నతనంలోనే సన్యాసిని అని ప్రకటించుకుని వైవాహిక బంధానికి స్వస్తి పలికారు. సమాజసేవ తప్ప తనకు ఇతరత్రా బంధాలు ఏమీ లేవని నిష్కర్షగా చెప్పడమే కాదు.. తను ఏ హోదాలో ఉన్నా సరే తన కుటుంబాన్ని తన అధికారానికి, తనకు దూరంగా ఉంచారు. ఢిల్లీలోని ప్రధాని నివాసంలో ఎప్పుడూ ఆ కుటుంబసభ్యుల మొహాలు కనిపించలేదు. వాళ్ల నుంచి చిన్న పైరవీ కూడా ఉండేది కాదు. ఎవరి బతుకు వాళ్లది. ఒక్కసారి మాత్రం ప్రధాని నివాసంలోకి అమ్మ వచ్చి కొన్నాళ్లు గడిపినట్టుంది.. అంతే!

-సోదరుడి వద్దనే తల్లి..
మోదీ తమ్ముడు పంకజ్‌ మోదీ గాంధీనగర్‌ దగ్గర రాయ్‌సన్‌లో ఉంటారు. మోదీ తల్లి కూడా తనతోనే ఉండేది. ఎప్పుడైనా మోదీ వెళ్లి అక్కడే ఆమెతో గడిపేవారు. ఎన్నిరకాల బంధాల్ని తెంచుకున్నా సరే, అమ్మ అనే పేగుబంధాన్ని ఎంతటి యోగి అయినా తెంచుకోవడం కష్టం. అమ్మ తరువాతే అన్నీ.. అదొక్కటే మోదీకి ఇన్నాళ్లు తన కుటుంబంతో ఉన్న లింకు.. ఇప్పుడదీ తెగిపోయింది.. అందుకే మోదీ ఇప్పుడు నిజమైన ఒంటరి సన్యాసి.

తన రాజకీయ కార్యాచరణతో చాలామందికి చాలా విభేదాలు ఉండవచ్చుగాక.. వ్యక్తిగా తనను వంక పెట్టేదేమీ ఉండదు. ఏవో తన డ్రెస్సులు, ఫొటోలపై వెటకారాలు తప్ప! అవినీతి లేదు.. ఆస్తుల కక్కుర్తి లేదు.. కొందరు రాష్ట్ర స్థాయి నేతలతో పోల్చి చూడండి.. ఏ దేశం వెళ్లినా సాత్వికాహారమే.. కొన్నిసార్లు ఉపవాసం.. క్రమం తప్పని యోగాభ్యాసం.. మెచ్చుకునేచోట నిజంగానే మెచ్చుకోవాలి. ఈరోజుల్లో క్షుద్ర రాజకీయ నాయకులు సమాజానికి ఎంతటి శాపమో చూస్తున్నాం. పూర్తి కంట్రాస్టుగా బతికే మోదీని ఈ కోణంలో మెచ్చుకోవాలి. సన్యాసిగా మారిన స్వయంసేవకుడు మోదీ!!

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version