Site icon OkTelugu

Pawan kalyan Manchu Manoj: పవన్ కళ్యాణ్ తో మంచు మనోజ్ భేటి.. అసలు కథేంటి?

Pawan kalyan Manchu Manoj: రెండు వైరి వర్గాలుగా విడిపోయిన టాలీవుడ్ ఇండస్ట్రీలో తాజాగా అనుకోని పరిణామం చోటుచేసుకుంది. ఇదో ఆసక్తికర కలయికనే అనుకోవచ్చు. టాలీవుడ్ లో ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ వర్గానికి మెగా ఫ్యామిలీ, జనసేనాని పవన్ సపోర్టుగా నిలిచారు. ప్రత్యర్థి మంచు విష్ణు వర్గం ఈ ఎన్నికల్లో గెలిచింది. ఈ క్రమంలోనే మాటల యుద్ధం సాగింది. పవన్ సైతం ‘రిపబ్లిక్’ వేడుకలో మోహన్ బాబును ప్రశ్నించాడు. పవన్ కు గట్టి కౌంటర్ ఇస్తానన్న మోహన్ బాబు  దాటవేశాడు. ఇప్పుడు ‘మా’ చుట్టూ వివాదాలు ముసురుకున్నాయి. ఎన్నికల వేళ పోలింగ్ బూత్ లో మోహన్ బాబు, నరేశ్ లు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వేడిని చల్లార్చేందుకు మంచు ఫ్యామిలీ నడుం బిగించినట్టుగా తెలుస్తోంది.

ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల వేళ వైరి వర్గం మంచు విష్ణు వర్గం నుంచి ఆయన తమ్ముడు మంచు మనోజ్ తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో గురువారం సాయంత్రం గంట పాటు భేటి కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

భీమ్లా నాయక్ షూటింగ్ స్పాట్ కు వెళ్లిన మంచు మనోజ్… పవన్ కళ్యాణ్ తో గంట పాటు కీలక అంశాలపై చర్చించినట్టు తెలిసింది. స్వతహాగానే పవన్ అంటే మనోజ్ కు చాలా అభిమానం. మనోజ్ పట్ల పవన్ స్నేహపూర్వకంగా ఉంటారు. వీరిద్దరూ గంటపాటు చర్చించుకోవడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల రిపబ్లిక్ వేడుకలో మోహన్ బాబుపై పవన్ కళ్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ సమస్యలపై మోహన్ బాబు ఎందుకు తన బంధువైన జగన్ ను ప్రశ్నించడం లేదంటూ పవన్ నిలదీశాడు. ‘మా’ ఎన్నికల తర్వాత స్పందిస్తానన్న మోహన్ బాబు ఇప్పటిదాకా దీనిపై సమాధానం ఇవ్వలేదు.

ఇక ఎన్నికల వేళ ఓటు వేయడానికి వచ్చిన పవన్ ను మోహన్ బాబు ఆప్యాయంగా పలకరించి ఇద్దరూ చాలా సేపు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.

మా ఎన్నికలతో ఇప్పుడు మెగా ఫ్యామిలీకి, ఇరు మోహన్ బాబు ఫ్యామిలీకి దూరం పెరిగింది. ఈ క్రమంలోనే ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించేందుకు తండ్రి మోహన్ బాబు తరుఫున మనోజ్ రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. పవన్-మనోజ్ భేటి అందుకేనంటున్నారు. మోహన్ బాబు సైలెంట్ గా ఉండడం వెనుక కూడా మనోజ్ ఉన్నాడని.. వివాదాలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడని టాక్. అందుకే తమను విమర్శించిన పవన్ వద్దకు వచ్చి ఈ వివాదాన్ని చల్లార్చే పనులు మనోజ్ చేపట్టాడని తెలుస్తోంది.

Exit mobile version