Telangana Congress CM: కాంగ్రెస్‌ ‘దళిత’కార్డ్‌ : తెలంగాణ సీఎంగా ‘భట్టి’!?

తెలంగాణ ప్రకటన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు ఉద్యమ సారథిగా ఉన్న టీఆర్‌ఎస్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రకటించారు.

Written By: Raj Shekar, Updated On : November 27, 2023 1:04 pm
Follow us on

Telangana Congress CM: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజేలే సమయం ఉంది. ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఈ క్రమంలో గెలుపుపై అన్ని పార్టీలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు, కాంగ్రెస్, బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలోనే తిష్టవేసి జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సోషల్‌ మీడియాలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గురించి ఓ పోస్టు వైరల్‌ అవుతోంది. ఇప్పుడిదే కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

కేసీఆర్‌ తప్పాడు.. కాంగ్రెస్‌ నిలబెట్టుకుంటుంది..?
తెలంగాణ ప్రకటన తర్వాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాడు ఉద్యమ సారథిగా ఉన్న టీఆర్‌ఎస్‌(ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) అధినేత కేసీఆర్‌.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా దళితుడిని చేస్తానని ప్రకటించారు. ఈమేరకు ఎన్నికల ప్రచారం కూడా చేశారు. ఇంకా అప్పట్లో కేసీఆర్‌ ఒక మాట తరచూ చెబుతుండేవారు. ‘కేసీఆర్‌ మాట ఇస్తే తప్పడు.. తప్పాల్సి వస్తే తల నరుక్కుంటాడు’ అని ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించేవారు. తెలంగాణకు తాను కాపలా కుక్కలా ఉంటానని కూడా ప్రకటించారు. కానీ ఎన్నికల తర్వాత అధికారపై ఆశలో దళిత సీఎం హామీని పక్కన పెట్టారు. తానే సీఎం పీటం ఎక్కి కూర్చున్నారు. అంతటితో ఆగకుండా తన కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌రావును మంత్రులను చేశారు. బిడ్డ కవితను ఎంపీగా గెలిపించారు. 2018లో అయినా మాట నిలబెట్టుకుంటారని అందరూ ఆశించారు. కానీ కేసీఆర్‌ మళ్లీ తానే సీఎం పీటం అధిష్టించారు. పైగా అహంకార పూరితంగా తనను సీఎంగా ప్రజలు ఒప్పుకున్నారు. లేకుంటే 2018లో ఓడించేవారని కేసీఆర్, కేటీఆర్‌ మాట్లాడారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దళిత సీఎం హామీ ఊసే ఎత్తడం లేదు కేసీఆర్‌. ఈ క్రమంలో కేసీఆర్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్కను సీఎం చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది

సోనియా మనసులో..
తెలంగాణ ఇచ్చిన పార్టీ క్రెడిట్‌ ఎవరు అవునన్నా.. కాదన్నా కాంగ్రెస్‌దే. ఈసారి అదే నినాదంతో హస్తం పార్టీ మరోమారు ఎన్నికలను ఎదుర్కొంటోంది. వరుస పరాభవాల తర్వాత అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు తొలి సీఎం దళితుడిని చేస్తానని మాట తప్పిన కేసీఆర్‌ హామీని కాంగ్రెస్‌ ఈసారి నిజం చేయాలని భావిస్తోంది. ఈసారి అధికారంలోకి వస్తే దళితుడు అయిన ‘భట్టి’ని సీఎం చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం ఆలోచిస్తోంది. రాజకీయంగా అనుభవం ఉన్న విక్రమార్క సోనియాగాంధీ కుటుంబానికి విధేయుడు. వైఎస్సార్‌ తర్వాత అంత సాన్నిహిత్యం భట్టికి ఉందంటారు. మరోవైపు దళితుడిని సీఎం చేయడం ద్వారా భారతదేశమంతా మంచి సందేశం ఇవ్వొచ్చని, ఇది వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు ఇస్తుందని అధిష్టానం భావిస్తోంది.

సౌమ్యుడు, వివాద రహితుడు..
ఇదిలా ఉంటే.. మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్‌లో సౌమ్యుడిగా గుర్తింపు ఉంది. వివాద రహితుడిగా అందరూ భావిస్తారు. అధిష్టానంతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది. అందరినీ కలుపుకుపోతాడు. ఈ నేపథ్యంలో భట్టి సీఎం అయితే ఎవరికీ అభ్యంతరం ఉండదని, అందరూ ఆమోదిస్తారని కాంగ్రెస్‌ అధిష్టానం భావిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌ 3న ఎన్నికల ఫలితాలు కాగ్రెస్‌కు అనుకూలంగా వస్తే భట్టి సీఎం కావడం ఖాయమని హస్తం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.