IPL 2023 Senior Players: ఐపీఎల్ 2023 : వయసులోనే కాదు.. ఆటలోనూ ‘పెద్దోళ్లే’
ఇండియన్ క్రికెట్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన క్రికెటర్ లో అమిత్ మిశ్రా ఒకడు. తాజా ఐపీఎల్ లోను అదరగొడుతున్నాడు ఈ వెటరన్ స్పిన్నర్.

IPL 2023 Senior Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో యంగ్ ప్లేయర్స్ కు తాము ఎందులోనూ తీసిపోము అన్నట్టుగా అదరగొడుతున్నారు సీనియర్ క్రికెటర్లు. బ్యాటింగ్ విభాగంలో దూకుడు.. బౌలింగ్ విభాగంలో అద్భుతమైన ప్రతిభతో అదరగొడుతున్నారు పలువురు సీనియర్ క్రికెటర్లు. యువ ఆటగాళ్లకు తామేం తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు కొందరు సీనియర్ ప్లేయర్లు. ఈ ఐపీఎల్ లో అలా అదరగొడుతున్న సీనియర్ క్రికెటర్ల జాబితా పెద్దదిగానే ఉంది.
క్రికెట్ లో అనుభవంతోపాటు అందుకు అనుగుణమైన సామర్థ్యం ఉండాలి. అనుభవం ఒక్కటే సరిపోదు.. ఎక్కడ, ఎప్పుడు దాన్ని బయటికి తీయాలో తెలియడమే సీనియారిటీ అంటే. అదే పని చేస్తున్నారు ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న పలువురు క్రికెటర్లు. ఈ సీజన్ లో అదరగొడుతున్న సీనియర్ క్రికెటర్లలో ఎంతోమంది గతంలో ఇండియాకు ఆడి సత్తా చాటారు. వయసు పెరగడం, ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్ళ నుంచి పోటీ ఎక్కువ కావడంతో జాతీయ జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి వారికి ఏర్పడింది. అయినప్పటికీ ఐపీఎల్ లో కుర్రాళ్ళతో పోటీపడి మరి అదరగొడుతున్నారు. ఆ క్రికెటర్లు ఎవరో ఓ లుక్కేసేయండి.
చెలరేగిపోతున్న అజంక్యా రహానే..
ఈ సీజన్ లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ చెలరేగిపోతున్నాడు సీనియర్ బ్యాటర్ రహానే. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున తొమ్మిది మ్యాచ్ లు ఆడిన రహానే 181.48 స్ట్రైక్ రేటుతో 245 పరుగులు చేశాడు. చెన్నై జట్టు నుంచి అత్యధిక పరుగులు చేసిన జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. స్ట్రైక్ రేట్ లో మాత్రం అతడే టాప్ లో కొనసాగుతున్నాడు. ఆటను ఎంజాయ్ చేయడం వల్లే ఇలా ఆడుతున్నట్టు ఒకానొక సందర్భంలో రహానే చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రహానేకు పిలుపు రావడం విశేషం. డబ్ల్యూటీసి ఫైనల్ ఆడే జట్టులో సభ్యుడిగా అవకాశాన్ని కల్పించింది బీసీసీఐ. అసలు ఐపిఎల్ లో రహానేను కొనుగోలు చేసేందుకు యాజమాన్యాలు ముందుకు రాలేదు. చెన్నై జట్టు మాత్రం రూ.50 లక్షల కనీసపు ధరకు రహానేను కొనుగోలు చేసింది. ధోనీ రహానే లోని ప్రతిభను గుర్తించి అవకాశాలు కల్పించడంతో చిచ్చరపిడుగులా రెచ్చిపోతూ తన సత్తాను చాటుతున్నాడు.
భారీ హిట్టింగ్ తో అదరగొడుతున్న వృద్ధిమాన్ సాహా..
ఈ ఏడాది ఐపీఎల్ లో వృద్దిమాన్ సాహా అదరగొడుతున్నాడు. గడిచిన రెండేళ్లుగా జాతీయ జట్టులోకి అప్పుడప్పుడు వస్తున్నా.. అవకాశం మాత్రం దక్కడం లేదు. కానీ, గత సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్ కు ఆడుతున్న సీనియర్ వికెట్ కీపర్ సాహా.. పవర్ ప్లేలో భారీ హిట్టింగ్ తో రెచ్చిపోతున్నాడు. గతేడాది గుజరాత్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన సాహా.. ఈసారి కూడా 11 మ్యాచ్ ల్లో 273 పరుగులు చేశాడు. వికెట్ల వెనుక కూడా చురుగ్గా కుదిరితే కుర్రాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో లెగ్ సైడ్ వెళ్తున్న బంతిని పట్టుకున్న తీరు అమోఘం అని చెప్పాలి.
బ్యాటర్లను ముప్పు తిప్పులు పెడుతున్న పియూష్ చావ్లా..
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పీయూష్ చావ్లా. పది మ్యాచ్ ల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులోనూ నిలిచాడు. ముంబై బౌలర్ల యావరేజ్ 16.47 లో చావ్లాదే తక్కువ. టీమిండియా తరఫున చివరిసారిగా 2012లో ఆడిన చావ్లా.. ఆ తరువాత లీగ్ లకే పరిమితం కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 ఆటగాళ్లలో చోటు సంపాదించుకున్నాడు చావ్లా. ఇప్పటి వరకు 175 మ్యాచ్ లు ఆడిన చావ్లా.. 174 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల చావ్లాకు అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అనిల్ కుంబ్లే తరహాలో లెగ్ స్పిన్ బౌలింగ్ తో జట్టుకు కీలకంగా మారతాడని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది.
స్పీడ్ గన్ ఇషాంత్ శర్మ..
యువ ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి వస్తుండడంతో ఇషాంత్ శర్మకు అవకాశాలు తగ్గిపోయాయి. చివరిసారిగా భారత జట్టు తరుపున 2021 లో డబ్ల్యూటీసి ఫైనల్లో ఇషాంత్ శర్మ ఆడాడు. ఈసారి ఐపీఎల్ లో ఆరంభంలో ఇషాంత్ కు అవకాశాలు రాలేదు. అయితే, వచ్చిన అవకాశాలను మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో ఆరు వికెట్లు తీసి అదరగొట్టాడు. గుజరాత్ పై రెండు వికెట్లు తీసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్ లో 12 పరుగులు అవసరం కాగా.. రాహుల్ తివాటియా, హార్దిక్ పాండ్యా వంటి హిట్టర్లు ఉన్నా కేవలం 6 పరుగులే ఇచ్చాడు. తరువాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లోను వికెట్లు తీయకపోయినా పరుగులు నియంత్రించి అదరగొట్టాడు.
40 ఏళ్ల వయసులోనూ రాణిస్తున్న అమిత్ మిశ్రా..
ఇండియన్ క్రికెట్ లో ఒకప్పుడు వెలుగు వెలిగిన క్రికెటర్ లో అమిత్ మిశ్రా ఒకడు. తాజా ఐపీఎల్ లోను అదరగొడుతున్నాడు ఈ వెటరన్ స్పిన్నర్. 40 ఏళ్ల వయసులో అమిత్ మిశ్రా ఇప్పటికీ తన వైవిధ్య భరిత స్పిన్ తో ముప్పు తిప్పలు పెడుతున్నాడు. రవి భిష్ణోయ్, కృనాల్ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్ వంటి స్పిన్నర్లు ఉన్న అమిత్ మిశ్రాకు అవకాశాలు దక్కడం మాత్రం అతడి సత్తా ఏంటో తెలియజేస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టుకుంటూ కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నాడు. ఈ సీజన్లో ఆడిన ఆరు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశాడు.
రెచ్చిపోతున్న మోహిత్ శర్మ..
ఎక్కడ కోల్పోయాడో.. అక్కడే రాబట్టుకుంటున్నాడు 34 ఏళ్ల మోహిత్ శర్మ. అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ ను 2014లో సొంతం చేసుకున్న మోహిత్ శర్మ ఆ తర్వాత కెరీర్ లో నిలదొక్కుకోవడానికి చాలా శ్రమించాడు. గాయాలు, ఫామ్ లేమితో ఇబ్బంది పడిన మోహిత్ 2017 నుంచి 2020 వ సీజన్ వరకు పలు ఫ్రాంచైజీలు మారాడు. అయినా , ఆయా జట్ల తరఫున ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే, గత రెండు సీజన్లలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. దీంతో హర్యానా తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడమని గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిష్ నెహ్రా సూచించడంతో అటువైపు వెళ్ళాడు. గతేడాది మోహిత్ ని తీసుకున్న గుజరాత్ అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం తనకు వచ్చిన అవకాశాలను రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లో రాణిస్తూ ఎనిమిది మ్యాచ్ ల్లో 12 వికెట్లు తీసి అనిపిస్తున్నాడు.
డాషింగ్ ఓపెనింగ్ తో రాణిస్తున్న ధావన్..
37 ఏళ్ల వయసులోనూ శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికీ డాషింగ్ ఓపెనింగ్ చేస్తూ భారీగా పరుగులు రాబడుతున్నాడు. వన్డే జట్టులో గతంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ రోహిత్ తో ఓపెనర్లుగా సుబ్ మన్ గిల్, ఇషాన్ కిషన్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో అప్పటి నుంచి బీసీసీఐ కాస్త పక్కన పెట్టేసింది. ఈ క్రమంలోనే వచ్చిన ఐపీఎల్ సీజన్ లో పంజాబ్ కు సారధిగా వ్యవహరిస్తూ అదిరిపోయే ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు ధావన్. ఇప్పుడా జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా ధావనే కావడం విశేషం. ఏడు మ్యాచ్ ల్లో 292 పరుగులు చేసిన ధావన్ 148 స్ట్రైక్ రేట్ కలిగి ఉన్నాడు. హైదరాబాద్ పై ఒక వైపు వికెట్లు పడుతున్నా చివరి వరకు క్రీజులో నిలబడి 99 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ లో ధావన్ కు చోటు కల్పించడంపై మేనేజ్మెంట్ కు తన ఫామ్ తో సవాల్ విసురుతున్నాడు.
