Site icon OkTelugu

Zoho Founder Sridhar Vembu: అమెరికా వద్దు.. ఇండియాకు వచ్చేయండి.. జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ ఎందుకీ మాట అన్నారంటే..

Zoho Founder Sridhar Vembu

Zoho Founder Sridhar Vembu

Zoho Founder Sridhar Vembu: అమెరికాలో గ్రీన్ కార్డు కోసం తాత్కాలిక వలసదారులు దరఖాస్తులు చేసుకుంటారు. కొంతకాలంగా అమెరికా లో స్థిరనివాసం ఉండేందుకు వలసదారులు విపరీతమైన పోటీపడుతున్నారు. అమెరికాలో శాశ్వత నివాస హక్కు కోసం పోటీ కూడా అదే స్థాయిలో ఉంటోంది. గతంలో దరఖాస్తులు సమర్పించడానికి వలసదారులు సొంత దేశానికి వెళ్లే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అక్కడ చట్టాలు మొత్తం పూర్తిగా మార్చేశారు.

అమెరికాలో శాశ్వత నివాస హక్కును కోరే తాత్కాలిక వలసదారుల విషయంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శాశ్వత నివాస హక్కును కోరుకునేవారు ఇకపై తమ దరఖాస్తులను సమర్పించేందుకు సొంత దేశానికి వెళ్లాలి.. దీనిపై అనేక రకాలుగా విమర్శలు వినిపిస్తున్నాయి.. లింక్డ్ ఇన్ సహా వ్యవస్థాపకుడు రెడ్ హామన్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఉద్యోగులు.. పరిశోధకులు.. వైద్యులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్లిపోతే అమెరికా పరిస్థితి ఏంటని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అమెరికా ప్రగతిని పూర్తిగా దెబ్బతిస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో గూగుల్ ఏఐ నాయకత్వంలో కీలక వ్యక్తిగా పనిచేసిన అండ్రు ఎంగ్ ట్రంపు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో పోటీ తత్వం తగ్గిపోతుందని.. శాస్త్రవేత్తలు.. వైద్యులు.. ఉపాధ్యాయులు వారి సొంత దేశాలకు వెళ్తే.. అమెరికా పరిస్థితి దారుణంగా మారుతుందని పేర్కొన్నారు.

అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డ్ వ్యవహారంలో తీసుకున్న నిర్ణయం పట్ల జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు స్పందించారు. “గ్రీన్ కార్డు ప్రక్రియలో అమెరికా అనేక రకాల షరతులు విధించింది. ఏకంగా సొంత దేశాలకు వెళ్ళిపోయి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇప్పటికైనా ఆలోచించాలి. సొంత దేశానికి రావాలి. ఈ నిర్ణయం కాస్త కఠినంగా ఉన్నప్పటికీ తప్పదు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొన్ని నిర్ణయాలు కష్టంగా ఉన్నప్పటికీ తప్పదు. ఈ సమయంలో మనం భారతదేశానికి తిరిగి వచ్చి.. ఇక్కడి ప్రజల ప్రయోజనాల కోసం పనిచేయాలి. ఈ దేశానికి మన ప్రతిభ చాలా అవసరమని” శ్రీధర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా ఆయన ఇదే స్థాయిలో ప్రకటన చేశారు. భారతదేశానికి సేవ చేస్తేనే నిజమైన భారతీయులం అనిపించుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు.

Exit mobile version