Homeకరోనా వైరస్జెట్‌ స్పీడ్‌లో కరోనా.. ఒక్కరోజులోనే 93 వేలకు పైగా కేసులు

జెట్‌ స్పీడ్‌లో కరోనా.. ఒక్కరోజులోనే 93 వేలకు పైగా కేసులు

Corona Cases In India
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ మళ్లీ భయపెడుతోంది. పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజురోజుకూ కరోనా జెట్ స్పీడ్‌తో పరుగులు పెడుతోంది. కరోనా బారిన పడి అనేక రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. రోజు గడిచే సరికి వేలల్లో కొత్త కేసులు పుట్టుకొస్తున్నాయి. కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచార కార్యక్రమాలు, పోలింగ్ ప్రక్రియ కరోనా కేసుల పెరుగుదల కారణమవుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్తగా లక్షకు చేరువగా కరోనా కేసులు నమోదు కావడం తీవ్రతకు అద్దం పడుతోంది.

దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 93,249 కరోనా కేసులు నమోదయ్యాయి. 513 మంది మరణించారు. రోజువారి కరోనా కేసుల పెరుగుదల వరుసగా మూడోరోజు కూడా కొనసాగుతోంది. రెండురోజులుగా 80 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతూ వచ్చాయి. తాజాగా.. ఆ సంఖ్య 90 వేల మార్క్‌ను దాటింది. ఇదే తీవ్రత మున్ముందు కొనసాగితే.. లక్షకు చేరువ కావడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైన సుదీర్ఘ కాలం తరువాత 90 వేలను దాటాయి రోజువారీ కొత్త కేసులు.

ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,24,85,509కి చేరుకుంది. ఇందులో 1,16,29,289 మంది డిశ్చార్జ్ కాగా.. 1,64,623 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,91,597కు చేరింది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఇప్పటిదాకా 7,59,79,651 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కరోనా కొత్త కేసుల్లో మహారాష్ట్ర వాటా అధికంగా ఉంటోంది. సగం కేసులు అక్కడే నమోదవుతున్నాయి.

మరోవైపు.. మహారాష్ట్రలో వైరస్‌ మరింత భయపెడుతోంది. శనివారం నాటి బులెటిన్‌ ప్రకారం.. మహారాష్ట్రలో ఒక్కరోజు వ్యవధిలో 49 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే పరిస్థితి కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో నెలకొని ఉంది. ఆయా రాష్ట్రాల్లో కరోనా ప్రొటోకాల్స్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. అనేక నగరాల్లో రాత్రివేళ కర్ఫ్యూ కొనసాగుతోంది. వారాంతపు రోజుల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు. అయినప్పటికీ- కరోనా వైరస్ వ్యాప్తికి మాత్రం ఎక్కడా అడ్డుకట్ట పడడం లేదు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Exit mobile version