M. M. Keeravani: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశామని విద్యార్థుల హృదయాలను ద్రవింప జేసినా.. రాలిపోయే పూవుకి… వాలిపోయే పొద్దుకి కూడా రాగాలద్ది హృదయాలను మీటిన స్వర మాత్రికుడు ఎంఎం.కీరణవాణి. తెలుసా మనసా… అంటూ జన్మంతా పాడుకునేంతగా పాటకీ, శ్రోతకీ మధ్య అనుబంధాన్ని పెనవేసిన ఘనుడు. ఝుం ఝుం మాయ… అంటూ.. కాలేజి పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్సు అంటూ అల్లరి చేసిన బాణీ ఆయనదే… ‘అంతా రామమయం…’ అంటూ సాగే భక్తి పాటలోనూ ఆయన కనిపిస్తాడు. అన్నమయ్య కీర్తనలనూ భక్తితో పాడుకులేలా మలుస్తాడు.. చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాననీ… అంటూ అప్పుడప్పుడూ కీరవాణి స్వరం ధైర్యం కూడా చెబుతుంటుంది. భాస ఏదైనా ఆయన బాణీ మాత్రం ప్రత్యేకం. దశాబ్దాలుగా భారతీయ శ్రోతల్ని తన సంగీతంతో ఉర్రూతలూగిస్తున్నారు కీరవాణి. అందుకే ఆయనను ‘పద్మం’ కీరవాణి రాగంలోనే పిలిచి వరించింది. ‘అందనంత ఎత్తా తారాతీరం సంగతేంటో చూద్దాం రా’ అంటూ బయల్దేరిన కీరవాణి… ‘నాటు నాటు’ పాటతో విశ్వాన్నంతా ఊపేసి అత్యున్నత ఆస్కార్ స్థాయిలో కనిపిస్తున్నారు. అదీ ప్రయాణం అంటే!.. ఒక్క మాటలో చెప్పాలంటే తెరవెనక ఉండే బాహుబలి ఆయన. జక్కన్న రాజమౌళి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో అంతెత్తున నిలబెట్టడం వెనక… ఓ మూలస్తంభంలాంటి పాత్ర పోషించిన స్వరధీరుడు కీరవాణి. ఆర్కెస్ట్రా ట్రూప్ నుంచి అగ్ర సంగీత దర్శకుడి వరకు ఆయన ప్రయాణం సదా స్ఫూర్తిదాయకం.

M. M. Keeravani
-భాష ఏదైనా.. కీరవాణి సంగీంత మాధుర్యమే..
తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కీరవాణి సుపరిచితులు. 1990లో ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించిన ‘మనసు మమత’ సంగీత దర్శకుడిగా ఆయనకి తొలి చిత్రం. ‘మధుమాసం… కుహూగానం’ పాటతో ఆయన స్వర ప్రయాణం మొదలైంది. ‘సీతారామయ్యగారి మనవరాలు’, ‘క్షణ క్షణం’ చిత్రాల నుంచి ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు కీరవాణి. సంగీత ప్రపంచంలోనూ ఆయన ఓ రైతులానే రేయింబవళ్లు శ్రమించి ఎదిగారు. దాదాపు 250 సినిమాలకి పనిచేశారు. తండ్రి శివశక్తి దత్త సంగీత, సాహిత్యాభిరుచి… తల్లి భానుమతి వీణా వాయిద్య ప్రతిభ, వారి ప్రోత్సాహమే తాను సంగీతంవైపు అడుగులేసేందుకు కారణమైందని చెబుతారు కీరవాణి. కె.బాలచందర్ సినిమా అళగన్ సినిమాతో తమిళంలోకి అడుగుపెట్టిన ఆయన అక్కడ తొలి చిత్రంతోనే సత్తా చాటారు.
-‘రా’ సెంటిమెంట్
చిత్రసీమలో సెంటిమెంట్లు ఎక్కువ. అలా కీరవాణికి కూడా ‘రా’ సెంటిమెంట్ పనిచేసిందేమో అంటుంటారు కీరవాణి. నిర్మాత రామోజీరావు తొలి అవకాశం ఇవ్వడంతోపాటు, ఆయన పనితీరు మెచ్చి ఉషాకిరణ్ సంస్థలో రూపొందే చిత్రాలన్నింటికీ మీరే పనిచేయాలని ప్రోత్సహించారు. ఇలా రామోజీరావులోని ‘రా’ అక్షరంతో సినీప్రస్తానం ప్రారంభించారు. ఆ తర్వాత ‘రా’మ్గోపాల్వర్మ చిత్రం ‘క్షణ క్షణం’ అవకాశంతో కీరవాణి కెరీర్ మరింతగా పుంజుకుంది. మూడోసారి దర్శకులు ‘రా’ఘవేంద్రరావుతో ఆయన కెరీర్ మరో మలుపు తీసుకుంది. ఆయనతో 28 సినిమాలు చేశారు. ఈ కాంబినేషన్ విజయవంతమైన కలయిక అయ్యింది. ‘స్టూడెంట్ నెంబర్ 1’ నుంచి ‘రా’జమౌళితో ప్రయాణం కొనసాగుతోంది.
-90వ దశకం కీరవాణిదే..
ఎంతో మంది సంగీత దర్శకులు ఉన్నా.. 1990వ దశకంలో కీరవాణి హవా సాగింది. అగ్ర దర్శకులు కె.విశ్వనాథ్, బాపుతోపాటు, కోదండరామిరెడ్డి, ముత్యాల సుబ్బయ్య, రవిరాజా పినిశెట్టి తదితర దర్శకుల సినిమాలకీ స్వరాలు సమకూర్చారు. ‘అల్లరి మొగుడు’తో మొదలైన కె.రాఘవేంద్రరావు – కీరవాణి కలయిక ‘ఘరానా మొగుడు’, ‘సుందరకాండ’, ‘అల్లరి ప్రియుడు’, ‘మేజర్ చంద్రకాంత్’, ‘పెళ్లిసందడి’, ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘గంగోత్రి’, ‘శిరిడిసాయి’… ఇలా విజయవంతంగా సాగింది. ‘స్టూడెంట్ నెంబర్ 1’ మొదలుకొని ‘ఆర్ఆర్ఆర్’ వరకూ తన తమ్ముడు ఎస్ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించే ప్రతి సినిమాకీ కీరవాణే సంగీత దర్శకుడు. వీళ్లిద్దరి ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది.
-ఆల్రౌండర్
కీరవాణిలో సంగీత దర్శకుడే కాదు… ఆయనలో గాయకుడు, చేయి తిరిగిన గీత రచయిత కూడా ఉన్నారు. ‘విక్రమార్కుడు’లో రాత్రయినా పడుకోలేదు…’, ‘వేదం’లో ‘ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్’, ‘మగధీర’లో నాకోసం నువ్వు జుట్టు పీక్కుంటే.. బాగుంది, ‘ఈగ’లో నేనే నానినే…, ‘శిరిడిసాయి’లో మానవ సేవే మాధవ సేవని..’ ఇలా ఎన్నో పాటల్ని కీరవాణి స్వయంగా రచించారు. గాయకుడిగా కూడా ఆయనది ప్రత్యేకమైన ముద్రే. ‘నేనున్నాను’ సినిమాలో చీకటితో వెలుగే చెప్పెను…, ‘వేదం’లో ఎగిరిపోతే ఎంత బాగుంటుంది… , ‘అన్నమయ్య’లో గోవిందాశ్రిత, ‘శ్రీరామదాసు’లో కలలో నీ నామ స్మరణ…, పల్లకిలో పెళ్లికూతురు’ సినిమాలో చీరలోని గొప్పతనం తెలుసుకో.. తదితర గీతాల్ని కీరవాణి ఆలపించి ఆల్రౌండర్ అని నిరూపించారు. ‘ఛత్రపతి’లో అగ్నిస్ఖలన సందగ్ధరిపు వర్గ ప్రళయ రథ ఛత్రపతి… అంటూ పూర్తిగా సంస్కృతంలో సాగే పాటని కీరవాణి పాడిన విధానం అలరించింది.

M. M. Keeravani
-దాసోహం అంటున్న పురస్కారాలు..
తమిళంలో తొలి సినిమాకే ఆ రాష్ట్ర ప్రభుత్వ పురస్కారాన్ని అందుకున్న కీరవాణి… ‘అన్నమయ్య’ సినిమాకి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎనిమిదిసార్లు, నేపథ్య గాయకుడిగా మూడుసార్లు నంది పురస్కారాల్ని అందుకున్నారు. ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీరవాణి పేరు మార్మోగిపోతుంది. ఆ చిత్రంలో నాటు నాటు.. పాటకిగానూ గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్ని అందుకున్నారు. ఆస్కార్ అవార్డుల కోసం నామినేషన్ని కూడా దక్కించుకుని చరిత్ర సృష్టించింది.