Modi vs Kcr: తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు, ప్రధాని నరేద్రమోదీ దర్యాప్తు సంస్థలతో సాగిస్తున్న ఆధిపత్య పోరులో కేసీఆర్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం(సిట్) తెలిపోతోంది. అదే సమయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ, ఐటీ దూకుడు పెంచుతున్నాయి. కోర్టులోనూ సిట్కు ఎదురుదెబ్బలు తగులుతుండం ఆ పార్టీ నేతలను ఆందోళనకు గురిచేస్తోంది. మోదీతో ఎందుకు పెట్టుకున్నామా అన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్ను టార్గెట్ చేసుకుని మోదీ చేస్తున్న దాడి రోజురోజుకూ పెరుగుతోంది. దీని ప్రభావం ఇప్పుడు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లోని అదికార వైసీపీపైనా కనిపిస్తోంది. టీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ కేంద్రం దర్యాప్తు సంస్ధల్ని ప్రయోగిస్తున్న తీరు ఇటు గులాబీ నేతలతోపాటు అటు వైసీపీ నేతలనూ చికాకు పోడుతోంది. లిక్కర్ స్కాంతో మొదలైన మోదీ దాడి.. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వరకూ వచ్చేసింది. దీంతో హైదరాబాద్ కేంద్రంగా ఇన్నాళ్లూ సేఫ్గా వ్యాపారాలు చేసుకుంటున్న ఏపీ నేతలూ ఇరుకున పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Modi vs Kcr
ముదురుతున్న ఆధిపత్య పోరు..
తెలంగాణలో బీజేపీ వర్సెస్ కేసీఆర్ రాజకీయం అంతకంతకూ ముదురుతోంది. ఇప్పటికే ఇటు కేసీఆర్, అటు బీజేపీ వరుస ఎత్తులకు పైఎత్తులు వేసుకుంటూ రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఈ రాజకీయంలో భాగంగా మునుగోడు ఉపఎన్నికను జనంపైకి రుద్దిన బీజేపీ… అక్కడ టీఆర్ఎస్ గెలవడంతో పునరాలోచనలో పడింది. ఆ తర్వాత టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీకి సన్నిహితులైన స్వాములు సాగించిన బేరసారాల్ని పోలీసుల సాయంతో పట్టుకున్న టీఆర్ఎస్.. వారిని చట్టం ముందు దోషులుగా నిలబెట్టలేకపోయింది. ఇదే అదనుగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుమార్తె కవితతోపాటు ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న పలువురిని కేంద్రం దర్యాప్తు సంస్థల సాయంతో టార్గెట్ చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం చినికి చినికి గాలివానగా మారిపోయింది.
కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడు..
కేసీఆర్ను టార్గెట్ చేసే క్రమంలో టీఆర్ఎస్ నేతల చుట్టూ ఉన్నవారి ఆర్థిక మూలాల్ని దెబ్బకొట్టేందుకు కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇన్నాళ్లూ టీఆర్ఎస్కు ఆర్థ్ధికంగా అండదండలు అందించిన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మాఫియాతోపాటు ఢిల్లీ లిక్కర్ స్కాం సిండికేట్లను కేంద్రం కదిపింది. వీరిపై కేంద్ర దర్యాప్తు సంస్ధలైన సీబీఐ, ఈడీతోపాటు ఐటీని కూడా ప్రయోగిస్తోంది. ఆయా సంస్థల దాడులతో లిక్కర్ స్కాం, రియల్ ఎస్టేట్ అక్రమాలన్నీ బయటికి వస్తున్నాయి. ఇందులో టీఆర్ఎస్ నేతల పాత్ర బయటపడుతుండటంతో ఆ పార్టీ ఇరుకునపడుతోంది.
వైసీపీ నేతలు, సన్నిహితులపైనా ?
టీఆర్ఎస్ లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను ప్రయోగిస్తున్న కేంద్రం ఇప్పుడు వారితో కుమ్మక్కు కావడమో లేక లావాదేవీలు, సంబంధాలు నెరుపుతున్న వైసీపీ నేతల్ని సైతం వదిలిపెట్టడం లేదు. జగన్తో కేంద్రం సత్సంబంధాలు నెరుపుతున్నా.. ఆ పార్టీ నేతల విషయంలో మాత్రం రాజీపడటం లేదు. దీంతో లిక్కర్ స్కాంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి పేర్లు బయటికి వచ్చాయి. అలాగే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడైన శరత్ చంద్రారెడ్డి, ఆయన భార్య పేర్లు కూడా వచ్చాయి.. అలాగే మంగళవారం వంశీరామ్ బిల్డర్స్ పై ఐటీ దాడులు విజయవాడలోని వైసీపీ నేతలు దేవినేని అవినాష్, వల్లభనేని వంశీని కూడా చుట్టుకున్నాయి.దీంతో వైసీపీ నేతలు బెంబేలెత్తుతున్నారు.

Modi vs Kcr
సంకేతమిస్తున్న మోదీ..
తెలంగాణలో పట్టు కోసం ప్రయత్నిస్తున్న బీజేపీని అడ్డుకునేందుకు కేసీఆర్ ఎదురుదాడి మార్గం ఎంచుకోవడంతో ఇప్పుడు టీఆర్ఎస్ను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ నేతలు, వారి సన్నిహితులతో అంటకాగుతున్న వైసీపీ నేతల్నీ వదిలిపెట్టడం లేదు. దీంతో ప్రధాని మోదీ ఇస్తున్న సంకేతాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీకి వ్యతిరేకంగా వెళితే పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై కేసీఆర్తో పాటు జగన్కూ ముందస్తు హెచ్చరికలు పంపేందుకే ప్రధాని మోదీ ఎవరినీ లెక్కచేయకుండా ఈ దాడులు చేయిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఏపీలో పరిస్థితులు మారిపోయి వైసీపీ సైతం బీజేపీకి వ్యతిరేకంగా మారితే ఏం జరుగుతుందనే దానికి ట్రైలర్గా మోదీ తెలంగాణను ఏపీ అధికార పార్టీకి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.