Jeevan Reddy resignation : కాంగ్రెస్ పార్టీకి జగిత్యాల మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రాజీనామా చేశారు. కొంతకాలంగా పార్టీ నాయకత్వంపై ఆయన ఆగ్రహం గా ఉన్నారు. తన విషయంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. సంజయ్ చేరిక తర్వాత జీవన్ రెడ్డి లో ఆగ్రహం మరింత పెరిగిపోయింది. తనకు అంతగా ప్రాధాన్యం లభించడం లేదని.. తన అనుచరులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని.. తన ప్రధాన అనుచరుడిని కొంతమంది వ్యక్తులు హ*త్య చేశారని.. కేసు విషయంలో పోలీసులను కలిసినప్పటికీ న్యాయం జరగలేదని జీవన్ రెడ్డి చెబుతున్నారు.
జీవన్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన గులాబీ పార్టీలో చేరడం ఖాయం అయిపోయింది. మొన్న జగిత్యాల నగరంలో నిర్వహించిన రంజాన్ వేడుకలలో ఆయన గులాబీ పార్టీ నేతలతో కలిసి పాల్గొన్నారు. దీంతో తన తదుపరి రాజకీయ ప్రయాణం గులాబీ పార్టీ నుంచి అని ఆయన సంకేతాలు ఇచ్చారు. ఏప్రిల్ 5న ఆయన గులాబీ పార్టీలో చేరుతారని తెలుస్తోంది. జగిత్యాల నగరంలో భారీ సభ ఏర్పాటు చేసి.. జీవన్ రెడ్డి గులాబీ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. ఇటీవల జీవన్ రెడ్డితో మంత్రులు శ్రీధర్, లక్ష్మణ్, ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు. అనేక రకాలుగా బుజ్జగింపులు చేశారు. అయినప్పటికీ జీవన్ రెడ్డి దిగి రాలేదు. తన నిర్ణయం ఫైనల్ అని స్పష్టం చేశారు….
గులాబీ పార్టీలో జీవన్ రెడ్డి మాత్రమే కాకుండా, ఆయన అనుచరులు కూడా భారీగా చేయబోతున్నారని తెలుస్తోంది. అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరే విషయంపై ఒక ఆసక్తికరమైన చర్చను తెరపైకి తీసుకొచ్చారు. డిలిమిటేషన్ తర్వాత నియోజకవర్గాల పెంపు జరుగుతుందని.. అప్పుడు జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి పోటీ చేస్తారని చెబుతున్నారు. దాన్ని అంచనా వేసి జీవన్ రెడ్డి గులాబీ పార్టీలో చేరుతున్నారని సమాచారం. మరోవైపు జీవన్ రెడ్డికి గులాబీ పార్టీ మంచి పదవి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఆయనకు పార్టీ జనరల్ సెక్రెటరీ పదవి కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో జీవన్ రెడ్డి అనుచరులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వలేదు. దీంతో ఆయన తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దింపారు. వారి తరఫున ప్రచారం కూడా చేశారు. పోటాపోటీగా సాగిన ఎన్నికల్లో వారిని గెలిపించుకున్నారు. అయితే జగిత్యాల మున్సిపల్ పీఠాన్ని తన అనుచరులకు ఇవ్వాలని జీవన్ రెడ్డి కోరినప్పటికీ.. అధిష్టానం పట్టించుకోలేదు. దీంతో జీవన్ రెడ్డి నాటి నుంచి పార్టీ నాయకత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. అందువల్లే తిరుగుజెండా ఎగరవేశారు. ఇప్పుడు ఏకంగా పార్టీకి రాజీనామా చేసి.. గులాబీ కండువా కప్పుకోబోతున్నారు.