lpg price hike : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎన్నికలు ముగియగానే కేంద్రం పెట్రోల్, డీజిల్తోపాటు వంటగ్యాస్ ధరలు పెంచుతుందని ఎన్నికల ప్రచారంలో విపక్షాలు కోడై కూశాయి. గొంతెత్తి అరిచాయి. వీరి మాటలు ఓటర్లు ఏమేరకు నమ్మారో తెలియదు. ప్రస్తుతానికి ఓటరు తీర్పు ఈవీఎంలోలో భద్రంగా ఉంది. అవి ఓపెన్ చేస్తేనే నమ్మారో లేదో తెలుస్తుంది. అయితే విపక్షాలు చెప్పినట్లే కేంద్రం చేసింది. తాజాగా వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు రూ.993 పెంచింది. దీంతో ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.3071.50కు చేరింది. డొమెస్టిక్ సిలిండర్లు మార్కెట్ ధర మాత్రం పెంచలేదు.
ఎందుకు ఈ పెరుగుదల?
ప్రపంచ ఆయిల్ మార్కెట్ అస్థిరత, మధ్యప్రాచ్య సంఘర్షణలు, ఉత్పత్తి పరిమితులు, ఇంపోర్ట్ ఖర్చులు దరల పెంపునకు కారణంగా కేంద్రం చెబుతోంది. కానీ ప్రభుత్వం ట్యాక్స్లు, సబ్సిడీలు సరియైన సమయంలో సర్దుబాటు చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 30 శాతంపైగా ధర పెంచడం చిన్న వ్యాపారులను, హోటళ్లను, రెస్టారెంట్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆహార ధరలు పెరిగి దేశవ్యాప్త ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. గృహ సిలిండర్ ధర పెరగకపోయినా పరోక్షంగా ఈ భారం సామాన్యులపై పడుతుంది.
వ్యాపారులు, సామాన్యులపై ప్రభావం..
చిన్న బిజినెస్ యజమానులు ఎల్పీజీ ధర పెంపుతో తీవ్రంగా నష్టపోనున్నారు. లాభాలు గణనీయంగా తగ్గనున్నాయి. చాలా మంది ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. మహిళలు, తక్కువ ఆదాయ వర్గాలు ఇబ్బంది పడతాయి. రవాణా ధరలు పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్లు సబ్సిడీలతో కాపాడుతున్నా, వాణిజ్య రంగానికి ధరాఘాతం తప్పడం లేదు.
ఈ సమస్యకు తాత్కాలిక పరిష్కారాలు సరిపోవు. ప్రభుత్వం ట్యాక్స్ల పునర్విచారణ, సబ్సిడీ విస్తరణ, ఇంపోర్ట్ వైవిధ్యీకరణ చేయాలి. దీర్ఘకాలంలో బయోగ్యాస్, సోలార్ కుకింగ్, ఎలక్ట్రిక్ అప్లయన్స్లపై పెట్టుబడులు పెంచాలి. వ్యాపారులు ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీలు అవలంబించి ఖర్చులను అధీనంలోకి తీసుకోవాలి.