Allu Aravind viral comments : టాలీవుడ్ సీనియర్ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేఖలై ప్రధాన పాత్రల్లో నటించిన ‘దీవానా’ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, నేటి తరం ప్రేమ వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
హైదరాబాద్లోని ఏఏఏ సినిమాస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అరవింద్, ప్రస్తుత కాలంలో ప్రేమ ఎలా మారిందో తనదైన శైలిలో వివరించారు. “ఇప్పటి లవ్ అంటే ఖాళీగా ఉన్న థియేటర్లకు వెళ్లడం, కార్నర్ సీట్లలో కూర్చొని సినిమాలు చూడటం, తర్వాత షాపింగ్ మాల్స్ చుట్టూ తిరగడం, చివరికి ఓయో రూమ్లో ఎండ్ అవ్వడం” అంటూ చేసిన వ్యాఖ్యలు అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ఆయన చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అల్లు అరవింద్ వ్యాఖ్యల సందర్భంగా స్టేజ్పై ఉన్న హీరో విశ్వక్ సేన్ సరదాగా స్పందించారు. “అంటే ఏంటి సార్… నాకేమీ తెల్వదు” అంటూ అమాయకంగా ముఖం పెట్టి చెప్పడంతో సభలో నవ్వులు పూశాయి. విశ్వక్ సేన్ రియాక్షన్ కూడా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అవుతోంది.
ఇదే కార్యక్రమంలో యాంకర్ అడిగిన మరో ఆసక్తికరమైన ప్రశ్నకు అల్లు అరవింద్ తనదైన హాస్యంతో సమాధానం ఇచ్చారు. “మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా ప్యూర్ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా చూశారా?” అని ప్రశ్నించగా, “ఇప్పుడు ఆ పేరు చెబితే బాగోదు. వాళ్లకు ఇప్పుడు పెళ్లయి మనవలు, మనవరాళ్లు కూడా ఉన్నారు” అంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు.
అల్లు అరవింద్ చేసిన ఈ వ్యాఖ్యలు సరదాగా చెప్పినవే అయినప్పటికీ, నేటి యువత ప్రేమ వ్యవహారాలపై ఆయన చేసిన పరిశీలన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు ఆయన వ్యాఖ్యలను హాస్యంగా తీసుకుంటుండగా, మరికొందరు మాత్రం వాటిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్స్ నెట్టింట ట్రెండింగ్లో కొనసాగుతున్నాయి.

