KCR- Early Elections: తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన, అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా గుర్తింపు పొందిన మునుగోడును టీఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. పదివేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. ఈ గెలుపు టీఆర్ఎస్కు కొత్త జోష్ తెచ్చింది. సీఎం కేసీఆర్కు ఇది అత్యంత క్లిష్టమైన సమయంలో వచ్చిన విజయం ఇది. తెలంగాణలో ఎనిమిదేళ్లలో ఊహించనంత అభివృద్ధి సాధించినా.. రాజకీయ కారణాలతో వచ్చిన ప్రజా వ్యతిరేకతను అధిగమించడానికి కేసీఆర్ చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. తమ పార్టీని దెబ్బకొట్టడానికి వచ్చిన ఉపఎన్నికలో పోరాడి విజయం సాధించడంతో ఇప్పుడు గతంలో లేనంత పాజిటివ్ గులాబీ నేతల్లో కనిపిస్తోంది. తెలంగాణలో మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటున్న టీఆర్ఎస్కు మునుగోడు ఫలితం బూస్ట్ ఇచ్చినట్లయింది.

ముందస్తు ఊహాగానాలు..
మునుగోడును గెలిచిన టీఆర్ఎస్ బాస్.. ఇప్పుడే ముందస్తుకు వెళ్తే మంచిదన్న ఆలోచన చేస్తున్నారట. తెలంగాణలో ఏడాదిగా ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతోంది. కానీ కేసీఆర్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని చెబుతూ వస్తున్నారు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుతూ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ముందస్తు ఎన్నికల ముచ్చటే లేదని ప్రకటించారు. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. ఫామ్హౌస్ ఫైల్స్ బయటపెట్టిన తర్వాత కేసీఆర్ ఆలోచన మారిందని అంటున్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో గెలుపు రావడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన పాజిటివ్ వైబ్రేషన్స్ను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

బీజేపీని దెబ్బకొట్టాలని..
తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగిన బీజేపీని కార్నర్ చేయడానికి.. ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని అడ్డగోలుగా పడగొట్టడానికి బీజేపీ ప్రయత్నించిందని ఆధారాలు చూపించడం ద్వారా ఓ ఆయుధం కేసీఆర్ వద్ద ఉంది. ఇలాంటి ఆయుధం ఉంటే కేసీఆర్ ఎలా సెంటిమెంట్ పండించగలరో రాజకీయ ప్రత్యర్థులకు బాగా తెలుసు. అందుకే అంది వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉంది. ఇప్పుడు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నా.. మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాలపై పూర్తి స్థాయిలో దృష్టిపట్టాలని భావిస్తున్నారు గులాబీ బాస్. ఈ క్రమంలో తెలంగాణలో మూడో సారి గెలిస్తే.. ఆ ప్రభావం దేశం మొత్తం ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో హ్యాట్రిక్ కొడితే.. ఉత్తరాదిలో కూడా కీలకమైన నేతగా గుర్తింపు లభిస్తుందన్న ఆలోచనలో కేసీఆర్ ఉన్నారు. ఈ ఊహాగానాలు నిజమైతే ముందస్తుపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పొలిటికల్ టాక్. మరి గులాబీ బాస్ మనసులో ఏముందో చూడాలి.