Kohinoor Diamond: కోహినూర్ వజ్రం.. ప్రపంచంలో మేటి. భారతదేశంలో తెలుగు గడ్డపై లభించిన ఈ వజ్రం ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉంది. ఈ వజ్రం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్ని మార్లు ప్రయత్నించినా మన దేశానికి తిరిగి రాలేదు. ప్రపంచంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ కు ఉన్న విశిష్టత వేరు. నిజానికి ఈ వజ్రం తొలి రోజుల్లో 793 క్యారెట్లు ఉండేది. ప్రస్తుతం 105.6 క్యారట్లకు తగ్గిపోయింది.

ఐదువేల ఏళ్ళ క్రితం
1813 సంవత్సరంలో కోహినూర్ వజ్రం సిక్కు మహారాజు రంజిత్ సింగ్ దగ్గరికి చేరింది. ఈ వజ్రం మహా కాంతివంతంగా ఉండడంతో ఆయన దాన్ని కిరీటంలో ధరించారు. 1839లో ఆయన మరణం తర్వాత కుమారుడు దిలీప్ సింగ్ దగ్గరికి ఆ వజ్రం వెళ్ళింది. 1849లో బ్రిటన్ సేనలు అతడిని ఓడించాయి. అతడు ఆ వజ్రాన్ని ఇంగ్లాండ్ కి అప్పగించారు. అప్పటినుంచి కోహినూర్ వజ్రం బ్రిటన్ లోనే ఉంటుంది. వాస్తవానికి ఈ వజ్రం ఒకరికి ఒకరు కానుకగా ఇవ్వడం తప్ప.. అమ్మడమో, బలవంతంగా లాక్కోవడమో జరగలేదు. ఎవరు కొనుగోలు చేయలేదు కూడా. దీని ప్రకారం కోహినూరు వజ్రానికి ఎవరూ శాశ్వత యజమానులు లేరు.
చట్టాలు ఏమంటున్నాయంటే
ఈ వజ్రం కోసం భారత ప్రభుత్వం చాలాసార్లు బ్రిటన్ ప్రభుత్వాన్ని సంప్రదించినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఇదే అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఒకసారి విచారణ జరిపింది. ఈ విచారణలో కోహినూర్ వజ్రం తిరిగి తీసుకురావడం కష్టమని తేలింది. యాంటీక్విటీస్ అండ్ ఆర్ట్ ట్రెజర్ యాక్ట్, 1972 లోని నిబంధనల ప్రకారం దేశం నుంచి అక్రమంగా ఎక్కువ పురాతన వస్తువులను మాత్రమే తిరిగి పొందే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం కోహినూరు వజ్రాన్ని తిరిగి భారతదేశానికి తెప్పించే అవకాశం లేదు. కోహినూర్ వజ్రాన్ని తమకు ఇచ్చేయాలని ఇంగ్లాండ్ ప్రభుత్వాన్ని బలవంతం చేయలేమని సుప్రీం కోర్టుకు భారత ప్రభుత్వం తెలిపింది. ఎందుకంటే ఈ వజ్రం చోరీకి గురి కాలేదు. బ్రిటిష్ ప్రభుత్వానికి బహుమతిగా ఇచ్చామని వివరించింది. అయితే ఇదే సమయంలో కోహినూర్ వజ్రంతోపాటు అనేక ఇతర అరుదైన వస్తువులను, సంపదలను తిరిగి ఇచ్చేలా బ్రిటన్ హై కమిషనర్ ను ఆదేశించాలని కోరుతూ ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. అయితే దీనిపై వైఖరి స్పష్టం చేయాలని సుప్రీంకోర్టు నాటి చీఫ్ జస్టిస్ సి ఎస్ ఠాకూర్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఇది అసాధ్యమైన విషయంగా ప్రభుత్వం వెల్లడించింది.

కోహినూర్ ఇస్తే బ్రిటిష్ మ్యూజియం ఖాళీ
ఇంగ్లాండ్ రాణుల కిరీటంలో పొదగబడిన కోహినూర్ డైమండ్.. ఆ తర్వాత బ్రిటన్ మ్యూజియానికి తరలి వెళ్ళింది. పలుమార్లు భారత ప్రభుత్వం ఈ వజ్రాన్ని తమకు తిరిగి ఇవ్వాలని ఇంగ్లాండును కోరింది. అయితే ఆ దేశం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ 2010లో ఇంగ్లాండ్ ప్రధానిగా డేవిడ్ కామరూన్ ఉన్నప్పుడు కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చే విషయంపై స్పందించారు. ఒకవేళ భారతదేశానికి కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సి వస్తే.. ప్రపంచంలోనే చాలా దేశాలకు బ్రిటన్ చాలా తిరిగి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అప్పుడు బ్రిటిష్ మ్యూజియం మొత్తం ఖాళీ అయిపోతుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. కోహినూరు వెనుక ఇంత కథ ఉంది కాబట్టే మన దేశానికి అది తిరిగి రాలేకపోతోంది ప్రస్తుతం ఇంగ్లాండ్ రాణి ఎలిజిబెత్ కన్నుమూసిన నేపథ్యంలో మరోసారి కోహినూర్ వజ్రం తిరిగి తీసుకొచ్చే విషయం మీద చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అల్లుడు, భారత సంతతి వ్యక్తి రుషీ నోనాక్ అక్కడి ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో కోహినూర్ తిరిగి వస్తుందేమోనన్న ఆశలు భారతీయుల మదిలో మెదులుతున్నాయి.