బెంగాల్‌లో బీజేపీ హామీల వరద..! ఎంతవరకు నమ్ముతారు..?

బెంగాల్‌లో ఈసారి కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ ఎంతగానో కృషి చేస్తోంది. మరెంతో పట్టుదలతో ఉంది. అందుకే.. ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రుణమాఫీ కూడా ఉంది. రైతులకు రూ.18 వేల చొప్పున రుణమాఫీ చేస్తామని అందులో హామీ ఇచ్చారు. అదే కాదు.. ఇంటికో ఉద్యోగం అని ఆచరణ సాధ్యం కాని హామీ కూడా ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను హోంమంత్రి అమిత్ షా స్వయంగా విడుదల చేశారు. అందులో ఉన్న హామీలను […]

Written By: Srinivas, Updated On : March 22, 2021 2:15 pm
Follow us on


బెంగాల్‌లో ఈసారి కాషాయం జెండా ఎగురవేయాలని బీజేపీ ఎంతగానో కృషి చేస్తోంది. మరెంతో పట్టుదలతో ఉంది. అందుకే.. ప్రజాకర్షక మేనిఫెస్టోను ప్రకటించింది. అందులో తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న రుణమాఫీ కూడా ఉంది. రైతులకు రూ.18 వేల చొప్పున రుణమాఫీ చేస్తామని అందులో హామీ ఇచ్చారు. అదే కాదు.. ఇంటికో ఉద్యోగం అని ఆచరణ సాధ్యం కాని హామీ కూడా ఇచ్చారు. ఈ మేనిఫెస్టోను హోంమంత్రి అమిత్ షా స్వయంగా విడుదల చేశారు. అందులో ఉన్న హామీలను చూసి.. బెంగాలీలు ఆశ్చర్యపోతున్నారో లేదో కానీ.. చాలా మందికి గతంలో బీజేపీ ఇచ్చిన బెంచ్ మార్క్ హామీలు గుర్తుకు వస్తున్నాయి.

నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని.. మొదటిసారి ఎన్నికల్లో గెలవకముందు మోడీ హామీ ఇచ్చేవారు. అన్నిప్రచార సభల్లో చెప్పేవారు. చివరికి నల్లధనం వెనక్కి తేలేదు.. ఎవరికీ పైసా ఇవ్వలేదు. ఎన్నో చెబుతూంటాం కానీ అన్నీ చేస్తామా అని ఓ సందర్భంలో అమిత్ షా ఈ హామీ గురించి వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. ఇచ్చారో లేదో కానీ.. నోట్ల రద్దు, లాక్ డౌన్ వల్ల ఆ రేంజ్‌లో ఉద్యోగాలు పోయాయని మాత్రం చెప్పుకున్నారు.

ఇక పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి అప్పట్లో చేసిన ప్రచారాలు.. ఇప్పుడు చేస్తున్న పనులు అన్నీ కళ్ల ముందు కనిపిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ బీజేపీ బెంగాల్‌లో ఏమాత్రం మొహమాటానికి పోకుండా పెద్ద ఎత్తున ఉచిత హామీలు గుప్పించింది. అమలు చేస్తారా లేదా అన్నది తర్వాతి సంగతి. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఓట్లేసినట్లేగా వేస్తే చాలన్నట్లుగా పరిస్థితి ఉంది. ప్రచార వ్యూహంలోనూ బీజేపీ తడబడుతోంది.

సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నిస్తోంది. ఇక టీవీ ప్రచార కార్యక్రమాలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెంగాల్ ప్రజల అమాయకత్వాన్ని ఓట్లుగా మార్చుకోవడానికి అసాధ్యమైన విషయాలను మోడీ మాత్రమే చేయగలరంటూ ప్రచారం చేసుకోవడం.. ప్రజల్ని విస్తుపరిచేలా చేస్తోంది. అయినా బీజేపీ మాత్రం తన దారిలోనే తాను వెళ్తోంది. బెంగాల్ ప్రజలు బీజేపీ మేనిఫెస్టో చేతికి చిక్కుతారా.. లేదా అనేది చూడాలి మరి. ఫైనల్‌గా ఎన్నికలు పూర్తయి లెక్కింపు కూడా పూర్తయితే కానీ తెలియకుండా ఉంది.