Tamil Nadu Elections: అప్పట్లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆయన ఏ టెంపో లో ఉన్నారో తెలియదు కాని.. టాటా.. ఖతం.. గుడ్ బై అని వ్యాఖ్యానించారు. ఆ మాటలు సోషల్ మీడియాలో మీమర్స్ కు ఎంతో లాభం చేకూర్చాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయిన ప్రతి సందర్భంలోనూ మీమర్స్ రాహుల్ గాంధీ అన్న మాటను వాడుకోవడం మొదలుపెట్టారు. చివరికి ఇప్పుడు రాహుల్ గాంధీ మాటను నిజం చేసి చూపిస్తున్నారు తమిళనాడు ఆపధర్మ ముఖ్యమంత్రి స్టాలిన్.
నాలుగు రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతానికి ఇటీవల ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఉంది. తమిళనాడులో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లో ఫలితం రాబోతోంది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ ఒకటి మినహా మిగతావన్నీ కూడా స్టాలిన్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నాయి. ఆయన అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఆకట్టుకున్నాయని.. అందువల్లే డీఎంకే పార్టీకి మరోసారి అధికారం దక్కబోతుందని తమ ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేశాయి.
ఈ అంశాలను డీఎంకే పార్టీ సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. అందువల్లే ఎన్నికల ఫలితాలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీతో డీఎంకే తెగదెంపులు చేసుకోవాలని భావిస్తున్నట్లు టైమ్స్ నౌ వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీలేని లౌకిక కూటమి కోసం డీఎంకే ప్రయత్నిస్తోందని టైమ్స్ నౌ తన కథనంలో స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డీఎంకే లోని కీలకవర్గాలు తమకు చెప్పినట్టు టైమ్స్ తన కథనంలో వివరించింది. తమిళనాడులో ఇప్పటికే డీఎంకే అధికారంలోకి వస్తుందని చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, పీపుల్ పల్స్ వంటి సంస్థలు అంచనా వేశాయి. అయితే డిఎంకెకు టీవీకే నుంచి గట్టి పోటీ ఎదురవుతుందని ఈ యాక్సిస్ మై ఇండియా, టు డేస్ చాణక్య వెల్లడించాయి.
కాంగ్రెస్ పార్టీ ఇటీవల పశ్చిమ బెంగాల్లో అక్కడి టీఎంసీకి వ్యతిరేకంగా వ్యవహరించింది. రాహుల్ గాంధీ మమతపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వాస్తవానికి ఇండియా కూటమిలో టిఎంసి ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ పశ్చిమబెంగాల్లో పోటీ చేసింది. అంతకుముందు ఢిల్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. అరవింద్ కేజ్రీవాల్ మీద రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. కనీసం చెప్పుకునే స్థాయిలో సీట్లు కూడా సాధించలేకపోయింది. ఇక ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డిఎంకె సూచించిన సీట్లలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ఫలితాలు రాకముందే డీఎంకే వర్గాల నుంచి తెగ తెంపుల వార్తలు వస్తున్నా నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని కీలక నాయకుల్లో కలవరం మొదలైంది. అయితే దీనిపై డిఎంకె అధికారికంగా ప్రకటన చేస్తేనే క్లారిటీ వస్తుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.