Pakistan Political Crisis: పాకిస్తాన్ లో అందరు ఊహించిందే జరిగింది. అవిశ్వాస తీర్మానం నెగ్గుతుందని ముందే తెలియడంతోనే ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తప్పించుకునే ప్రయత్నాలు చేసినా చివరకు విధి ఆడిన నాటకంలో ఇమ్రాన్ బలిపశువయ్యారు. 342 మంది సభ్యులున్న పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో ఇమ్రాన్ పదవీచ్యుతడయ్యారు. అవిశ్వాస తీర్మానం ఎదుర్కొని పదవి కోల్పోయిన తొలి ప్రధానిగా రికార్డులకెక్కారు.
పాకిస్తాన్ ముస్లింలీగ్ నవాజ్ పార్టీ అధినేత షెహబాజ్ షరీఫ్ (నవాజ్ షరీప్ సోదరుడు) ప్రధాని అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంలో విదేశీ హస్తం ఉందని ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్ శనివారం జరిగిన సమావేశానికి హాజరు కాలేదు. పదవి పోతుందనే భయంతోనే సభకు రాలేదని పలువురు సభ్యులు విమర్శలు చేశారు. ఓటమిని ముందే ఊహించి ఇమ్రాన్ సభకు గైర్హాజరయ్యారు.
Also Read: CM Jagan: క్యాబినెట్ ప్రక్షాళనతో జగన్.. ఆ ముఖ్యమంత్రుల సరసన చేరనున్నారా?
మొత్తానికి అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టకుండా అధికార పార్టీ సభ్యులు నానా తంటాలు పడ్డారు. ఒక్కో సభ్యుడు గంటల తరబడి మాట్లాడుతూ సభను రాత్రి వరకు కొనసాగించారు. కానీ ప్రతిపక్ష సభ్యులు మాత్రం ఓటింగ్ చేపట్టాలని గగ్గోలు పెట్టడంతో ఇక చేసేది లేక అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంతో తీర్మానం గెలిచింది. దీంతో ఇమ్రాన్ పదవి కోల్పోయారు. అనంతరం అధికార పార్టీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
సుప్రీంకోర్టు సూచనతోనే అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. ఉదయం నుంచి సభ కొనసాగగా అజెండాలో నాలుగో అంశంగా అవిశ్వాస తీర్మానం ఉండటంతో సుదీర్ఘ సమయం పట్టిందని తెలుస్తోంది. అయినా ప్రతిపక్షాలు తమ పంతం నెగ్గించుకున్నాయి. ఇమ్రాన్ ను పదవి నుంచి తప్పించి తన మాటకు తిరుగులేదని నిరూపించుకుంది. మొత్తానికి పాకిస్తాన్ లో కొనసాగుతున్న పరిణామాలపై భారత్ కూడా ఓ కన్నేసింది. ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తొలగించడంపై అన్ని కోణాల్లో గమనిస్తోంది. అది వారి అంతర్గత వ్యవహారమని భారతీయ విదేశాంగ శాఖ ప్రతినిధులు పేర్కొన్నారు.
Also Read:Hindi Controversy: అమిత్ షా ఎఫెక్ట్: హిందీ వర్సెస్ ప్రాంతీయ భాషలు
