China : చైనాది దా”రుణ” వైఖరి : డ్రాగన్ కు గట్టి షాకులిస్తున్న మోడీ

పాకిస్తాన్ కు చైనా సహాయం చేస్తున్న నేపథ్యంలో.. అదును కోసం ఎదురుచూస్తున్న నరేంద్ర మోడీ ఒక్కసారిగా జూలు విధిలించారు. చైనా చేస్తున్న దారుణాలను ఒక్కసారిగా బయటపెట్టారు.

Written By: NARESH, Updated On : August 27, 2023 6:45 pm

modi china

Follow us on

China : సరిహద్దుల్లో తరచూ చికాకులు కలిగిస్తున్న చైనాకు గుణపాఠం చెప్పే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకున్నారు. ఇకముందు ఏం చేయబోతారో తెలియదు కానీ.. చంద్రయాన్ విజయవంతమైన నేపథ్యంలో.. మన అంతరిక్ష విజయాన్ని గుర్తించని పక్షంలో చైనా మీద నరేంద్ర మోడీ విరుచుకుపడ్డారు. ఇప్పటికే కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ కు చైనా సహాయం చేస్తున్న నేపథ్యంలో.. అదును కోసం ఎదురుచూస్తున్న నరేంద్ర మోడీ ఒక్కసారిగా జూలు విధిలించారు. చైనా చేస్తున్న దారుణాలను ఒక్కసారిగా బయటపెట్టారు.

పరోక్షంగా తనకు అనుకూలంగా మలుచుకుంటున్నది

ఆర్థిక సమస్యల్లో చిక్కకున్న దేశాల పరిస్థితిని కొన్ని శక్తులు తమకు అనుకూలంగా మల్చుకుంటున్నాయని చైనాను ఉద్దేశించి ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఆయా దేశాల నిస్సహాయతను ఆసరాగా చేసుకొని వాటిని రుణవలయంలోకి దించుతున్నాయన్నారు. కెన్యా, లావోస్‌, మంగోలియా, పాకిస్థాన్‌ తదితర దేశాలు చైనా నుంచి వందల కోట్ల డాలర్ల అప్పులు తీసుకొని రుణసంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. 2021 నుంచీ ఈ సమస్యపై జీ20 దృష్టి పెట్టిందని, పేద, మధ్యాదాయ దేశాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచటానికి కృషి చేస్తోందని మోడీ చెప్పుకొచ్చారు. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు ఈ దేశాల ప్రగతి కూడా కీలకమని, అయితే, రుణవలయంలో చిక్కుకొని ఈ దేశాలు ఆ లక్ష్యాలపై తగినంత పెట్టుబడులు పెట్టలేకపోతున్నాయని మోదీ ధ్వజమెత్తారు. ప్రతీ దేశానికి ఆర్థిక క్రమశిక్షణ అత్యంత ముఖ్యమన్నారు.

బిజినెస్ టుడే కు ఇంటర్వ్యూ

భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో జీ-20 సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో, మోదీ ‘బిజినెస్‌ టుడే’ మ్యాగజైన్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఈ ఏడాది భారత్‌ అధ్యక్షతన జీ 20.. ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా రుణ పునఃవ్యవస్థీకరణ విషయంలో గణనీయమైన పురోగతి సాధించింది. భారత్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందు, కేవలం చాద్‌ దేశానికి మాత్రమే ఈ రుణ పునఃవ్యవస్థీకరణ అవకాశం లభించింది. ప్రస్తుతం భారత్‌ సారథ్యంలో జాంబియా, ఇథియోపియా, ఘనా దేశాలకు అవకాశం దక్కింది. అవి మెరుగైన ఫలితాలను సాధించాయి. జీ20కి సంబంధించిన ఇతర వేదికలు కూడా శ్రీలంకలో రుణ పునఃవ్యవస్థీకరణకు సహకరించాయి’’ అని మోడీ ప్రకటించారు. ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలను ఉపయోగించటంలో, వాటి వినియోగాన్ని ప్రోత్సహించటంలో భారత్‌ సాధించిన విజయాలను యావత్‌ ప్రపంచం గుర్తించిందని మోడీ కితాబిచ్చారు.

ఆవిష్కరణలకు భారత్ పుట్టిల్లు

‘‘ఆవిష్కరణలకు పుట్టినిల్లుగా భారత్‌ను ప్రపంచం చూస్తోంది. ప్రపంచంలోని డిజిటల్‌ చెల్లింపులలో 46 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయి. మన విధానాల విజయానికి ఇదొక మచ్చుతునక. ఆధార్‌, యూపీఐ, కొవిన్‌, ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన వంటి డిజిటల్‌ ప్రజా మౌలిక సదుపాయాలు లబ్ధిదారులకు నేరుగా సేవలను అందించాయి. సంక్షేమ ఫలాలను చిట్టచివరి వ్యక్తికి అందజేయటంలో టెక్నాలజీ గొప్పపాత్ర పోషిస్తుందని భారత్‌ ప్రపంచానికి చాటి చెప్పింది. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక సుస్థిరత లక్ష్యంగా భారత్‌ టెక్నాలజీని వినియోగించింది. దీనివల్ల పలు సూచీల్లో దేశం పరిస్థితి మెరుగైంది. ప్రజా సేవల రంగంలో డిజిటల్‌ టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్న భారత్‌పై అంతర్జాతీయ ఆర్థిక నిపుణులు ప్రశంసలు కురిపించారు. వివిధ దేశాధినేతలు కూడా నాతో సమావేశమైనప్పుడు దీని గురించి ప్రస్తావించారు. మన అనుభవాల నుంచి నేర్చుకోవటానికి పలు దేశాలు ఆసక్తి చూపుతున్నాయి’ అని మోడీ వివరించారు.