
అగ్రరాజ్యమైన అమెరికా సెప్టెంబర్ 11ను చరిత్రలో మరిచిపోదు. ఎందుకంటే అది వారికి దుర్దినం. న్యూయార్క్ ట్విన్ టవర్స్ మీద 9/11 దాడులు జరిగి నేటికి 19 ఏళ్లు. దాడిలో 3,000 మంది ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. ఘటన జరిగి ఇన్ని ఏళ్లు గడుస్తున్నా నాటి చేదు జ్ఞాపకాలు మాత్రం ఇంకా అక్కడి ప్రజల్లో అలాగే మిగిలి ఉన్నాయి.
Also Read: చైనా దొంగాట.. అమెరికా కనిపెట్టి షాకిచ్చింది
2001, సెప్టెంబరు 11న అమెరికా దేశంలోని వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఆల్ఖైదా ఉగ్రవాదులు జరిపిన దాడులు చరిత్ర మరవలేదు. ఒక్క అమెరికాయే కాదు ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా ఈ ఘటనతో ఉలిక్కిపడ్డాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలపై ఒసామా బిన్ లాడెన్ బృందం పక్కా వ్యూహంతో ఈ దాడులు జరిపాయి. ఉదయం 10 మంది ఆల్ఖైదా ఉగ్రవాదులు.. నాలుగు ప్రయాణికుల జెట్ విమానాలను దారి మళ్లించి న్యూయార్క్ ట్విన్ టవర్స్ పైకి వదిలారు. సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాలకు చెందిన వారే ఈ ఘటనకు పాల్పడినట్లుగా తర్వాతి దర్యాప్తులో వెల్లడైంది. అయితే.. ఈ దారుణానికి ఒడిగట్టిన ఉగ్ర ముఠాకు అప్పటిటి ఆల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ నేతృత్వం వహించారు. నాలుగు ప్రయాణికుల విమానాలను ఇస్లామిస్ట్ మిలిటెంట్లు హైజాక్ చేయగా.. వాటితోనే వరల్డ్ ట్రేడ్ సెంటర్, అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్తోపాటు, పెన్సిల్వేనియా ప్రాంతాల్లో ఉగ్రవాదులు దాడికి దిగారు. చూస్తుండగానే న్యూయార్క్ ట్విన్ టవర్స్ కుప్పకూలాయి. ఈ దాడుల్లో 3,000 మంది బాధితులు,19 మంది హైజాకర్లు మరణించారు.
బహుళ అంతస్తులతో కూడిన వరల్డ్ ట్రేడ్ సెంటర్ను రెండు విమానాలు ఢీకొనడంతో ఒక్కసారిగా వాటిలోని ఇంధనం చిల్లింది. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దాదాపు 1,000 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వల్ల భవనం పిల్లర్లు ఒక్కసారిగా విరిగాయి. స్లాబులు కూలిపోయాయి. పెద్దఎత్తున శబ్దాలతో భవనం నేలమట్టమైంది. ఇక మూడో విమానాన్ని హైజాకర్లు వాషింగ్టన్కు వెలుపల ఉన్న ఆర్లింగ్టన్, వర్జీనియాలోని పెంటగాన్పైకి వదిలారు. నాలుగో విమానాన్ని అందులోని కొందరు ప్రయాణికులు, విమాన సిబ్బంది ఎదురు తిరగడంతో గ్రామీణ పెన్సిల్వేనియాలోని షాంక్స్విల్లేకి సమీపంలో ఉన్న ఒక మైదాన ప్రాంతంలో కుప్పకూలిపోయింది. దీనిని హైజాకర్లు వాషింగ్టన్ డీసీ వైపునకు మళ్లించారు. విమానాల్లో ప్రయాణించిన ఏ ఎక్కరూ ప్రాణాలతో బయటపడలేదని వార్తా సంస్థలు వెల్లడించాయి.
Also Read: యుద్ధానికి స్టాప్: భారత్-చైనా కీలక నిర్ణయం
అయితే.. న్యూయార్క్ ప్రభుత్వ ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం, నాటి దాడుల్లో మూడు వేల మంది చనిపోయారు. ఇందులో నాలుగు విమానాలకు సంబంధించి ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది, సాధారణ పౌరులూ ఉన్నారు. అలాగే, సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక దళ సిబ్బంది, పోలీసులు 836 మంది మరణించారు. జంట భవనాలు కుప్పకూలిన ఘటనలో దుర్మరణం పాలైన మొత్తం బాధితుల్లో 343 మంది అగ్నిమాపక దళ సిబ్బంది, 60 మంది న్యూయార్క్ నగరం, పోర్ట్ అథారిటీలకు చెందిన పోలీసు అధికారులు ఉన్నారు. ఇంకా పెంటగాన్ భవనంపై జరిగిన దాడుల్లో 184 మంది సహాయక సిబ్బంది కూడా ప్రాణాలొదిలారు. మరణించిన వారిలో అత్యధిధికులు సాధారణ పౌరులే. వారిలో 70కి పైగా ఇతర దేశాలకూ చెందినవారు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.