
MLC Kavitha Vs BJP: ‘దమ్ముంటే నన్ను అరెస్టు చేయండి. ఈ సవాల్ చేసింది ఎవరో కాదు.. కల్వకుంట్ల ఇంటి ఆడబిడ్డ.. బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకునే కల్వకుంట్ల కవిత. వినడానికి, చదవడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉన్నా.. ఆమె నోటి నుంచి జాలువారిన పదాలే ఇవి. తెలంగాణ రాజకీయాల్లో కవిత ఇప్పుడు ట్రెండింగ్ లీడర్. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆమె అరెస్టుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. సిసోడియా అరెస్టు తర్వాత ఇక కవిత, కేజ్రీవాల్ తిహార్ జైలుకు వెళ్లడం ఖాయమని బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ కూతురి వ్యవహారం ఇప్పుడు అందరి నోళ్లలో నలుగుతోంది. చార్జిషీట్లో పలు పర్యాయాలు ఆమె పేరు చేర్చడంతో ఎప్పుడైనా అరెస్టు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందులోనూ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, కవిత సన్నిహితలుగా పేరున్న బోయినిపల్లి అభిషేక్రావు, శరత్ చంద్రారెడ్డిని ఇప్పటికే అరెస్టు చేశారు. ఇక కవిత అరెస్ట్ తప్పదని బీజేపీ నేతలు కొన్ని రోజులుగా చేస్తున్న విమర్శలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్గా రియాక్ట్ అయ్యారు. విపక్ష నేతలనే దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేశాయని ధ్వజమెత్తారు. ఏ ఏజెన్సీ ఎప్పుడు అరెస్ట్ చేయాలో బీజేపీ నేతలే చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు చెప్తే నన్ను అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అరెస్టులు అనేవి ఏజెన్సీలు చేయాలని, అందుకు భిన్నంగా బీజేపీ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారని విమర్శించారు. ఆ మాత్రం దానికి కేంద్ర ఏజెన్సీలు ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి చర్యలకు దిగితే బీజేపీ వారికి మర్యాద దక్కదని మీడియా ముఖంగా హెచ్చరించారు.
అరెస్టుపై కవితకు క్లారిటీ..
సీబీఐ, ఈడీ దూకుడుతో తన అరెస్టు విషయంలో కవిత క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. అరెస్టు చేస్తే సానుభూతి కోసం గేమ్ ప్లాన్ మొదలుపెట్టారు. అందులో భాగంగా ఆమె గత కొన్ని వారాలుగా జాతీయ అంశాల మీదనే ఫోకస్ చేసి కేంద్రాన్ని విమర్శిస్తున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. అదానీ విషయంలో హిండెన్బర్గ్ రిపోర్టు, బడ్జెట్లో సంక్షేమానికి తగ్గిన ప్రాధాన్యం, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకుల వేలం, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు విదేశీ బొగ్గు వంటి అంశాలతోపాటు ప్రత్యర్థి పార్టీలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతుంది అంటూ నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపును తగ్గించి పేదల పొట్ట కొదుతున్నరని హైలైట్ చేస్తున్నారు. చెన్నై, ముంబై నగరాల్లో జాతీయ మీడియా సంస్థలు నిర్వహించే సదస్సులు, ప్రత్యేక ఇంటర్వ్యూలలో నేషనల్ ఇష్యూస్పైనే ఆమె ఫోకస్ చేశారు.
తాజాగా మహిళా బిల్లు తలకెత్తుకుని..
తాజాగా కవిత మహిళా రిజర్వేషన్ బిల్లును తెరపైకి తెచ్చారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో దశలో మహిళా బిల్లు పెట్టాలనే డిమాండ్తో మార్చి 10న ఏకంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తున్నట్లు ప్రకటించింది. తన తండ్రి నాలుగున్నరేళ్లు తన మంత్రివర్గంలో మహిళకు స్థానం కల్పించకపోయినా, హైదరాబాద్లో జరిగిన అంతర్జాతీయ మహిళా సదస్సులో, మహిళా మంత్రి స్థానంలో తన అన్న కేటీఆర్ కూర్చున్నా నోరు మెదపని కవితకు ఇప్పుడు ఉన్నట్లుండి మహిళలు గుర్తొచ్చారు. బతుకమ్మ బాండ్ర్ అబాజిడర్గా చెప్పుకునే కవిత లిక్కర్ దందా చేస్తున్నప్పుడు తాను మహిళను అన్న విషయం కూడా గుర్తు లేదు. ల్కిర్ స్కాంలో ఇరుక్కుని మహిళా సమాజానికే మాయని మచ్చ తెచ్చిన ఆమె ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడడం నిజంగా నవ్వు తెప్పిస్తుంది. తాను ఎమ్మెల్సీగా ప్రాతినిధ్య వహిస్తున్న పార్టీకి తన తండ్రి అధ్యక్షుడు, సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్, రెండు పర్యాయాలు తెలంగాణలో అధికారంలోకి వచ్చారు. కానీ ఒక్కసారి కూడా 33 శాతం సీట్లు మహిళలకు కేటాయించలేదు. కల్వకుంట్ల వారి ఆడపడుచు అయిన కవిత కూడా టిక్కెట్ల కోసం అడుగలేదు. కానీ, లిక్కర్ స్కాం అరెస్ట్ నేపథ్యంలో ఆమెకు మహిళాలోకం, మహిళల సంక్షేమం, మహిళల హక్కులు గుర్తురావడం గమనార్హం.

సానుభూతి కోసం గ్రౌండ్ ప్రిపరేషన్..
ఇదంతా చేస్తుంటే తనను అరెస్ట్ చేస్తే కేంద్రాన్ని విమర్శించినందుకు, కక్ష కట్టి అరెస్ట్ చేశారనే సానుభూతి పొందాలనే వ్యూహంతోనే చేస్తున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. సీబీఐ, ఈడీ లాంటి సంస్థల ద్వారా రాజకీయ కక్షసాధింపునకు పాల్పడి లిక్కర్ స్కామ్లో వేధిస్తున్నారని చెప్పేందుకు ముందుగానే గ్రౌండ్ సిద్ధం చేసుకున్నారన్న వాదన వినిపిస్తోంది.
ఇక కవిత అరెస్టు ఖాయమని కేసీఆర్ కూడా డిసైడయ్యారట. అలా జరిగిన పక్షంలో పార్టీపై ప్రభావం పడకుండా కేంద్రంపై విరుచుకుపడేందుకు ప్లాన్ చేశారట. అందులో భాగంగానే కవిత ఇప్పుడు ఎక్కువ సమయం ఢిల్లీపై ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.