Site icon OkTelugu

Jammu Kashmir Anti Terror Operation: జమ్మూకశ్మీర్ లో ఏరివేత షురూ.. లెఫ్ట్ నెంట్ గవర్నర్ చేస్తోన్న సాహసోపేత పని ఇదీ

Jammu Kashmir Anti Terror Operation

Jammu Kashmir Anti Terror Operation

Jammu Kashmir Anti Terror Operation: జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత వేగవంతం అయింది. మార్చి 31 వరకు ఆపరేషన్‌ కగార్‌ పేరుతో అంతర్గతంగా పెద్ద సమస్యగా ఉన్న నక్సల్స్‌ ఏరివేత కొనసాగింది. ఇక ఇప్పుడు ఉగ్రవాదుల ఏరివేతపై కేంద్రం దృష్టిపెట్టింది. ఆర్మీ కశ్మీర్‌లోని ఉగ్రవాదులను ఏరివేస్తుండగా.. పాకిస్తాన్‌లో ఉంటున్న ఉగ్రవాద నేతలను అజ్ఞాత వ్యక్తులు హతమారుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు, ఉగ్ర నేతలకు మధ్య అనుసంధాన కర్తలుగా పనిచేస్తున్న ’ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్స్‌’ (ఓజీడబ్ల్యూ)పై జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ, ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందుతూ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న వారిని గుర్తించి, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ప్రకారం శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత ఇప్పటివరకు 90 మంది ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం గమనార్హం.

తాజాగా ఇద్దరు ఉద్యోగుల తొలగింపు..
లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తాజాగా ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి బర్తరఫ్‌ చేశారు. ఈ ఇద్దరూ ఉగ్రవాద సంస్థలతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్నట్లు విచారణలో తేలింది. హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ ఉగ్రవాద సంస్థకు నమ్మిన వ్యక్తిగా పనిచేస్తున్న ఫర్హత్‌ అలీఖాన్‌ డే విద్యాశాఖలో ఉద్యోగం చేస్తున్నాడు. 2011లో ఇతను అరెస్టు అయ్యాడు. ఉగ్రవాదిని అరెస్టు చేసిన పోలీసులు, ఆ ఉగ్రవాదికి ఫర్హత్‌ ఆశ్రయం కల్పించాడని గుర్తించి అతడిని అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా ఉగ్రవాద కార్యకలాపాలను ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్‌గా కొనసాగిస్తూ వచ్చాడు. దీంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. కారుణ్య నియామకం కింద గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగం పొందిన మహ్మద్‌ షఫీదార్‌ బందీపురాలో నివసిస్తున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో ఒక ఏకే–47 రైఫిల్‌తో పోలీసులకు దొరికాడు. విచారణలో ఉగ్రవాదులతో కలిసి ఉన్నట్లు తేలడంతో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు.

డ్రోన్ల ద్వారా బంగారం సరఫరా
ఉగ్రవాదులు డ్రోన్ల ద్వారా ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లకు డబ్బులకు బదులు బంగారాన్ని పంపుతున్నట్లు భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ ధనసహాయం ద్వారా ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పనులు చేస్తూ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్న వారిని గుర్తించడంలో భద్రతా యంత్రాంగం విజయం సాధిస్తోంది.

ఇద్దరు ఉగ్రవాదుల అరెస్టు
తాజాగా 16 ఏళ్లుగా జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరు పాకిస్తానీలను పోలీసులు పట్టుకున్నారు. అబుహురేరా, కుషాబ్‌ అనే ఈ ఇద్దరూ పాకిస్తాన్‌ నుంచి చొరబడి ఉగ్రవాద కార్యకలాపాలు సాగిస్తున్నారు. చిరు వ్యాపారుల్లా వేషం మార్చుకుని బిహార్, రాజస్తాన్‌లో తిరుగుతూ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను విస్తరించారు. వీరి అరెస్టుతో ఉగ్రవాద ముఠాలకు పెద్ద దెబ్బ తగిలింది.

ఆపరేషన్‌ శైలిలో మార్పు
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద వ్యవస్థను నిర్మూలించడానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించిన ’ఆపరేషన్‌ కగార్‌’ తరహాలో ఇప్పుడు జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత సాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం, డ్రోన్ల ద్వారా జరుగుతున్న ఆయుధ, డబ్బు సరఫరాను అడ్డుకోవడం, ప్రభుత్వ ఉద్యోగుల్లో చొచ్చుకుపోయిన ఉగ్ర అనుచరులను తొలగించడం జరుగుతోంది.

భద్రతా పరిస్థితిపై సమీక్ష
జమ్మూ కశ్మీర్‌లో భద్రతా పరిస్థితిని సమీక్షించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులు, ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లు, అనుచరులను లక్ష్యంగా చేసుకుని భద్రతా బలగాలు వ్యూహాత్మక ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఈ చర్యల వల్ల జమ్మూ కశ్మీర్‌లో శాంతిభద్రతలు మెరుగుపడటంతో పాటు, ఉగ్రవాద వ్యవస్థ క్షీణించింది.

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత తీవ్ర వేగంగా సాగుతోంది. ఒకవైపు భద్రతా బలగాలు ఎన్‌కౌంటర్లలో ఉగ్రవాదులను హతమార్చడం, మరోవైపు ఉగ్ర నేతలను అజ్ఞాత వ్యక్తులు హతమార్చడం, ఇంకొకవైపు ఓవర్‌గ్రౌండ్‌ వర్కర్లను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించడం జరుగుతోంది. ఈ బహుముఖ వ్యూహం ద్వారా ఉగ్రవాద వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Exit mobile version