Jagan vs Janasea : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల పేరుతో చేపడుతున్న ‘జగనన్న కాలనీలు’ అతి పెద్ద స్కాం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. భూమి కొనుగోలు, మౌలిక వసతులు పేరిట వేల కోట్లు అవినీతి చేశారన్నారు. జగనన్న కాలనీల పేరిట పేదవాడికి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నెల 12, 13, 14 తేదీల్లో ‘జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా తీసిన ఫోటోలు, వీడియోలను #JaganannaMosam హ్యాష్ ట్యాగ్ ద్వారా సోషల్ మీడియాలో పోస్టు చేసి ప్రభుత్వ తీరును ఎండగట్టాలని కోరారు. పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఒక చోట ఈ కార్యక్రమంలో పాల్గొని జగనన్న కాలనీలను పరిశీలిస్తారని తెలిపారు. బుధవారం హైదరాబాద్ పార్టీ కార్యాలయం నుంచి వీడియో విడుదల చేశారు.

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల 30వేల మందికి ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగా తొలి విడతలో 18,63,552 గృహాలు 2022 జూన్ నాటికి నిర్మించి పేదలకు అందిస్తామని చెప్పారు. ఆయన చెప్పిన గడువు ముగిసి ఐదు నెలలు కావొస్తోంది. రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన దాఖలాలు లేవు.
* భూ సేకరణలో దోపిడీ
జగనన్న కాలనీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 68,677 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.10 నుంచి రూ.20 లక్షలు విలువ చేసే ఎకరా భూమిని రూ. 70 లక్షలు నుంచి కోటి రూపాయలు పెట్టి కొనుగోలు చేశారు. సుమారు రూ.23,500 కోట్లు వెచ్చించి ఈ భూములు కొన్నారు. ఇందులో వందల కోట్లు చేతులు మారాయి. అలాగే మౌలిక సదుపాయాలు కోసం మరో రూ.34 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా జగనన్న కాలనీల్లో తాగునీరు, రోడ్లు వంటి కనీసం మౌలిక సదుపాయాలు లేవు. గృహ నిర్మాణ పథకానికి నిధులన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నవే. ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తోంది. అది కూడా ఇసుక రవాణాకు అయ్యే ఖర్చు లబ్ధిదారుడే భరించాలని కండీషన్ పెట్టింది. ఇస్తున్న ఇసుక కూడా ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో స్పష్టత ఇవ్వడం లేదు. 2022 జూన్ నాటికి 18,63,552 గృహాలు నిర్మిస్తామని చెప్పిన నాయకులు… ఇప్పటి వరకు కేవలం లక్ష 52వేల ఇళ్లను మాత్రమే నిర్మించారు. ఇంత దయనీయ పరిస్థితి ఎందుకొచ్చింది? పేదలను ఎందుకింత దగా చేశారు? ప్రజలకు సమాధానం చెప్పాలి.
* ప్రతిపక్ష పార్టీగా ఆ బాధ్యత మాపై ఉంది
జగనన్న ఇళ్లు పేరిట గత మూడున్నరేళ్లుగా జరుగుతున్న దోపిడీని ప్రపంచానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా జనసేనపై ఉంది. 2020లో పులివెందుల, కాకినాడ, విజయనగరంలో జగనన్న కాలనీలకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు. పైలాన్ వేశారు. జూన్ 2022 కల్లా తొలి విడత ఇళ్లను పూర్తి చేస్తామని చెప్పారు. గడువు దాటినా దీని గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం లేదు. ఈ నెల 12, 13 తేదీల్లో స్థానికంగా ఉన్న జగనన్న కాలనీలను సందర్శించి ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించాలి. 14వ తేదీన పథకం లబ్ధిదారుల జాబితా, వారికి ఏ మేరకు నిధులు విడుదల చేశారు, మౌలిక సదుపాయాల కల్పన ఖర్చులు లాంటి అంశాలపై సోషల్ ఆడిట్ చేస్తారు. గతంలో రహదారుల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ఏ విధంగా ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేశామో… అదే విధంగా #JaganannaMosam అనే హ్యాష్ ట్యాగ్ తో ఇళ్ల దుస్థితి, కాలనీల పరిస్థితి, గృహనిర్మాణ లబ్ధిదారుల బాధలను తెలియజేసే ఫోటోలు, వీడియోలు అప్ లోడ్ చేయాలని జనసేన శ్రేణులకు, అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. స్థానిక నాయకులు, జనసైనికులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. జగన్ సర్కార్ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.