Site icon OkTelugu

Special OPS2 Web Series : భారత డిజిటల్ రంగంపై విదేశీ కుట్ర.. ఏ స్థాయిలో అంటే?

Cyber Crime

Cyber Crime

Special OPS2 Web Series సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం విశాల్ డబ్బింగ్ సినిమా అభిమన్యుడు తెలుగులో విడుదలైంది. సాధారణ చిత్రంగా విడుదలైన ఆ సినిమా ఘన విజయం సాధించింది. అందులో సైబర్ నేరాలు జరుగుతున్న తీరు.. విదేశాల నుంచి వివిధ కంపెనీలు మన డిజిటల్ కార్యకలాపాల మీద దాడి చేస్తున్న తీరు ఆ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. అది ఒక రకంగా సంచలనం సృష్టించింది. నిజంగా ఇలా జరుగుతుందా? ఇలా సాధ్యమవుతుందా? అనే ప్రశ్నలను అందరిలో రేకెత్తించింది.. కానీ ఆ సినిమా లో చూపించినట్టుగానే నేటి కాలంలో సైబర్ నేరాలు జరుగుతున్నాయి.. జేబుకు తెలియకుండా పర్స్ కొట్టేసినట్టు.. మన ప్రమేయం లేకుండానే మన ఖాతాలో నుంచి డబ్బులు దోచుకుంటున్న దుర్మార్గులు పెరిగిపోయారు.. దారుణమైన వైట్ కాలర్ నేరాలకు పాల్పడుతూ అడ్డగోలు వ్యవహారాలకు పాల్పడుతున్నారు.

మన దేశం మీద సైబర్ దాడులకు పాల్పడుతూ.. మన దేశ ప్రజల సమాచారాన్ని విదేశీ కంపెనీలు ఎలా తస్కరిస్తున్నాయో.. దానికోసం మన దేశం కేంద్రంగా పనిచేసే ముఠాలు, కంపెనీలు ఎలాంటి దారుణాలకు పాల్పడుతున్నాయో “స్పెషల్ ఓపీఎస్2” అనే ఒక వెబ్ సిరీస్ కళ్ళకు కట్టినట్టు చూపించింది. జియో హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతోంది.. ఈ వెబ్ సిరీస్ లో కొన్ని విషయాలను పక్కన పెడితే.. మిగతావన్నీ కూడా మన నిజ జీవితంలో జరుగుతున్న సంఘటనల మాదిరిగానే ఉన్నాయి. మనకు తెలియకుండానే ఇంకో వ్యక్తి బ్యాంకు కార్యకలాపాలలో ప్రవేశించడం.. మనకు తెలియకుండానే నగదు తస్కరించడం వంటి ఘటనలను ఇందులో కళ్లకు కట్టినట్టు చూపించారు.. వాస్తవానికి మనం వాడుతున్న ఫోన్ నెంబర్.. సర్వీస్ ప్రొవైడర్, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుస్తుంది. ఎక్కడ విదేశాలలో ఉన్న మోసగాళ్లకు ఎలా తెలుస్తుంది? అంటే మన సమాచారాన్ని ఎవరో వారికి విక్రయిస్తున్నారు. ఇలా మన దేశంలో ఉన్న కొన్ని ముఠాలు విదేశీ కంపెనీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. వారేమో మన సొమ్మును తస్కరిస్తున్నారు. బ్యాంకు ఖాతాలు కావచ్చు.. డిజిటల్ చెల్లింపులు కావచ్చు.. ఇంకా ఏదైనా లావాదేవీలు కావచ్చు.. వీటన్నింటిలోనూ విదేశీ కంపెనీలు ప్రవేశిస్తున్నాయి. ప్రవేశించడమే కాదు మనకు తెలియకుండానే మన వ్యవహారంలో వేలు పెడుతున్నాయి. అడ్డగోలుగా దండుకుంటున్నాయి.. ఇంతటి దారుణం జరిగిన తర్వాతే మనం మేల్కొంటున్నాం. చివరికి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ విధానంలో పెట్టుబడులు, డిజిటల్ అరెస్టు, పెట్టుబడి, మాదకద్రవ్యాలు వచ్చినట్టుగా పార్సిల్.. ఇలా అనేక విధానాలలో విదేశీ సైబర్ నేరగాళ్లు భారతీయుల మీద ఆర్థిక దోపిడీ చేస్తున్నారు.. ప్రతినెల 1000 కోట్ల వరకు దోపిడీ చేస్తున్నారంటే మన సమాచారం అంగట్లో సర్కుగా ఎలా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆగ్నే ఆసియా దేశాలకు చెందిన సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఆన్లైన్ మోసాల వల్ల భారతీయులు దాదాపు 7వేల కోట్ల వరకు కోల్పోయారు. థాయిలాండ్, లావోస్, మయన్మార్, కంబోడియా దేశాల నుంచి పనిచేస్తున్న నెట్వర్క్ లు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ నెట్వర్క్ లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తుండడం విశేషం. ఆన్లైన్ మోసాలలో సైబర్ పోలీసులు కేవలం కొంత పరిధిలో మాత్రమే నగదును రికవరీ చేయగలుగుతున్నారు. సింహభాగం నగదు మొత్తం నేరగాళ్ల ఖాతాలలోకి వెళ్లిపోతోంది.

Exit mobile version