Jagan Vs Ramoji Rao: రామోజీరావు..అదో బ్రాండ్ నేమ్. ఆయన ఏది పట్టినా బంగారమే. ఏ వ్యాపారంలో అడుగుపెట్టినా ఐశ్వర్యమే. పచ్చళ్ళు, పేపరు, టీవీలు, ఫిలిం సిటీల ఏర్పాటుతో వేల కోట్లు సంపాదించినా.. మీడియా మొగల్ గానే ఆయన సుపరిచితులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆయన కనుసన్నాల్లోనే నడవాలి. లేకుంటే మార్చేసేటంతటి శక్తిమంతుడు ఆయన. అందుకే ఆయన్ను టచ్ చేసేందుకు ఎవరూ సాహసించలేదు. అంతెందుకు ప్రత్యర్థుల గుండెల్లో వణకు పుట్టించే ఎన్టీఆర్ ను సైతం తన చెప్పుచేతల్లోకి తీసుకున్న నేర్పరి రామోజీరావు. తన మాట వినలేదని రోత రాతలతో ఎన్టీఆర్ కే వణుకు పుట్టించారు. అందుకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి సైతం రామోజీ విషయంలో చేయి పెట్టడానికి సాహసించలేకపోయారు. కానీ ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కు అంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? అంటూ సగటు రామోజీరావు చరిత్ర తెలిసిన వారు కాస్తా ఆశ్చర్యపోతున్నారు.
ఆ కారణాలతోనే ఫైట్..
ముద్రణ రంగంలో ఈనాడుది ప్రత్యేక శైలి. మీడియారంగంలో ఎన్నో పత్రికలు తెలుగునాట వచ్చినా ఈనాడును బీట్ అవుట్ చేయలేకపోతున్నారు. పాఠకుల అభిమానాన్ని చూరగొనలేకపోతున్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా పత్రికను మార్చడంలో రామోజీరావు స్టయిలే వేరు. తనకు వయసు పైబడుతున్నా.. తన ఆలోచనలకు కాదని డిజిటల్ మీడియా వైపు అడుగులేస్తున్న రామోజీరావు ఆలోచనల గురించి ఎంత చెప్పినా తక్కువే. పొద్దున లేచింది మొదలు తన ప్రభుత్వంపై రోత రాతలు రాస్తున్నారని జగన్ భావిస్తున్నారు. తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెరగడానికి ఇదే ప్రధాన కారణమని భావిస్తున్నారు. పైపెచ్చు తాను ఎన్టీఆర్, వైఎస్సార్ లాంటి భయపడే వ్యక్తిని కాదని ప్రూవ్ చేసుకునేందుకు రామోజీరావుపై గట్టి యుద్ధమే ప్రకటించారు. అందుకే ప్రస్తుతానికి వేటాడడానికే డిసైడ్ అయ్యారు. అలుపు వచ్చే వరకూ ఫైట్ కే మొగ్గుచూపుతున్నారు.
ప్రత్యర్థుల అభినందనలు..
అయితే జగన్ లో ఉన్న సాహస చర్యలే ఈ స్థాయికి తీసుకొచ్చాయి. నాడు శక్తిమంతురాలైన సోనియా గాంధీని వ్యతిరేకించి మొండి ధైర్యంతో ముందుకెళ్లారు. ప్రజల మనసులో నాయకుడిగా చోటు దక్కించుకున్నారు. తనను అణచివేసిన ప్రతి అంశాన్ని మెట్టుగా మలుచుకొని ఈ స్థాయికి చేరారు. ఇప్పుడు రామోజీరావు విషయంలో అదే స్ట్రాటజీతో ముందుకు సాగుతున్నారు. జగన్ పాలనాతీరును వ్యతిరేకించే వాళ్లు సైతం, రామోజీరావు విషయంలో చర్యల్ని మాత్రం అభినందిస్తున్నారు. రామోజీరావు వద్ద జీహుజూర్ అంటూ ఇంత కాలం వంగి వంగి నమస్కారాలు చేసిన ముఖ్యమంత్రులను చూశాం. కానీ ఫస్ట్ టైమ్ జగన్ రూపంలో రామోజీరావుకు ఎదురైన పరాభావాన్ని చూస్తున్నాం. అందుకే చాలామంది ప్రత్యర్థులు సైతం జగన్ ను అభినందించడం మొదలు పెట్టారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు టార్గెట్ గా..
ఇంతటి సాహసానికి జగన్ దిగారంటే వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది. బహుశా ఆయన ఒక నిర్ణయానికి వచ్చినట్టున్నారు. తాను పోరాడుతున్నది చంద్రబాబుతోనే కాదు.. దుష్ట చతుష్టయంతోనని ఇప్పటివరకూ చెబుతూ వచ్చారు. కానీ ఎప్పుడు స్ట్రయిట్ ఫైట్ కు దిగలేదు. ఫస్ట్ టైమ్ రామోజీరావుతో నేరుగా తలబడుతున్నారు. అది ఎన్నికలకు ఏడాది వ్యవధి ముందు. నాలుగేళ్లు వదిలేసి చివరి సంవత్సరంలో యుద్ధం ప్రకటించడం కూడా ఓకింత ఆశ్చర్యం వేస్తోంది. అయితే ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు.. అటు చంద్రబాబు..ఇటు రామోజీరావుకు చుక్కలు చూపించాలని డిసైడ్ అయ్యారు. అందుకే వేటగాడి మాదిరిగా రామోజీరావును వేటాడడడం మొదలుపెట్టారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆశ్యర్యం కలిగేలా ప్రమాదకర ఆట మొదలుపెట్టారు. ఈ ఆటలో అంతిమ విజేత ఎవరనేది కొద్దిరోజులు వేచిచూడాలి. అంతవరకూ వెయిట్ చేయక తప్పదుమరీ.