Homeఆంధ్రప్రదేశ్‌బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

బీజేపీ నేత, మాజీ మంత్రి మాణిక్యాలరావు మృతి

Manikyarao

బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు(59) శనివారం కన్నుమూశారు. నెలరోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. జూలై 4న ఓ వీడియో విడుదల చేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మాణిక్యాల రావు తొలుత హోం క్వారంటైన్లో ఉన్నారు. ఆ తర్వాత ఏలూరు కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. అయితే అక్కడ శ్వాసతీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తడంతో వారం రోజుల క్రితం విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అక్కడ ఆయనను వెంటిలేటర్ పై ఉంచి వైద్యులు చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు.

Also Read: ఆ టీడీపీ నేత ఒంటరి పోరాటం ఫలించేనా?

మాణిక్యాల రావు 1961 నవంబర్ 1న ఏపీలోని పశ్చిమ గోదావరిలోని తాడేపల్లిగూడెంలో జన్మించారు. అక్కడే ఆయన ప్రాథమిక విద్యనభ్యసించారు. తొమ్మిదేళ్ల వయస్సులోనే ఆయన ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. బీజేపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతారు. తాడేపల్లిగూడెంలో వివిధ వ్యాపారాలు చేశారు. 2014 ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా 14వేల మెజార్టీతో నాడు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2018 వరకు దేవదాయ,ధర్మాదాయ శాఖమంత్రిగా కూడా పనిచేశారు.

ఆర్ఎస్ఎస్, బీజేపీల్లో మాణిక్యాలరావు సుదీర్ఘకాలం పనిచేశారు. వివిధ పదవులు నిర్వహించారు. ఆయనకు జాతీయస్థాయి బీజేపీ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో ఫొటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన ఆర్ఎస్ఎస్‌లో స్వయంసేవక్‌గా తన ప్రస్థానం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1989లో బీజేపీ పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు.

Also Read: బీజేపీ లైట్.. కాంగ్రెస్ తోనే టీఆర్ఎస్ పోటీనా?

మాణిక్యాలరావు మృతిపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహరెడ్డి మాణిక్యాలరావు మృతికి సంతాపం వ్యక్తంచేసి ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని అధికారును ఆదేశించారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు సైతం మాణిక్యాలరావు మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. మాణిక్యాల రావుకు భార్య సూర్యకుమారి, కుమార్తె సింధు ఉన్నారు. ఆయన అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలోనే నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular