Site icon OkTelugu

KCR- Punjab Farmers: కేసీఆర్‌ ఇచ్చిన చెక్కులు బౌన్స్‌.. లబోదిబోమంటున్న పంజాబ్‌ రైతులు?

KCR- Punjab Farmers: పంజాబ్‌ రైతుల వద్ద తెలంగాణ పరువు పోయిందా.. కేసీఆర్‌ నిర్వాకంపై జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందా.. అంటే పొలిటికల్‌ సర్కిల్స్‌ నుంచి అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ ధనిక రాష్ట్రం.. తమది రైతు ప్రభుత్వం, రైతులకు ఎంత చేసినా తక్కువే.. తెలంగాణ రైతులను తామే దేశానికే ఆదర్శంగా నిలిపాం అని గప్పాలు కొట్టుకునే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పంజాబ్‌ రైతుల ముందు మన పనువు తీశాడు.

KCR- Punjab Farmers

రెండేళ్ల క్రితం కేంద్రం తెచ్చిన మూడు రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మరణించిన 709 మంది పంజాబ్‌ రైతుల కుటుంబాలను ఆదుకుంటానని కేసీఆర్‌ అప్పట్లో గొప్పగా ప్రకటించారు. ఈమేరకు గత మేలో పంజాబ్‌కు వెళ్లి మరీ.. 1010 చెక్కులు పంపిణీ చేశారు. అయితే కేసీఆర్‌ ఇచ్చిన చెక్కులు చెల్లడం లేదంటూ అక్కడి రైతులు కొందరు ఇక్కడి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ అంశంపై కేసీఆర్‌ను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.

బౌన్స్‌ విషయంపై సీరియస్‌..
తెలంగాణ చెక్కులు బౌన్స్‌ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంది. విచారణ చేసింది. చెక్కులన్నీ క్లియర్‌ అయ్యాయని అధికారులు చెబుతున్నారు. మేలో కేసీఆర్‌ 1010 చెక్కులను పంపిణీ చేశారని.. అందులో 814 చెక్కులకు నగదు చెల్లింపులు ఇప్పటికే జరిగాయని ప్రభుత్వం ప్రకటించింది. మిగతా చెక్కులు చెల్లింపులు జరగకపోవడానికి కూడా ప్రభుత్వం కారణం కాదన్నారు. బ్యాంకు నిబంధనల మేరకు, నిర్దేశిత 3 నెలల సమయం లోపల ఆ చెక్కులను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయాలి. అలా చేయకపోవడంతో మిగిలిన 196 చెక్కులకు నగదు చెల్లింపులు నిలిపివేశారని అధికారులు ప్రకటించారు. ఇది చెక్కులను నిర్దేశిత సమయంలో డిపాజిట్‌ చేయకపోవడం వల్ల జరిగిన సాంకేతిక పొరపాటే తప్ప మరోటికాదని సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు.

KCR- Punjab Farmers

గడువు ముగిసినా చెల్లించేలా..
మూడు నెలలోపు బ్యాంకులో డిపాజిట్‌ చేయలేకపోయిన చెక్కులకు కూడా చెల్లింపులు చేయాలని ఆయా బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఇంకా ఈ విషయానికి సంబంధించి మరింత సహాయం కోసం ప్రభుత్వ జాయింట్‌ సెక్రటరీ రాంసింగ్‌ ను సంప్రదించాలని సూచించింది. తెలంగాణ సర్కార్‌ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మాట నిజమే కానీ.. ఇలా పరాయి రాష్ట్రంలో వారికి చెల్లని చెక్కులిచ్చేంత దుర్భర స్థితిలో లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నారు. వారు సమయానికి చెక్కులు బ్యాంకులో వేసుకోకపోతే.. ప్రభుత్వాన్ని నిందించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

Exit mobile version