Chandrababu On Telangana: కొన్ని బంధాలు ఎందుకు కలుస్తాయో తెలియదు. ఫెవి కాల్ అంత గట్టిగా ఉంటాయి. వీణా వాణి తలలు పెన వేసుకున్నంత దృఢంగా ఉంటాయి. వాటిని విడదీయలేం. ఇలా అంటుకునే బంధాల్లో పరస్పర ప్రయోజనాలు ఉంటాయి. ధనం మూలం ఇదం జగత్ అన్నట్టు…ఆ డబ్బే కనుక లేకుంటే…ఎటువంటి రక్త సంబంధం లేకుండా బంధాలు ఎలా ఏర్పడతాయి? ఇవి ఇలా చిరకాలం ఎందుకు నిలబడతాయి. ఇలాంటి బంధాల గురించి తెలుగు నాట ప్రముఖంగా చెప్పాలి అంటే..సీఆర్ఆర్… స్థూలంగా చంద్రబాబు, రామోజీరావు, రాధా కృష్ణ. చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకున్నా .. అతడు వేసే ప్రతి అడుగులోనూ వీరి అను”కుల” రాతలు ఉంటాయి. ఆ రాతల్లో మొత్తం రోతలు ఉన్నా.. జానే దాన్.. రాధా,రామోజీ దృష్టిలో మా బాబోరు..గిప్పోరు..2020 విజినరు.. బాబు విషయంలో రామోజీ కొంచెం సంప్రదాయాన్ని పాటిస్తాడు. కానీ రాధా అయితే బరిబాతల యవ్వారమే. పచ్చ రంగు పూసి పోతరాజు చర్నా కోల్ తో కొట్టుకున్నట్టే ఉంటుంది.

జాకీలు పెట్టి లేపినా..
2018 లో ఢిల్లీ లో చక్రాలు తిప్పుతానని బయలు దేరిన బాబుకు రాధా, రామోజీ ” జయము.. జయము చంద్రన్నా” అంటూ అభయం ఇచ్చారు. కానీ చక్రాలు విరిగాయి. కూసాలు కదిలి 23 దగ్గరే ఆగిపోయాడు. ఇక అప్పటి నుంచి కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, వంశీ ఒక్కొక్కరు ఇచ్చే పంచ్ కు బాబు కు 70 ఎం ఎం సినిమా కనిపించింది. ఆఫ్ కోర్స్ బాబు హయాంలో జరిగిన దానికి వారు ప్రతీకారం తీర్చుకొన్నారు. ఏపీలో జగన్ బాగా వత్తుతున్న నేపథ్యం లో రామోజీ మార్గదర్శికి ఊపిరి ఆడడం లేదు. రాధా కృష్ణ ఆంధ్రజ్యోతి ప్రభుత్వ ప్రకటనలు రావడం లేదు. దీంతో మిత్రువు శత్రువు మనకు కూడా శత్రువు అనే థియరీ ని రామోజీ, రాధా అమల్లో పెట్టడం ప్రారంభించారు.
మళ్ళీ తమ బాబును జాకీ లు పెట్టి లేపే ప్రయత్నం చేస్తున్నారు.

నాడు బ్రీఫ్ చేసి.. నేడు స్వాగతం పలికి..
2015 లో జరిగిన ఓటుకు నోటు ఘటన నేటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనం. దీంతో దెబ్బకు బాబు ఆంధ్రాకు పరిమితం అయ్యాడు. కానీ చంద్రశేఖర్ రావు ఆరోజే బాబుకు పెద్ద రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు. కానీ తర్వాత కేసు కోల్డ్ స్టోరేజ్ కు వెళ్ళింది. కానీ అదే కేసీఆర్ ఇప్పుడు బీ ఆర్ ఎస్ ను ఏర్పాటు చేసి అదే బాబుకు తెలంగాణ లో అవకాశం కల్పిస్తున్నాడు. ఎలాగూ ఎదురు చూస్తున్న బాబు తన కులపోళ్లు ఎక్కువ ఉండే ఖమ్మం లో మీటింగ్ పెట్టాడు. ఎప్పటి లాగే తాను చేసిన పా వలా పనులకు రూపాయి స్థాయిలో ప్రచారం చేసుకున్నాడు. రాధాకు, రామోజీకి ఇదే కావాలి కాబట్టి.. హ శరభ.. హ శరభ అంటూ రాశారు. ఏకంగా మాస్టర్ హెడ్ ఎక్కించారు. దీనికి కౌంటర్ గా గులాబీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. బిడ్డా తెలంగాణలో అడుగు పెడితే జాగ్రత్త అని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామంతో రాధా, రామోజీ డంగయ్యారు. బాబు ను ఎలా లేపాలా అంటూ నిమ్మకాయలు పిసుక్కుంటున్నారు. ఈ తాలూకూ మీమర్స్ రూపొందించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.